PM Security breach: ఆ విషయంలో ఏం చర్యలు తీసుకున్నారో చెప్పండి?: కేంద్రం

ABN , First Publish Date - 2023-03-12T16:22:43+05:30 IST

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గత ఏడాది జనవరిలో పంజాబ్‌ (Punjab) పర్యటన సందర్భంగా తలెత్తిన భద్రతా లోపాల..

PM Security breach: ఆ విషయంలో ఏం చర్యలు తీసుకున్నారో చెప్పండి?: కేంద్రం

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) గత ఏడాది జనవరిలో పంజాబ్‌ (Punjab) పర్యటన సందర్భంగా తలెత్తిన భద్రతా లోపాల (Security Lapse) అంశం మరోసారి తెరపైకి వచ్చింది. భద్రతా వైఫల్యాలకు కారణమైన అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని తాజాగా పంజాబ్ ప్రభుత్వాన్ని కేంద్రం ఆదేశించింది. అధికారులపై చర్యల నివేదకను తమకు అందజేయాలని కోరింది. పంజాబ్ ఘటనపై విచారణకు గతంలో ఒక కమిటీని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసింది. పంజాబ్ పోలీసులు, అడ్మినిస్ట్రేటివ్ అధికారుల తప్పిదాల వల్లే సమస్య తలెత్తినట్టి కమిటీ నిర్ధారించింది. ఆ నివేదిక ఆధారంగా అధికారులపై ఇంతవరకూ తీసుకున్న చర్యలకు సంబంధించిన నివేదకను తమకు అందజేయాలని పంజాబ్ సర్కార్‌ను కేంద్రం తాజాగా ఆదేశించింది.

నాటి ఘటన వివరాలు...

ప్రధానమంత్రి 2022 జనవరి 5న పంజాబ్‌లో పర్యటించారు. ఫిరోజ్‌పూర్‌లో అభివృద్ధి ప్రాజెక్టులను ఆయన ప్రారంభించాల్సి ఉండటంతో విమానంలో బటిండాలో దిగారు. ఆ తర్వాత భారతదేశం-పాకిస్థా్న్ సరిహద్దు సమీపంలోని ఉన్న ఫిరోజ్‌పూర్‌కు ప్రయాణమయ్యారు. వ్యవసాయ చట్టాలను కేంద్రం ఉపసంహరించుకున్న తర్వాత పంజాబ్‌కు ఆయన రావడం ఇదే తొలిసారి. అయితే ప్రధాని పర్యటనకు రైతుల ఆందోళన అడ్డంకిగా మారింది. మోదీ పర్యటనను నిరసిస్తూ రైతులు ఎక్కడికక్కడ రోడ్లను దిగ్బంధించారు. మోదీ కాన్వాయ్ ముందుకు కదిలే పరిస్థితి లేకపోయింది. సుమారు 20 నిమిషాల పాటు ఆయన కాన్వాయ్ రోడ్డుపైనే అగిపోయింది. తర్వాత వెనుదిరిగి ఆయన ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లిపోయారు. ఈ ఘటనపై కేంద్ర హోం శాఖ సీరియస్ అయింది. భద్రతా లోపంపై వివరణ ఇవ్వాలని అప్పటి పంజాబ్ సీఎం చరణజిత్ సింగ్ చన్నీని ఆదేశించింది. అయితే, భారత ప్రధాని భద్రతా చర్యల్లో లోపం లేదని సీఎం వివరణ ఇచ్చారు. దీనిపై సుప్రీంకోర్టులో పిటిషన్ పడటంతో అప్పటి భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపి కీలక తీర్పు వెలువరించింది. ఈ ఘటనపై విచారించడానికి సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ ఇందు మల్హోత్రా నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ కమిటీలో సభ్యులుగా పంజాబ్-హర్యానా హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్, చండీగఢ్ డీజీపీ, ఎన్ఐఏ ఐజీ, పంజాబ్ ఏడీజీ (సెక్యూరిటీ) తదితరులు ఉంటారని ధర్మాసనం స్పష్టం చేసింది.

Updated Date - 2023-03-12T16:22:43+05:30 IST