Rahul Gandhi: మళ్లీ విదేశాలకు రాహుల్..?
ABN , First Publish Date - 2023-11-28T19:40:16+05:30 IST
కాంగ్రెస్ సీనియర్ నేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ మళ్లీ విదేశాలకు వెళ్లనున్నారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలు వచ్చేనెల 4వ తేదీ నుంచి ప్రారంభం కానున్న తరుణంలో రాహుల్ విదేశీ పర్యటనకు సంబంధించిన వార్తలు బయటకు వచ్చాయి. డిసెంబర్ 9 నుంచి ఇండోనేషియా, సింగపూర్, మలేషియా, వియత్నాంలలో రాహుల్ పర్యటించనున్నట్టు పార్టీ వర్గాల సమాచారం.
న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత, వయనాడు ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) మళ్లీ విదేశాలకు వెళ్లనున్నారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలు వచ్చేనెల 4వ తేదీ నుంచి ప్రారంభం కానున్న తరుణంలో రాహుల్ విదేశీ పర్యటనకు సంబంధించిన వార్తలు బయటకు వచ్చాయి. డిసెంబర్ 9 నుంచి ఇండోనేషియా, సింగపూర్, మలేషియా, వియత్నాంలలో రాహుల్ పర్యటించనున్నట్టు పార్టీ వర్గాల సమాచారం. సింగపూర్, మలేషియాలలో అక్కడి ఎన్ఆర్లను, దౌత్యవేత్తలను రాహుల్ కలుసుకుంటారని, వియత్నాం కమ్యూనిస్టు నేతలను కూడా కలుస్తారని తెలుస్తోంది.
కాగా, పార్లమెంటు శీతాకాల సమావేశాలు డిసెంబర్ 4న మొదలై 22వ తేదీతో ముగుస్తాయి. రాహుల్ గాంధీ విదేశీ పర్యటనే ఖరారైతే ఈసారి పార్లమెంటు సమావేశాల్లో ఆయన పాల్గొనే అవకాశాలు తక్కువగానే ఉండవచ్చు. ఈ లోక్సభ టెర్మెలో రాహుల్ హాజరు శాతం మొత్తంగా 53 శాతం ఉంది. గత శీతాకాల సమావేశాలకూ రాహుల్ పూర్తిగా దూరమయ్యారు. వచ్చే ఏడాది లోక్సభ ఎన్నికలు ఉండటం, గత వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టిన కీలక బిల్లులు ఈ శీతాకాల సమావేశాల్లో చర్చకు వచ్చే అవకాశం ఉన్న తరుణంలో రాహుల్ విదేశీ పర్యటన వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది.