OBC Reservation: అలహాబాద్ హైకోర్టు తీర్పుపై 'స్టే' ఇచ్చిన సుప్రీంకోర్టు

ABN , First Publish Date - 2023-01-04T17:47:44+05:30 IST

ఓబీసీ రిజర్వేషన్లతోనే యూపీ పురపాలక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌‌కు...

OBC Reservation: అలహాబాద్ హైకోర్టు తీర్పుపై 'స్టే' ఇచ్చిన సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ: ఓబీసీ రిజర్వేషన్ల (OBC Reservations)తోనే యూపీ పురపాలక సంస్థల ఎన్నికల(UP Urban body polls)కు వెళ్లాలని నిర్ణయించిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ (Yogi Adityanath)కు సుప్రీంకోర్టు (Supreme court)లో భారీ ఊరట లభించింది. ఓబీసీ రిజర్వేషన్ల ప్రసక్తి లేకుండానే యూపీ అర్బన్ బాడీ పోల్స్ నిర్వహించాలంటూ అలాహాబాద్ హైకోర్టు డిసెంబర్ 27న ఇచ్చిన సంచలన తీర్పుపై సుప్రీంకోర్టు మంగళవార నాడు 'స్టే' ఇచ్చింది.

అలహాబాద్ హైకోర్టు తీర్పున డిసెంబర్ 29న ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. ఇందుకు సంబంధించి స్పెషల్ లీవ్ పిటిషన్‌ (ఎస్ఎల్‌పీ) వేసింది. దీనిపై భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ విచారణ జరుపుతూ, స్థానిక సంస్థల యంత్రాగానికి విఘాతం కలుగకుండా డెలిగేషన్, ఫైనాన్సియల్ పవర్స్ జారీ చేసే స్వేచ్ఛ రాష్ట్ర ప్రభుత్వానికి ఉందన్నారు. దీనిపై సోలిసిటర్ జనరల్ తన వాదన వినిపిస్తూ, కొత్తగా ఏర్పాటు చేసిన కమిషన్ పదవీ కాలం 6 నెలలే అయినప్పటికీ 2023 మార్చి 31కి ముందే ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు.

ఐదుగురు సభ్యుల కమిషన్‌ ఏర్పాటు

ఓబీసీ రిజర్వేషన్ లేకుండానే లోకల్ బాడీ ఎన్నికలు జరపాలని అలహాబాద్ హైకోర్టు తీర్పు వెలువరించగానే యోగి ఆదిత్యనాథ్ సైతం అంతే పట్టుదలగా స్పందించారు. రిజర్వేషన్ లేకుండా ఎన్నికలకు వెళ్లేది లేదని స్పష్టం చేశారు. అంతే వేగంగా ఎన్నికల్లో రిజర్వేషన్లు కల్పించేందుకు ఐదుగురు సభ్యుల కమిషన్‌ను ఏర్పాటు చేశారు. రిటైర్డ్ జస్టిస్ రామ్ అవతార్ సింగ్ సారథ్యంలో ఏర్పాటయిన ఈ కమిషన్‌లో రిటైర్డ్ ఐపీస్ అధికారులు చౌబ్ సింగ్ వర్మ, మహేంద్ర కుమార్, రాష్ట్ర మాజీ న్యాయ సలహాదారులు సంతోష్ కుమార్, బ్రిజేష్ కుమార్ సోనిలు సభ్యులుగా ఉన్నారు.

Updated Date - 2023-01-04T17:49:48+05:30 IST