IND vs PAK: రిజర్వ్ డే రోజు కూడా వదలని వర్షం.. మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభం!

ABN , First Publish Date - 2023-09-11T16:07:33+05:30 IST

భారత్ vs పాకిస్థాన్ మ్యాచ్‌ను వరుణుడు వదలడం లేదు. ఆసియా కప్ సూపర్ 4లో భాగంగా రెండు జట్ల మధ్య ఆదివారమే పూర్తవ్వాల్సిన మ్యాచ్‌ను వరుణుడు అడ్డుకున్న సంగతి తెలిసిందే.

IND vs PAK: రిజర్వ్ డే రోజు కూడా వదలని వర్షం.. మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభం!

కొలంబో: భారత్ vs పాకిస్థాన్ మ్యాచ్‌ను వరుణుడు వదలడం లేదు. ఆసియా కప్ సూపర్ 4లో భాగంగా రెండు జట్ల మధ్య ఆదివారమే పూర్తవ్వాల్సిన మ్యాచ్‌ను వరుణుడు అడ్డుకున్న సంగతి తెలిసిందే. దీంతో మ్యాచ్‌ను రిజర్వ్ డే అయినా సోమవారానికి వాయిదా వేశారు. కానీ సోమవారం కూడా వరుణుడు కరుణించడం లేదు. ప్రస్తుతం మ్యాచ్ జరిగే కొలంబోలో పడుతుంది. దీంతో 3 గంటలకే ప్రారంభమవ్వాల్సిన మ్యాచ్ ఇంకా మొదలవలేదు. దీంతో మ్యాచ్ ప్రారంభం అవడానికి ఆలస్యం కానుంది. ఆదివారం నుంచే రెండు జట్లతో వర్షం దోబుచులాట ఆడుతోంది. భారత ఇన్నింగ్స్ 25వ ఓవర్ మొదటి బంతికి మొదలైన వర్షం ఆ తర్వాత మ్యాచ్ సాగడానికి అవకాశం ఇవ్వలేదు. మధ్యలో రెండు సార్లు ఆగినప్పటికీ మ్యాచ్ ప్రారంభించే లోపే మళ్లీ వచ్చింది. ఆదివారం కూడా అదే జరుగుతోంది. కొలంబోలో నేడు ఉదయం నుంచి వర్షం కాసేపు పడుతూ, కాసేపు ఆగుతూ ఉంది.


వాతావరణ నివేదికల ప్రకారం ఈ రోజంతా వాతావరణం ఇలానే ఉండే అవకాశాలున్నాయి. అయితే సాయంత్రం 7 గంటల తర్వాత వర్షం ఆగే అవకాశాలున్నాయి. కానీ మ్యాచ్ జరగాలంటే రాత్రి 10 గంటలలోపు పిచ్‌ను సిద్దం చేయాల్సి ఉంటుంది. కానీ నిన్నటి నుంచి వర్షం పడుతుండడంతో ఇది కష్టమనే చెప్పుకోవాలి. కాకపోతే మైదానాన్ని కవర్లతో పూర్తిగా కప్పి ఉంచారు. పిచ్ పాడవకుండా కాపాడడానికి పిచ్ క్యూరేటర్లు, గ్రౌండ్ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే ఆసల్యమైనా సరే ఓవర్లు కుదించి మ్యాచ్‌ను కొనసాగించాలని అంపైర్లు భావిస్తున్నారు. కానీ వర్షం కారణంగా ఆ అవకాశం కూడా లేకపోతే మ్యాచ్‌ రద్దయ్యే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. నిజానికి ఆసియా కప్‌లో భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌కు తప్ప మరే మ్యాచ్‌కు రిజర్వ్ డే లేదు. దీంతో ఆసియా క్రికెట్ కౌన్సిల్‌పై విమర్శలు కూడా వచ్చాయి. అయినప్పటికీ వాటిని పట్టించుకోకుండా దాయాదుల పోరుకు రిజర్వ్ డేను కేటాయించినప్పటికీ ఫలితం దక్కేలా లేదు.

WhatsApp Image 2023-09-10 at 17.11.58.jpeg


ఇక ఆదివారం వర్షం కారణంగా మ్యాచ్ నిలిచిపోయే సమయానికి భారత జట్టు 24.1 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 147 పరుగులు చేసింది. క్రీజులో విరాట్ కోహ్లీ(8), కేఎల్ రాహుల్ (17) ఉన్నారు. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ అదిరిపోయే ఆరంభాన్నిచ్చారు. ధాటిగా ఆడిన వీరిద్దరు మొదటి వికెట్‌కు 13.2 ఓవర్లలోనే సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ క్రమంలో ఇద్దరూ హాఫ్ సెంచరీలతో చెలరేగారు. రోహిత్ శర్మ ఆరంభంలో కాస్త నిదానంగా ఆడినప్పటికీ క్రీజులో కుదురుకున్నాక ధాటిగా ఆడాడు. మరోవైపు గిల్ మాత్రం ఆరంభం నుంచే ధాటిగా బ్యాటింగ్ చేశాడు. ఈ క్రమంలో గిల్ 37 బంతుల్లోనే హాఫ్ సెంచరీని పూర్తి చేసుకోగా.. రోహిత్ శర్మ 42 బంతుల్లోనే హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. వన్డేల్లో గిల్‌కు ఇది 8వ హాఫ్ సెంచరీ కాగా.. రోహిత్ శర్మకు 50వ హాఫ్ సెంచరీ.

WhatsApp Image 2023-09-10 at 14.21.32.jpeg

అయితే వీరిద్దరు స్వల్ప వ్యవధిలో ఔటయ్యారు. ఈ భాగస్వామ్యాన్ని 17వ ఓవర్‌లో పాక్ స్పిన్నర్ షాదాబ్ ఖాన్ విడదీశాడు. భారీ షాట్‌కు ప్రయత్నించిన రోహిత్.. ఫహీమ్ అష్రఫ్‌కు క్యాచ్ ఇచ్చాడు. దీంతో 121 పరుగుల వద్ద టీమిండియా మొదటి వికెట్ కోల్పోయింది. 49 బంతులు ఎదుర్కొన్న రోహిత్ శర్మ 6 ఫోర్లు, 4 సిక్సులతో 56 పరుగులు చేశాడు. ఆ కాసేపటికే షామీన్ ఆఫ్రిదీ బౌలింగ్‌లో గిల్ కూడా ఔటయ్యాడు. 52 బంతులు ఎదుర్కొన్న గిల్ 10 ఫోర్లతో 58 పరుగులు చేశాడు. దీంతో 123 పరుగులకు టీమిండియా ఓపెనర్లు వికెట్లు కోల్పోయింది. ఇక జట్టు స్కోర్ 24.1 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 147 పరుగుల వద్ద ఉండగా.. వర్షం ప్రారంభమైంది. ఆ తర్వాత రెండు సార్లు ఆగినప్పటికీ మళ్లీ తిరిగి ప్రారంభమైంది. దీంతో అంపైర్లు ఓవర్లు కుదించి మ్యాచ్ కొనసాగించడానికి ప్రయత్నించారు. కానీ 8 గంటల 35 నిమిషాలకు వర్షం మళ్లీ ప్రారంభవడంతో చేసేదేమి లేక సోమవారానికి వాయిదా వేశారు.


Updated Date - 2023-09-11T16:13:31+05:30 IST