Share News

TS Election: రాజగోపాల్‌రెడ్డి సంచలన నిర్ణయం.. బీజేపీకి గుడ్‌బై చెబుతూ కీలక ప్రకటన

ABN , First Publish Date - 2023-10-25T12:07:40+05:30 IST

అసెంబ్లీ ఎన్నికల వేళ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కమలం పార్టీకి గట్టి షాకిచ్చారు. బీజేపీకి రాజీనామా చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల ప్రకటించిన ఫస్ట్ లిస్ట్‌లో ఆయన పేరు లేకపోవడంతోనే

TS Election: రాజగోపాల్‌రెడ్డి సంచలన నిర్ణయం.. బీజేపీకి గుడ్‌బై చెబుతూ కీలక ప్రకటన

నల్గొండ: అసెంబ్లీ ఎన్నికల వేళ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి (Komatireddy Rajagopal Reddy) కమలం పార్టీకి (BJP) గట్టి షాకిచ్చారు. బీజేపీకి రాజీనామా చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల ప్రకటించిన ఫస్ట్ లిస్ట్‌లో ఆయన పేరు లేకపోవడంతోనే ఆయన పార్టీ మారబోతున్నారంటూ ఊహాగానాలు వినిపించాయి. ఆ వార్తలను నిజం చేస్తూ రాజగోపాల్‌రెడ్డి బీజేపీ రాజీనామాను ప్రకటించారు. మళ్లీ ఆయన సొంత గూటికే వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. ఎల్లుండి హస్తినలో సోనియా, రాహుల్ సమక్షంలో హస్తం గూటికి చేరనున్నారు. 2018 ఎన్నికల్లో మునుగోడు నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. తదనంతర పరిణామాలతో ఆయన కాంగ్రెస్‌కు రాజీనామా చేసి కాషాయం గూటికి చేరారు. తర్వాత జరిగిన మునుగోడు బైపోల్స్‌లో బీజేపీ నుంచి పోటీ చేసి అపజయం మూటగట్టుకున్నారు. దీంతో అప్పటి నుంచి ఆయన బీజేపీతో అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్నారు. తాజా రాజకీయ పరిణామాలతో తిరిగి సొంత గూటికి చేరాలని నిర్ణయం తీసుకున్నారు. తాజాగా బీజేపీకి రాజీనామా చేస్తూ ఈ మేరకు రాజగోపాల్‌రెడ్డి పత్రికా ప్రకటన విడుదల చేశారు.

లేఖలో..

‘‘కేసీర్ కుటుంబ దుర్మార్గపు పాలన నుంచి తెలంగాణను విముక్తి చేయాలనే నా ఆశయం. మరో ఐదు వారాల్లో నెరవేరుతుందని భావిస్తున్నాను. రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేకత తీవ్ర స్థాయిలో ఉంది. ప్రజలు మార్పును కోరుకుంటున్నట్టు స్పష్టమవుతోంది. ఏడాదిన్నర క్రితం తెలంగాణలో అధికార బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా ఎదిగిన బీజేపీ, ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో కొంత డీలా పడింది. ఇప్పుడు తెలంగాణ ప్రజలు అధికార బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్‌ను భావిస్తున్నారు. అందుకే నేను కూడా తెలంగాణ ప్రజల ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరించాలని నిర్ణయించుకున్నాను.’’ అని తెలిపారు.

తెలంగాణలో అవినీతి అరాచక నియంతృత్వ కుటుంబ పాలనకు చరమగీతం పాడే శక్తి భారతీయ జనతా పార్టీకే ఉందని భావించి 15 నెలల క్రితం నేను మునుగోడు ఎమ్మెల్యే పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిన విషయం అందరికి తెలిసిందే. గత ఏడాది అక్టోబర్ నెలాఖరున మునుగోడు అసెంబ్లీకి జరిగిన ఉప ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమీషా, బీజేపీ జాతీయ అధ్యక్షులు నడ్డా గారి ఆశీస్సులతో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి అధికార బీఆర్ఎస్ ను ఓడించినంత పని చేశాను. ఒక రాజకీయ యుద్ధం మాదిరిగా జరిగిన మునుగోడు ఉప ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్ 100 మంది ఎమ్మెల్యేలు మరో వంద మంది ఇతర సీనియర్ నేతలను ప్రచారంలోకి దింపి వందల కోట్లు ఖర్చు చేసి, భారీ స్థాయిలో అధికార దుర్వినియోగానికి పాల్పడినప్పటికీ స్వల్ప తేడాతో నెగ్గి, నైతికంగా ఓడింది. మునుగోడు ఉప ఎన్నికల్లో నా విజయం కోసం ప్రయత్నించిన బీజేపీ నేతలు కార్యకర్తలు శ్రేయోభిలాషులందరికీ మరోసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను.

అవినీతిలో మునిగిన కేసీఆర్ సర్కారుపై కేంద్రం చర్యలు తీసుకుంటుందన్న తెలంగాణ ప్రజల కోరిక నెరవేరకపోవడంతో రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారుతూ వచ్చాయి. అధికార బీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదగలేక పోవడంతో ఆ స్థానంలోకి కాంగ్రెస్ వచ్చింది. సకల జనుల పోరాటంతో సాకారమైన ప్రత్యేక తెలంగాణ పదేళ్ల కేసీఆర్ సర్కారు అరాచక పాలనతో గాడి తప్పింది. అధికార మార్పును కోరుకుంటున్న తెలంగాణ ప్రజల ఆలోచనలకు అనుగుణంగానే నేను కాంగ్రెస్ లో చేరాలని నిర్ణయించుకున్నాను. తప్పనిసరి పరిస్థితుల్లోనే బీజేపీకి రాజీనామా చేస్తున్నాను. మునుగోడు ఉప ఎన్నిక ద్వారా నాకు నియంతృత్వ కేసీఆర్ సర్కారుపై యుద్ధం చేసే అవకాశం కల్పించిన బీజేపీకి ధన్యవాదాలు. కేసీఆర్ సర్కారుపై యుద్ధం చేయాలని ప్రోత్సహించిన కేంద్ర మంత్రి అమిత్ షాకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. తెలంగాణ ప్రజల ఆలోచనల మేరకు పార్టీ మారాలని నేను తీసుకున్న నిర్ణయాన్ని బీజేపీ పెద్దలు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను.

నాడు కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరినా, నేడు బీజేపీ నుంచి కాంగ్రెస్ లోకి మారుతున్నా లక్ష్యం మాత్రం ఒకటే. కేసీఆర్ కుటుంబ అవినీతి, అరాచక, అప్రజాస్వామిక పాలన నుంచి రాష్ట్రాన్ని విముక్తి చేయడమే. నేను ఏనాడూ పదవుల కోసం ఆరాటపడలేదు, తెలంగాణ ప్రయోజనాల పరిరక్షణ కోసమే తపన పడ్డాను. నియంత కేసీఆర్ పాలనను అంతమొందించేందుకు కాంగ్రెస్ లో చేరుతున్న నన్ను ఆదరించాలని రాష్ట్ర ప్రజలని కోరుతున్నాను.’’ అని రాజగోపాల్‌రెడ్డి లేఖలో పేర్కొన్నారు.

Updated Date - 2023-10-25T12:37:09+05:30 IST