Share News

Amaravati : ఇంజనీరింగ్‌ కనీస ఫీజు 43 వేలు

ABN , Publish Date - Jul 19 , 2024 | 04:20 AM

ఇంజనీరింగ్‌ కోర్సుల కనీస ఫీజును రూ.43వేలుగా నిర్ణయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల ఇచ్చిన జీవోలో కనీస ఫీజు రూ.40వేలుగా పేర్కొంది. గతేడాది కనీస ఫీజు రూ.43 వేలుగా ఉందని...

Amaravati : ఇంజనీరింగ్‌ కనీస ఫీజు 43 వేలు

  • రూ.3 వేలు పెంచుతూ ఉత్తర్వులు జారీ

అమరావతి, జూలై 18(ఆంధ్రజ్యోతి): ఇంజనీరింగ్‌ కోర్సుల కనీస ఫీజును రూ.43వేలుగా నిర్ణయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల ఇచ్చిన జీవోలో కనీస ఫీజు రూ.40వేలుగా పేర్కొంది. గతేడాది కనీస ఫీజు రూ.43 వేలుగా ఉందని, ఇప్పుడు ఇంకా తగ్గిందని కాలేజీల యాజమాన్యాలు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చాయి. అలాగే గతేడాది యాజమాన్యాలు ఫీజులపై హైకోర్టుకు వెళ్లగా దానిపై న్యాయస్థానం ఆదేశాలు ఇటీవల వెలువడ్డాయు. ఈ నేపథ్యంలో కనీస ఫీజును రూ.3వేలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇది ప్రస్తుత విద్యా సంవత్సరానికే వర్తిస్తుందని స్పష్టం చేసింది. అయితే రూ.1.05 లక్షలుగా నిర్ణయించిన గరిష్ఠ ఫీజులో మాత్రం ఎలాంటి మార్పులు ఉండవు. తాజా నిర్ణయంతో 120కి పైగా కాలేజీలకు మేలు జరగనుంది. మరోవైపు ఎంటెక్‌ కనీస ఫీజు రూ.50వేలుగా నిర్ణయిస్తూ ఉన్నత విద్యాశాఖ మరో ఉత్తర్వు జారీ చేసింది. 178 కాలేజీలకు ఎంటెక్‌ ఫీజులు ఖరారు చేసింది. గరిష్ట ఫీజు రూ.90వేలుగా నిర్ణయించింది. ఈ ఫీజులు ప్రస్తుత విద్యా సంవత్సరానికే వర్తిస్తాయని స్పష్టంచేసింది.

ఇంజనీరింగ్‌ కాలేజీ మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్‌ కృతజ్ఞతలు

పెదకాకాని, జూలై 18: ఏపీలో ఇంజనీరింగ్‌ విద్యాభివృద్ధికి, వెనుకబడిన కళాశాలల అభివృద్ధికి తోడ్పాటును అందిస్తూ రాష్ట్ర ప్రభుత్వం చూపిన చొరవ ప్రశంసనీయమని ఏపీ ఇంజనీరింగ్‌ కాలేజీ మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ వాసిరెడ్డి విద్యాసాగర్‌ తెలిపారు. గురువారం జరిగిన సంఘం సమావేశంలో విద్యాసాగర్‌ మాట్లాడారు. గత పదేళ్లలో ఎన్నడూ లేని విధంగా మొదటి దశ కౌన్సెలింగ్‌ను త్వరితగతిన పూర్తిచేసి జూలై 19 నుంచి తరగతులు ప్రారంభించేలా చొరవ తీసుకున్న సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్‌లకు ఏపీ ఇంజనీరింగ్‌ కాలేజీ మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్‌ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. లోకేశ్‌ చొరవతో గత సంవత్సరం కంటే అదనంగా 20 వేల మంది విద్యార్థులు రాష్ట్రంలో ఇంజనీరింగ్‌ విద్యను అభ్యసించే సౌలభ్యం కలిగిందని తెలిపారు. కళాశాలల ఫీజులు రూ.43వేల నుంచి గరిష్ఠంగా రూ.1.05 లక్షల వరకు అమలు చేసినందుకు, విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అమలు చేస్తున్నందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈభేటీలో సంఘం ప్రధాన కార్యదర్శి మధుసూదన్‌ రావు, ఉపాధ్యక్షుడు కంచర్ల శ్రీకాంత్‌(ఎమ్మెల్సీ), ట్రెజరర్‌ సత్యనారాయణ, సభ్యులు రాజలింగం, రాంమోహనరావు పాల్గొన్నారు.

Updated Date - Jul 19 , 2024 | 04:20 AM