Share News

AP ELECTIONSG : రణరంగం

ABN , Publish Date - May 14 , 2024 | 01:28 AM

పోలింగ్‌ కేంద్రాల వద్ద వైసీపీ కవ్వింపులు.. బెదిరింపు చర్యలకు దిగింది. టీడీపీ వర్గీయులు ఎదురు తిరిగినచోట కర్రలు, రాళ్లతో విరుచుకుపడింది. ఈ దాడులలో పలువురు ఓటర్లు, టీడీపీ వర్గీయులు, ఓ బీఎస్‌ఎఫ్‌ జవాను గాయపడ్డారు. తాడిపత్రి, కళ్యాణదుర్గం, గుంతకల్లు, ఉరవకొండ నియోజకవర్గాలలో ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఓటమి భయంతో.. పోలింగ్‌ను అడ్డుకునేందుకు వైసీపీవారు ఇలా వ్యవహరించారని టీడీపీ కూటమి అభ్యర్థులు మండిపడ్డారు....

AP ELECTIONSG : రణరంగం
Both sides throwing stones

పోలింగ్‌ కేంద్రాల వద్ద వైసీపీ కవ్వింపులు.. బెదిరింపు చర్యలకు దిగింది. టీడీపీ వర్గీయులు ఎదురు తిరిగినచోట కర్రలు, రాళ్లతో విరుచుకుపడింది. ఈ దాడులలో పలువురు ఓటర్లు, టీడీపీ వర్గీయులు, ఓ బీఎస్‌ఎఫ్‌ జవాను గాయపడ్డారు. తాడిపత్రి, కళ్యాణదుర్గం, గుంతకల్లు, ఉరవకొండ నియోజకవర్గాలలో ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఓటమి భయంతో.. పోలింగ్‌ను అడ్డుకునేందుకు వైసీపీవారు ఇలా వ్యవహరించారని టీడీపీ కూటమి అభ్యర్థులు మండిపడ్డారు.

దాడిపత్రి

వీధుల్లో తలపడ్డ వైసీపీ, టీడీపీ వర్గీయులు

వైసీపీ రాళ్లదాడిలో పలువురికి గాయాలు

తాడిపత్రి టౌన: పోలింగ్‌ రోజున తాడిపత్రి రణరంగంగా మారింది. వైసీపీ, టీడీపీ వర్గీయుల రాళ్లదాడులతో దద్దరిల్లి పోయింది. ఓంశాంతినగర్‌ పోలింగ్‌ కేంద్రం వద్ద వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పెద్దారెడ్డి కుమారుడు హర్షవర్ధనరెడ్డి ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారన్న సమాచారం అందుకున్న టీడీపీ అభ్యర్థి జేసీ అశ్మితరెడ్డి అక్కడికి వెళ్లారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన పెద్దారెడ్డి పోలింగ్‌ కేంద్రంలోకి వెళ్లే ప్రయత్నం చేశారు. ఆయనకు జేసీ అనుచర వర్గం ఎదురుపడింది. దీంతో ఒకరికొకరు కేకలు వేసుకుంటూ మీరెంత అంటే మీరెంత అంటూ వాగ్వాదానికి దిగారు. మాటమాట పెరిగి రాళ్లు రువ్వుకున్నారు. దీంతో బీఎ్‌సఎఫ్‌ జవానతోపాటు మరో నలుగురు వృద్ధ ఓటర్లకు గాయాలయ్యాయి. పెద్దారెడ్డి రెండుకార్లు, జేసీ అశ్మితరెడ్డి కారు అద్దాలను ధ్వంసం చేశారు. డీఐజీ షేముషి, ఎస్పీ అమిత బర్దర్‌, అడిషనల్‌ ఎస్పీ రామకృష్ణ సంఘటనా స్థలానికి చేరుకొని ఇరువర్గాలను చెదరగొట్టారు. దీంతో పోలింగ్‌ సజావుగా సాగింది.


ఎవర్రా నువ్వు? ఎందుకు వచ్చావ్‌..?

‘నీకు తాడిపత్రిలో ఏం పని? నువ్వు రాయదుర్గంలో చూసుకోవాలి కదా? ఎవర్రా నువ్వు? ఎందుకు వచ్చావ్‌?’ అంటూ మాజీ ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డిపై వైసీపీ అభ్యర్థి పెద్దారెడ్డి దూషించారు. పాతకోటలో పోలింగ్‌ కేంద్రం వద్ద పోలింగ్‌ సరళిని పరిశీలించడానికి వచ్చిన దీపక్‌రెడ్డిని చూసి పెద్దారెడ్డి రెచ్చిపోయారు. డీఎస్పీ గంగయ్య జోక్యం చేసుకుంటూ పెద్దారెడ్డికి సర్దిచెబుతూ పక్కకు తీసుకువెళ్లారు. విషయం తెలుసుకున్న జేసీ ప్రభాకర్‌రెడ్డి అక్కడకు చేరుకొని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో ‘అతనెందుకు వచ్చాడు? వెళ్లిపోమను’ అంటూ అడిషనల్‌ ఎస్పీ రామకృష్ణపై పెద్దారెడ్డి చిందులు వేశారు. ‘నాపై దాడిచేసేందుకు తెలుగుదేశం పార్టీ వారితో సుపారీ తీసుకున్నావా?’ అని విరుచుకుపడ్డాడు. డీఎస్పీ ఇరుపార్టీలకు సర్దిచెప్పి పంపించారు.

జేసీ పవనను అడ్డుకున్న పోలీసులు

పట్టణంలో పోలింగ్‌ సరళిని పరిశీలించేందుకు వెళుతున్న టీడీపీ నాయకుడు జేసీ పవనరెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. నందలపాడు ఫ్లైఓవర్‌ వద్ద వెళుతున్న జేసీ పవనరెడ్డి కారును డీఐజీ షేముషి, డీఎస్పీ గంగయ్య నిలిపారు. మందీమార్బలంతో వెళ్లకూడదని సూచించారు. దీంతో పెద్దారెడ్డి తనయులు మందీమార్బలంతో వెళుతుంటే మీరేం చేస్తున్నారని జేసీ పవనరెడ్డి వారిని ప్రశ్నించారు. ముందుగా వారిని హౌస్‌ అరెస్ట్‌ చేయాలని, తర్వాత తానే ఇంటికి వెళ్లిపోతానని అన్నారు.


టీడీపీ ఏజెంట్లపై దాడి

పాతకోట, వైఎ్‌సఆర్‌ కమ్యూనిటీహాలు పోలింగ్‌కేంద్రాల్లో ఉన్న టీడీపీ ఏజెంట్లు అసిఫ్‌, బాషాపై వైసీపీ మద్దతుదారులు దాడిచేశారు. వైసీపీ నాయకులు ప్రలోభపెడుతుండటాన్ని గమనించిన టీడీపీ ఏజెంట్లు ప్రశ్నించారు. మాటమాట పెరిగి టీడీపీ ఏజెంట్లపై పిడిగుద్దులు గుద్దారు. దీపక్‌రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకొని బాధితులను పరామర్శించారు.

రాళ్ల వర్షం

యాడికి మండలంలోని కోనుప్పలపాడులో టీడీపీ వర్గీయులు శేఖర్‌, ఓబన్న, కేశవ, చంద్రలపై వైసీపీ వర్గీయులు చంద్రబాబు, గంగిరెడ్డి దాడిచేశారు. పోలింగ్‌ కేంద్రం వద్ద ప్రచారం నిర్వహిస్తున్నారని టీడీపీ వర్గీయులు అడ్డుకున్నారు. దీంతో ఒకరికొకరు రాళ్లు, కట్టెలతో దాడులు చేసుకున్నారు. పెద్దవడుగూరు మండలం దిమ్మగుడిలో టీడీపీ, వైసీపీ వర్గీయులు దాడులు చేసుకున్నారు. దాడుల్లో ఒకరికి గాయాలయ్యాయి. పెద్దపప్పూరు మండలంలోని వరదాయపల్లి గ్రామంలో పోలింగ్‌ బూతలోకి వైసీపీ మద్దతుదారుడు దూసుకురావడంతో టీడీపీ వర్గీయులు అడ్డుకున్నారు మాటమాట పెరిగి దాడులు చేసుకున్నారు. ఈ దాడుల్లో టీడీపీ మద్దతుదారుడు నారాయణస్వామి, శ్రీనివాసులు గాయపడ్డారు.

ఓబులాపురంలో ఘర్షణ

పుట్లూరు మండలంలోని ఓబులాపురంలో పోలింగ్‌ ముగిశాక టీడీపీ, వైసీపీ వర్గీయులు ఘర్షణపడ్డాయి. ఓ వృద్ధుడితో టీడీపీకి ఓటు వేయించారన్న నెపంతో ఇద్దరి మధ్య మాటమాట పెరిగి.. రాళ్లు, కట్టెలతో దాడులు చేసుకున్నారు. టీడీపీ వర్గీయులు రాంమోహన, లోకనాథ్‌, వైసీపీ వర్గీయులు కృష్ణయ్య, రమణ, సుధాకర్‌రెడ్డి గాయపడ్డారు. వీరిని తాడిపత్రి ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలానికి సీఐ సుబ్రహ్మణ్యం చేరుకొని పరిస్థితిపై ఆరాతీశారు. గ్రామంలో పోలీసు బందోబస్తు ఏర్పాటుచేశారు.


చెదరగొట్టిన పోలీసులు

కణేకల్లు నేసేపేట వద్ద టీడీపీ బూత కన్వీనర్‌ రజాక్‌, నాయకులు శ్రీకాంత, ముస్తాఫాపై వైసీపీ నాయకులు దాడికి యత్నించారు. పోలింగ్‌ కేంద్రం వద్ద కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. దాదాపు 70 మంది గుంపుగా వచ్చి ఇష్టానుసారంగా దూషించారు. పోలీసులు సంఘటన ఇరువర్గాలను చెదరగొట్టారు. విషయం తెలుసుకున్న కాలవ శ్రీనివాసులు కణేకల్లుకు చేరుకుని బాధితులకు ధైర్యం చెప్పారు. డీఎస్పీ శ్రీనివాసులుకు ఫోన చేసి దాడికి యత్నించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

రెచ్చిపోయిన వైసీపీ వర్గీయులు

కళ్యాణదుర్గం నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తలపై దాడులు

టీడీపీ అభ్యర్థి అల్లుడి కారు అద్దాలు ధ్వంసం

కళ్యాణదుర్గం:

- కళ్యాణదుర్గం మండలం ఒంటిమిద్ది పోలింగ్‌ కేంద్రంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తలారి రంగయ్య పార్టీ కండువా వేసుకుని పోలింగ్‌ బూతలోకి వెళ్లారు. అక్కడున్న ఎన్నికల అధికారులు పట్టించుకోలేదు. కుందుర్పి మండలం ఎనుములదొడ్డి, మలయనూరు, ఎర్రగుంట, వడ్డెపాళ్యం, బెస్తరపల్లిలో వైసీపీ నాయకులు టీడీపీ వర్గీయులపై దాడికి దిగారు. ఎనుములదొడ్డిలో పోలీస్‌ సిబ్బంది తక్కువగా ఉండడంతో వైసీపీ నాయకులు పోలింగ్‌ కేంద్రాల్లోకి వెళ్లి ఓటర్లను అభ్యర్థించారు. ఈ క్రమంలో వైసీపీ, టీడీపీ వర్గీయులు ఘర్షణకు దిగారు. తోపులాటలో హృద్రోగి కావేలమ్మ సృహతప్పి పడిపోయారు. అక్కడున్న వైద్య సిబ్బంది ఆమెకు చికిత్స చేశారు. అనంతరం కళ్యాణదుర్గం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. రూరల్‌ సీఐ సంఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు.


- ఎర్రగుంట టీడీపీ నాయకుడు ఆనంద్‌ చేతిని వైసీపీ నాయకుడు ఒకరు కరిచారు. మలయనూరులో టీడీపీ వర్గీయులపై వైసీపీ నాయకులు దాడికి దిగారు. బెస్తరపల్లిలో టీడీపీ అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు అల్లుడు ధర్మతేజ కారుపై రాళ్లు రువ్వి అద్దాలను ధ్వంసం చేశారు. మలయనూరు పంచాయతీలో పోలింగ్‌ బూతు నెంబర్‌ 184, 185, 186లో ఓటు వేయకుండా వైసీపీ నాయకులు అడ్డుకున్నారు. ఈ పోలింగ్‌ స్టేషన్ల వద్ద తరచూ గొడవలకు దిగుతూ ఓటర్లను భయబ్రాంతులకు గురిచేశారు. ఇక్కడ పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేయలేదు.

- కంబదూరు మండలం వైసీపల్లిలో పోలింగ్‌ అధికారి వైసీపీ నాయకుడితో కుమ్మకై వైసీపీకి దొంగ ఓట్లు వేయిస్తున్నారన్న సమాచారంతో టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. పోలింగ్‌ అధికారిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.

- శెట్టూరు మండలం అయ్యగార్లపల్లిలో దళిత యువకుడు ఓటు వేసేందుకు పోలింగ్‌ కేంద్రానికి రావడంతో వైసీపీ వర్గీయులు అడ్డుపడి దాడికి యత్నించారు. కైరేవులో ఎన్నికల విధుల్లో ఉన్న ఓ పోలింగ్‌ అధికారి లోలోపలే వైసీపీకి ఓటు వేయాలని సూచించారు. దీంతో టీడీపీ, వైసీపీ వర్గీయులు మధ్య ఘర్షణకు దిగారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - May 14 , 2024 | 01:28 AM