Share News

Panchayat office : ఇప్పుడెలా..!

ABN , Publish Date - Jun 19 , 2024 | 12:26 AM

వైసీపీతో అంటకాగిన పంచాయతీ కార్యదర్శులు, ఈవోఆర్డీలకు కొత్త ప్రభుత్వం గుబులు పట్టుకుంది. అడ్డగోలు పనులు చేసినవారు చర్యల నుంచి తప్పించుకునేందుకు దారులు వెతుక్కుంటున్నారు. పంచాయతీల పరిధిలోని విలువైన స్థలాలను వైసీపీ నాయకులకు అప్పనంగా కట్టబెట్టారు. ఈ క్రమంలో అధికారులను సైతం బురిడీ కొట్టించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే మునుముందు ఇబ్బందులు ఎదురౌతాయని ఉన్నతాధికారులు హెచ్చరించినా కొందరు ఖాతరు చేయలేదు. ...

 Panchayat office : ఇప్పుడెలా..!

ఐదేళ్లు వైసీపీతో సావాసం

పంచాయతీల్లో అడ్డగోలుగా వ్యవహారాలు

భారీగా నిధుల దుర్వినియోగం

పంచాయతీ స్థలాలు వైసీపీ నాయకుల పరం

ఉన్నతాధికారులకు చుక్కలు చూపిన సిబ్బంది

అధికారం మారడంతో వణుకుతున్న అక్రమార్కులు

అనంతపురం న్యూటౌన, జూన 18: వైసీపీతో అంటకాగిన పంచాయతీ కార్యదర్శులు, ఈవోఆర్డీలకు కొత్త ప్రభుత్వం గుబులు పట్టుకుంది. అడ్డగోలు పనులు చేసినవారు చర్యల నుంచి తప్పించుకునేందుకు దారులు వెతుక్కుంటున్నారు. పంచాయతీల పరిధిలోని విలువైన స్థలాలను వైసీపీ నాయకులకు అప్పనంగా కట్టబెట్టారు. ఈ క్రమంలో అధికారులను సైతం బురిడీ కొట్టించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే మునుముందు ఇబ్బందులు ఎదురౌతాయని ఉన్నతాధికారులు హెచ్చరించినా కొందరు ఖాతరు చేయలేదు. వైసీపీ నాయకులు ఏది చెబితే అది చేయాల్సిందే అన్నట్లు వ్యవహరించారు.


ఏదైనా ఫైల్‌ను ఉన్నతాధికారులు పెండింగ్‌ పెడితే.. వెంటనే వైసీపీ నాయకులను రంగంలోకి దించేవారు. ఆ పార్టీ నాయకుల వద్ద మకాం వేసి, ఒత్తిడి తెప్పించి మరీ పనులను చక్కబెట్టుకున్నారు. ఒకానొక సందర్భంలో ‘మీరు చేయలేకుంటే చెప్పండి.. మిమ్మల్ని బదిలీ చేయించి.. పనులు చేసేవారిని తెప్పించుకుంటాం..’ అని ఉన్నతాధికారులనే బెదిరించిన ఘటనలు ఉన్నాయి. ఈ స్థాయిలో పేట్రేగిపోయిన పంచాయతీ సిబ్బంది జాబితాను ఉన్నతాధికారులు సంకలో పెట్టుకుని తిరుగుతున్నారు. ఏ చిన్న అవకాశం దొరికినా తోక కత్తిరించేందుకు సిద్ధంగా ఉన్నారని ప్రచారం జరుగుతోంది. విషయం తెలుసుకున్న అక్రమార్కులు.. టీడీపీ కూటమి నాయకుల శరణు కోరేందుకు సిద్ధమవుతున్నారు. చర్యలు వద్దు.. బదిలీ వచ్చేవరకూ కాపాడండి అని వివిధ మార్గాల్లో ప్రయత్నాలు సాగిస్తున్నారని తెలిసింది.

రూరల్‌ రూటే వేరు..

జిల్లా మొత్తం ఒక ఎత్తు అయితే.. అనంతపురం రూరల్‌ మండలం మరో ఎత్తు. ఇక్కడ ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ వారికి అనుకూలంగా వ్యవహరించే ఓ బృందం ఉంది. వైసీపీ పాలనలో ఐదేళ్లపాటు వారి వ్యవహారాలు మూడు పువ్వులు, ఆరు కాయలు అన్నట్లుగా సాగాయి. అక్రమ వ్యవహారాలలో పరస్పరం సహకరించేకునే వీరు.. ఏ పార్టీ అధికారంలో ఉన్నా వెనక్కు తగ్గరని సమాచారం. నాయకుడు ఎవరైనా.. పని ఏదైనా తమ వద్దకు రావాల్సిందే అన్నట్లు


వ్యవహరిస్తారు. ‘ఎవరికి ఇవ్వాల్సింది వారికి ఇస్తాం.. ఇక మాకు అడ్డేముంటుంది..? పంచేదంతా ప్రజల సొమ్మే కదా..?’ అని బహిరంగంగా వ్యాఖ్యానిస్తుంటారు. వైసీపీ హయాంలో ఆ పార్టీ నాయకులతో అంటకాగినవారు తాజాగా కూటమి నాయకులను బుట్టలో వేసుకునే ప్రయత్నాలు ప్రారంభించారు. సన్నిహిత నాయకులను వెంటబెట్టుకుని ముఖ్యనాయకులను ప్రసన్నం చేసుకోనే పనిలో నిమగ్నమయ్యారు. రూరల్‌ మండలంలోని కొందరు సెక్రటరీలు, ఈవోఆర్డీలు చేసే రాజకీయం మామూలుగా ఉండదని అంటున్నారు. వీరిపట్ల కూటమి నాయకులు, ప్రజా ప్రతినిధులు అప్రమత్తంగా ఉండాలని ప్రజలు సూచిస్తున్నారు.

అప్పనంగా కాజేశారు..

అనంతపురం రూరల్‌ మండలంలో ఓ పంచాయతీ సెక్రటరీ విలువైన స్థలాన్ని వైసీపీ నాయకుడికి కట్టబెట్టారు. పాలకవర్గం లేని ఆ పంచాయతీలో స్థానిక నాయకుడికి సెక్రటరీ అనుకూలంగా వ్యహరించారు. ఓ నాయకుడు అడిగిందే తడవుగా.. ఆయన అనుచరుడికి పంచాయతీ స్థలాన్ని కట్టబెట్టినట్లు తెలిసింది. ప్రభుత్వం మారడంతో సెక్రటరీకి వణుకు మొదలైందని అంటున్నారు.


చక్రం తిప్పారు..

వైసీపీ హయాంలో జిల్లాలో కొందరు పంచాయతీ సెక్రటరీలు, ఈవోఆర్డీలు చక్రం తిప్పారు. అనంతపురం రూరల్‌, రుద్రంపేట, నారాయణపురం, కక్కలపల్లి, చియ్యేడు, ఆకుతోటపల్లి, బుక్కరాయసముద్రం, రాప్తాడు, పామిడి, పుట్లూరు, యల్లనూరు మండలాల్లోని పలు పంచాయతీలు, ఉరవకొండ, కణేకల్లు పంచాయతీలలో పనిచేసిన కొందరు కార్యదర్శులు విచ్చలవిడిగా వ్యవహరించారు. ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేశారన్న ఆరోపణలు ఎదుర్కొన్నారు. బుక్కరాయసముద్రం పంచాయతీలో జిల్లాలో అత్యధికంగా అక్రమాలు చోటు చేసుకున్నాయన్న ప్రచారం ఉంది. అక్కడి నాయకుల అండతో సర్పంచను సైతం సైడ్‌ చేసి అక్రమాలకు పాల్పడ్డారు. వ్యవహారాలు బయటపడ్డాక.. తప్పంతా సర్పంచపైనే మోపారు. వాస్తవాలపై ఓ డివిజనల్‌ అధికారి ఇచ్చిన నివేదికను పక్కన పెట్టించి.. మరో అధికారి చేత అనుకూల నివేదిక తెప్పించుకునేదాకా వ్యవహారం సాగింది. కూటమి ప్రభుత్వం విచారణ జరిపితే పంచాయతీల్లో జరిగిన అక్రమాలు భారీగా వెలుగులోకి వస్తాయని జనం అంటున్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Jun 19 , 2024 | 12:26 AM