Share News

Amaravati: ఏపీలో భారీ వర్షాలు.. కలెక్టర్లకు సీఎం చంద్రబాబు కీలక సూచనలు..

ABN , Publish Date - Sep 08 , 2024 | 06:50 PM

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఏపీలో మరోసారి వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సైతం హెచ్చరించిన నేపథ్యంలో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ఆయా జిల్లాల్లో పరిస్థితులపై జిల్లా కలెక్టర్లను, అధికార యంత్రాంగాన్ని సీఎం చంద్రబాబు అప్రమత్తం చేశారు.

Amaravati: ఏపీలో భారీ వర్షాలు.. కలెక్టర్లకు సీఎం చంద్రబాబు కీలక సూచనలు..
CM Chandrababu Naidu

అమరావతి, సెప్టెంబర్ 08: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఏపీలో మరోసారి వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సైతం హెచ్చరించిన నేపథ్యంలో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ఆయా జిల్లాల్లో పరిస్థితులపై జిల్లా కలెక్టర్లను, అధికార యంత్రాంగాన్ని సీఎం చంద్రబాబు అప్రమత్తం చేశారు. జిల్లాల వారీగా నమోదైన వర్షపాతం వివరాలను టెలీకాన్ఫరెన్స్‌లో సీఎంకు వివరించారు కలెక్టర్లు. తమ తమ జిల్లాల్లో ప్రస్తుత పరిస్థితులు, తీసుకుంటున్న చర్యలు, సన్నద్ధతను సీఎంకు వివరించారు కలెక్టర్లు. ఈ సందర్భంగా సీఎం సైతం కలెక్టర్లకు పలు సూచనలు చేశారు.


జిల్లాల్లో నమోదైన వర్షపాతాన్ని అంచనా వేసుకుని ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆదివారం, సోమవారం కూడా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో వర్షాల ప్రభావం కనిపిస్తోందని.. ఏలేరు రిజర్వాయర్‌కు ఎక్కువ వరద వచ్చే అవకాశం ఉందన్నారు. ప్రాజెక్టు స్టోరేజ్ కెపాసిటీని ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలని కలెక్టర్లకు సూచించారు. ప్రాజెక్టుల్లోకి వచ్చే ఇన్ ఫ్లో.. ఔట్ ఫ్లో బ్యాలెన్స్ చేసుకుని సమర్థవంతంగా ప్రాజెక్టుల నిర్వహణ చేపట్టాలన్నారు. కాలువలు, చెరువులు, డ్రెయిన్లకు గండ్లు పడకుండా చూసుకోవాలన్నారు.


భారీ, అతిభారీ వర్షాలు ఉండే ప్రాంతంలో తాగునీరు, ఆహారం, మెడికల్ క్యాంప్‌లను సిద్ధంగా ఉంచాలని కలెక్టర్లను సీఎం ఆదేశించారు. ప్రజలను నిరంతరం అప్రమత్తం చేయడం ద్వారా ప్రాణనష్టం లేకుండా చూసుకోవాలన్నారు. ముందస్తు చర్యలతో ఆస్తి నష్టాన్ని తగ్గించవచ్చునని చెప్పారు. పంట నష్టం అంచనా, బాధితులకు ఆహారం సరఫరా, వరద పరిస్థితులను గమనించేందుకు డ్రోన్లు వినియోగించవచ్చునని కలెక్టర్లకు సీఎం దిశానిర్దేశం చేశారు. పునరావాస కేంద్రాల్లో అన్ని వసతులు కల్పించాలని ఆదేశించారు. వరద ప్రభావిత ప్రాంత ప్రజలకు నచ్చజెప్పి పునరావాస కేంద్రాలకు తరలించాలన్నారు. పరిస్థితి తీవ్రతను బట్టి సహాయం కోసం సెంట్రల్ కంట్రోల్ టీమ్‌ను సంప్రదించాలన్నారు.


ఏజెన్సీలో భారీ వర్షాలు, వాగులు వంకల పరిస్థితిపై అధికారులు నిరంతరం సమాచారం తెప్పించుకోవాలని కలెక్టర్లకు సీఎం సూచించారు. ఎగువ ప్రాంతాల నుండి వరద వస్తే ఒక జిల్లా నుండి మరో జిల్లా అధికారులు సమన్వయం చేసుకోవాలన్నారు. వరద, భారీ వర్షాలపై ప్రజల ఫోన్లకు అలర్ట్ మెసేజ్‌లు పంపించాలన్నారు. వాగులు, వంకలు దాటే సమయంలో ప్రజలు ప్రమాదాల బారిన పడకుండా ఆంక్షలు విధించాలని సూచించారు. వినాయకుని నిమజ్జనానికి కూడా వెళ్లి ప్రమాదం బారినపడకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.


2 వేల మందికి పైగా ఇప్పటికే పునరావాస కేంద్రాలకు తరలించి, ఆహారం అందిస్తున్నామని ఏలూరు జిల్లా కలెక్టర్ తెలిపారు. విజయనగరం జిల్లాలో నిన్న, నేడు భారీ వర్షాలున్నాయని, దానికి అనుగుణంగా రాకపోకలను బ్రిడ్జిలపై నియంత్రిస్తున్నామని, ప్రజలకు అవసరమైన సమాచారం ఇస్తున్నామన్న ఆ జిల్లా కలెక్టర్ చెప్పారు. నాగావళి, వంశధార నదులకు వరద పెరిగే అవకాశం ఉందన్న అంచనాలకు అనుగుణంగా అధికారులు చర్యలు తీసుకోవాలని.. సీఎం సూచించారు. ఇక బాపట్ల జిల్లాలో పునరావాస కేంద్రాల్లో పెరుగుతున్న బాధితుల సంఖ్యకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ వివరించారు. ‘8 రోజులుగా విజయవాడలో వరద పరిస్థితులు, ప్రజల కష్టాలను, సహాయ చర్యలను మీరు చూస్తున్నారు.. దానికి తగ్గట్లుగా మీరు కూడా సిద్ధం చేసుకోవాలి. వరద బాధితులను ఆదుకునేందుకు జిల్లా స్థాయిలో తీసుకునే చర్యలకు అప్పటికప్పుడే నిధులు విడుదల చేస్తాం.’ అని సీఎం చంద్రబాబు చెప్పారు.


Also Read:

ప్రకాశం బ్యారేజ్‌ను ఢీకొట్టిన ఘటనలో ఊహించని విషయం వెలుగులోకి!

అక్రిడిటేషన్‌పై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

ఆక్రమణలు తొలగించం.. హైడ్రా గుడ్ న్యూస్

For More Andhra Pradesh News Telugu News..

Updated Date - Sep 08 , 2024 | 06:50 PM