Share News

Amaravati : ఐదేళ్లలో 17 వేల కి.మీ.

ABN , Publish Date - Aug 21 , 2024 | 04:40 AM

గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిలో కీలకమైన పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖలను బలోపేతం చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. రాబోయే ఐదేళ్లలో 17,500 కి.మీ మేర సిమెంటు రోడ్ల నిర్మాణం..

Amaravati : ఐదేళ్లలో 17 వేల కి.మీ.

  • గ్రామీణ రహదారులకు మహర్దశ: సీఎం

  • 10 వేల కి.మీ. మురుగు కాల్వలు

  • కేంద్ర నిధుల సద్వినియోగంతో

  • ఇంటింటికీ తాగునీరు

  • ఎల్‌ఈడీ వీధిలైట్ల పునరుద్ధరణ

  • 5 లక్షల పంటకుంటల తవ్వకాలు

  • ఘనవ్యర్థాల నిర్వహణ

  • కేంద్రాలు పునఃప్రారంభిస్తాం

  • జనవరి నుంచి ‘జన్మభూమి 2.0’

  • పంచాయతీరాజ్‌ బలోపేతానికి

  • 990 కోట్లు విడుదల: చంద్రబాబు

  • పవన్‌ కల్యాణ్‌తో కలిసి సమీక్ష

కొత్త వ్యవస్థలు వచ్చినా గ్రామ సర్పంచ్‌ను గౌరవించుకోవాలి. మళ్లీ గ్రామాల్లో వెలుగులు తెచ్చేందుకు, మౌలిక వసతులు కల్పించేందుకు పంచాయతీరాజ్‌శాఖకు జవసత్వాలు అందిస్తాం.రాష్ట్రంలో అడవుల పరిరక్షణ, అటవీ విస్తీర్ణం పెంపుపై దృష్టి పెట్టాలి. హార్టీకల్చర్‌తో కలుపుకొని 50 శాతం గ్రీన్‌బెల్ట్‌ సాధించాలి. నగర వనం కార్యక్రమం ద్వారా 175 నియోజకవర్గాల్లో, పట్టణ ప్రాంతాల్లో పచ్చదనం పెంపు చేపట్టాలి.

- సీఎం చంద్రబాబు

అమరావతి, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి): గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిలో కీలకమైన పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖలను బలోపేతం చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. రాబోయే ఐదేళ్లలో 17,500 కి.మీ మేర సిమెంటు రోడ్ల నిర్మాణం, 10 వేల కి.మీ సీసీ డ్రైనేజీ కాల్వల నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. జల్‌జీవన్‌ మిషన్‌ కోసం కేంద్రమిచ్చే నిధులను సద్వినియోగం చేసుకుని ఇంటింటికీ తాగునీరు అందిస్తామన్నారు.

మంగళవారమిక్కడ అమరావతి సచివాలయంలో పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖలపై ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌తో కలిసి ఆయన సమీక్ష నిర్వహించారు. సీఎం మాట్లాడుతూ.. 2014-19 మధ్య చేపట్టిన పలు కార్యక్రమాల ద్వారా నాడు గ్రామాల రూపురేఖలు మార్చామని..

కానీ గత ప్రభుత్వం వ్యవస్థలను నిర్వీర్యం చేసి గ్రామాలను సమస్యలకు కేంద్రాలుగా మార్చిందని ఆవేదన వ్యక్తంచేశారు. ‘ఒక ఇంటికి, ఒక గ్రామానికి, ఒక ప్రాంతానికి ఏం అవసరమో గుర్తిస్తాం.. సదుపాయాలు కల్పిస్తాం.


ఒక ఇంటికి అవసరమైన విద్యుత్‌, గ్యాస్‌, టాయ్‌లెట్‌, నీటి కుళాయి వంటి వాటిని అందించేందుకు ప్రణాళికాబద్ధంగా పనిచేయాలి. ఒక గ్రామానికి వీధిలైట్లు, డ్రైనేజీ కాలువలు, సిమెంట్‌రోడ్లు, తాగునీటి సరఫరా, ఘనవ్యర్థాల మేనేజ్‌మెంట్‌ కేంద్రాల వంటి సౌకర్యాలు కల్పించాలి.

గ్రామం నుంచి సమీప ప్రాంతాల అనుసంధానం కోసం రోడ్లు, మార్కెట్‌ ప్లేస్‌లు వంటివి ఏర్పాటు చేయాల్సిన అవసరముంది. వీటిని కూడా కనీస అవసరాలుగా గుర్తించి అందించేందుకు పంచాయతీరాజ్‌శాఖ సమగ్ర ప్రణాళికతో రానున్న రోజుల్లో పనిచేయాలి. జనవరి నుంచి ‘జన్మభూమి 2.0’ను తిరిగి ప్రారంభిస్తున్నాం. గ్రామాల అభివృద్ధికి ముందుకొచ్చే వారితో కలిసి పల్లెల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టబోతున్నాం’ అని తెలిపారు.


గ్రామాల నిధులు దారిమళ్లించారు..

గత ప్రభుత్వం గ్రామాల్లో ఖర్చు చేయాల్సిన నిధులు దారిమళ్లించిందని... దీనివల్ల కనీస స్థాయిలోనూ మౌలిక సదుపాయాల కల్పన జరగలేదని సీఎం చెప్పారు. పంచాయతీరాజ్‌శాఖకు రావలసిన రూ.990 కోట్లను ఆర్థికశాఖ నుంచి ప్రస్తుతంవిడుదల చేస్తున్నామన్నారు.

‘గత ప్రభుత్వం అసమర్థతతో ఇంటింటికీ కుళాయి ద్వారా తాగునీరు అందించే జల్‌జీవన్‌ మిషన్‌ పనుల్లో రాష్ట్రం 19వ స్థానానికి దిగజారిపోయింది. ఈ మిషన్‌ కోసం రాష్ట్ర వాటా కింద ఆర్థిక శాఖ నుంచి రూ.500 కోట్లు వెంటనే విడుదల చేస్తాం. కేంద్రమిచ్చే నిధులను సద్వినియోగం చేసుకుని ఇంటింటికీ తాగునీరు అందిస్తాం. ఎల్‌ఈడీ విద్యుత్‌ దీపాల కోసం రూ.482 కోట్ల చెల్లింపులు చేయాల్సి ఉందని.. గత ఐదేళ్లుగా ఆ నిధులు విడుదల చేయకపోవడం వల్ల కొత్త లైట్లు ఏర్పాటు, నిర్వహణ మూలన పడిందని అధికారులు చెప్పారు. రాష్ట్రంలోని అన్ని పంచాయతీల భవనాల ద్వారా సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తి చేయాలని సూచించారు.

గత ప్రభుత్వ తీరు వల్ల మూలనబడిన ఘనవ్యర్థాల నిర్వహణ కేంద్రాలను మళ్లీ ప్రారంభించాలన్నారు. ఎకో టూరిజం, ప్రైవేటు సంస్థల భాగస్వామ్యంతో అడవుల్లో టూరిజం అభివృద్ధికి కార్యక్రమాలు చేపట్టాలని పిలుపిచ్చారు.


23న రాష్ట్రవ్యాప్తంగా గ్రామసభలు: ఉపాధి పనులపై ఆయా గ్రామాల్లో ఈ నెల 23న తప్పనిసరిగా గ్రామ సభలు నిర్వహించాలని చంద్రబాబు స్పష్టం చేశారు. అక్టోబరు 2 నుంచి చెత్త నుంచి సంపద సృష్టి కేంద్రాలన్నింటినీ తిరిగి ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. 2014-19 మధ్య ఎన్టీఆర్‌ జలసిరి కింద 32,693 బోర్లు వేసి పంపుసెట్లు బిగిస్తే.. గత ప్రభుత్వం కేవలం 2,580 పంపుసెట్లే ఇచ్చిందన్నారు. రానున్న రోజుల్లో 10వేల కి.మీ డ్రెయిన్లు, 2,500 కి.మీ బీటీ రోడ్లు వేయాలని, 5 లక్షల పంటకుంటలు తవ్వాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నామని అధికారులు వివరించారు. ఎర్రచందనం అక్రమ రవాణా అరికట్టేందుకు కఠినంగా వ్యవహరించాలని సీఎం ఆదేశించారు.


సమూల మార్పులు తెస్తున్నాం: పవన్‌

పంచాయతీరాజ్‌ శాఖలో గత కొద్ది రోజుల్లో తీసుకున్న పలు నిర్ణయాలను, సంస్కరణలను డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ సమీక్షలో వివరించారు. గ్రామాల ముఖచిత్రం మార్చడంలో కీలకమైన పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖను గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని..

నేడు మళ్లీ నిధులు, కొత్త విధానాల ద్వారా గ్రామాల్లో సమూల మార్పులు తీసుకొస్తామని తెలిపారు. సమావేశంలో పంచాయతీరాజ్‌-గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌ కుమార్‌, డైరెక్టర్‌ కృష్ణతేజ, అదనపు కమిషనర్‌ సుధాకర్‌రావు, స్వచ్ఛాంధ్ర సీఈవో గంధం చంద్రుడు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 21 , 2024 | 06:46 AM