Share News

Tirumala News: తిరుమల వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్

ABN , Publish Date - Sep 06 , 2024 | 05:29 PM

తిరుమల దర్మనానికి వచ్చే భక్తులకు ఆధార్ కార్డు ద్వారా లడ్డులు విక్రయించడం ద్వారా లడ్డు నిల్వలు పెరిగాయని టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. కొత్త విధానం అమలులోకి వచ్చిన తర్వాత 75 వేల లడ్డూలను టీటీడీ పరిధిలోని అనుబంధ దేవాలయాలకు పంపుతున్నామన్నారు.

Tirumala News: తిరుమల వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్
Tirumala

తిరుమలలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఈవో శ్యామలారావు తెలిపారు. తొమ్మది రోజుల పాటు వైభవంగా ఉత్సవాలు నిర్వహిస్తామన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తుల దర్శనానికి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ప్రత్యేక దర్శనాలను రద్దు చేశామన్నారు. భక్తులకు అవసరమైన సంఖ్యలో లడ్డూలు అందుబాటులో ఉంచామన్నారు. తిరుమలకు సాధారణ రోజులతో పోలిస్తే బ్రహ్మోత్సవాలకు అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉందన్నారు. ఎంతమంది భక్తులు వచ్చినా ఇబ్బందులు లేకుండా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.


ఆధార్ కార్డుపై లడ్డుల విషయంలో..

తిరుమల దర్మనానికి వచ్చే భక్తులకు ఆధార్ కార్డు ద్వారా లడ్డులు విక్రయించడం ద్వారా లడ్డు నిల్వలు పెరిగాయని టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. కొత్త విధానం అమలులోకి వచ్చిన తర్వాత 75 వేల లడ్డూలను టీటీడీ పరిధిలోని అనుబంధ దేవాలయాలకు పంపుతున్నామన్నారు. టీటీడీ పరిధిలోని ఆలయాలతో పాటు దేశ వ్యాప్తంగా ఉన్న టీటీడీ సమాచార కేంద్రాల్లో శ్రీవారి లడ్డుని విక్రయించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.


కల్తీ నెయ్యిపై..

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కి కల్తీ నెయ్యి సప్లై చేసిన వారిని ఇప్పటికే బ్లాక్ లిస్ట్‌లో పెట్టామని ఈవో శ్యామలరావు తెలిపారు. వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. టీటీడీకి సప్లై చేసే ముడి సరుకుల నాణ్యతని తనిఖీ చేసేందుకు సెన్సార్ ల్యాబ్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. సేంద్రియ బియ్యంతో శ్రీవారికి నివేదించే అన్నప్రసాదాలపై భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారన్నారు. భక్తుల ఫిర్యాదుల మేరకు ఆర్గానిక్ ప్రసాదాల తయారిని పరిశీలించేందుకు కమిటీ వేస్తున్నామన్నారు.


నడకదారి భక్తులకు..

తిరుమల శ్రీవారి దర్శనానికి కాలినడకన వచ్చే భక్తులకు దివ్య దర్శనం టోకెన్ల విధానాన్ని త్వరలోనే పున:ప్రారంభిస్తామని ఈవో శ్యామలరావు తెలిపారు. కాలినడకన వచ్చే భక్తులు త్వరితగతిన దర్శనం చేసుకునేందుకు వీలుగా ఈ టోకెన్లను జారీ చేయనున్నారు.


బ్రహ్మోత్సవాలు ఇలా..

అక్టోబర్4న ధ్వజారోహణతో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. 8వ తేదీన గరుడసేవ, 9న స్వర్ణరథం, 11న రథోత్సవం, 12న చక్రస్నానం నిర్వహిస్తారు. ధ్వజరోహణ సందర్భంగా ధ్వజస్తంభంపై గరుడ పతాకం ఎగురవేసి ముక్కోటి దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తారు. వేద పండితులు మంత్రాలతో దర్భ చాపను ధ్వజస్తంభం చుట్టూ చుడతారు. దర్భతో పేనిన తాడును ధ్వజస్తంభంపై వరకు చుడతారు. వీటి తయారీ కోసం టీటీడీ అటవీశాఖ 2 వారాల ముందునుంచే కసరత్తు చేస్తుంది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రతిరోజూ ఉదయం 8గంటలకు, రాత్రి 7 గంటలకు వాహన సేవలు ఉంటాయి.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read More Latets Telugu News Click Here

Updated Date - Sep 06 , 2024 | 06:20 PM