Share News

AP Politics: మరో యాత్రతో ప్రజల్లోకి..!

ABN , Publish Date - Apr 15 , 2024 | 03:17 AM

‘నిజం గెలవాలి’ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో 203 కుటుంబాలను పరామర్శించానని, మరో కార్యక్రమంతో మే 10 వరకు ప్రజల్లో ఉండాలని భావిస్తున్నానని టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి తెలిపారు. ఆదివారం ‘ఆంధ్రజ్యోతి-ఏబీఎన్‌’ నిర్వహించిన ఇంటర్వ్యూలో ఆమె

AP Politics: మరో యాత్రతో ప్రజల్లోకి..!
Nara Bhuvaneswari

  • మే 10 వరకూ జనంలో ఉంటా .. ‘నిజం గెలవాలి’ ద్వారా 203 కుటుంబాలకు పరామర్శ

  • చంద్రబాబుపై గౌరవంతో ప్రజలు నన్నూ ఆదరించారు

  • వాళ్లు భువనమ్మ అని పిలిస్తే మా అమ్మ పిలిచినట్టుంది

  • రాష్ట్ర ప్రజలు స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలను కోరుకుంటున్నారు

  • 19న చంద్రబాబు తరపున కుప్పంలో నామినేషన్‌ వేస్తాం

  • ‘ఆంధ్రజ్యోతి-ఏబీఎన్‌’ ఇంటర్వ్యూలో నారా భువనేశ్వరి

(అమరావతి-ఆంధ్రజ్యోతి): ‘నిజం గెలవాలి’ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో 203 కుటుంబాలను పరామర్శించానని, మరో కార్యక్రమంతో మే 10 వరకు ప్రజల్లో ఉండాలని భావిస్తున్నానని టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి తెలిపారు. ఆదివారం ‘ఆంధ్రజ్యోతి-ఏబీఎన్‌’ నిర్వహించిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడారు. చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక గుండెపోటుతో మరణించిన కార్యకర్తల కుటుంబాలను ‘నిజం గెలవాలి’ పేరుతో ఓదార్చి, భరోసా కల్పించామని చెప్పారు. ఈ యాత్రను రాష్ట్ర ప్రజలందరూ ఆదరించారన్నారు. ‘కుటుంబ పెద్దలను కోల్పోయిన ఆయా కుటుంబాలను, వారి పిల్లల భవిష్యత్తును తలచుకుని ఎంతో ఆవేదన చెందాను. చంద్రబాబు జైలులో ఉన్నప్పుడు నేనెలా బాధపడ్డానో అదే విధంగా రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ కార్యాకర్తలు, ప్రజలు ఆవేదన చెందారు. చంద్రబాబు కోసం ఇంత పరితపించిన ప్రజలకు ఏదో ఒకటి చేయాలని భావిస్తున్నాం. బాధిత కుటుంబాలకు చెందిన పిల్లందరినీ చర్లపల్లి ఎన్టీఆర్‌ ట్రస్టు స్కూల్‌లో 6 నుంచి 10వ తరగతి వరకు చదివిస్తాం. ఇంజనీరింగ్‌ తదితర కోర్సుల విద్యార్థులకూ ట్రస్టు తరఫున ఆర్థిక సాయం అందిస్తాం’ అని భువనేశ్వరి పేర్కొన్నారు. ‘నిజం గెలవాలి’ యాత్రను ఇక్కడితో ఆపబోమని, దీనిని ముందుకు తీసుకెళ్తామని తెలిపారు. చంద్రబాబు కోసం చేపట్టిన ఈ యాత్రలో ప్రజలతో మమేకమై, తాను కూడా వారిలో ఒకరినయ్యానని వివరించారు. ప్రజల్లో తనకు ఎంతో ఆదరణ లభించిందని హర్షం వ్యక్తంచేశారు.


రాష్ట్రం కోసమే చంద్రబాబు పోరాటం..

‘రాష్ట్రంలో ఈ ఐదేళ్లలో స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలు కోల్పోయాం. బ్రిటిష్‌ తరహాలో పాలన చేస్తున్నారు. ప్రజలు స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలు కోరుకుంటున్నారు. ఈ ప్రభుత్వం ఇంకా కొనసాగితే ప్రజలకు ఏమీ మిగల్చరు. కార్యకర్తలు, ప్రజలు ఎన్నో బాధలుపడుతూ, ఈ ప్రభుత్వంతో పోరాడుతున్నారు. చంద్రబాబు జీవితంలో ఎవరినీ కష్టపెట్టరు. ప్రజల కోసం అహర్నిశలు శ్రమిస్తారు. గతంలో ఆయనపై పెట్టిన ఏ కేసులు కూడా నిలబడలేదు. చంద్రబాబు తన స్వార్థం కోసం ఒక్క పైసా ఆశించరు. అవినీతి సొమ్ము కుటుంబానికి కావాలని కోరుకునే వ్యక్తి కాదు. ఎన్నికల కోసం ఎక్కువగా శ్రమిస్తున్నారని అంటే... ప్రజల కోసం యుద్ధానికి వెళ్తున్నానని, ఈ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్‌కు ఎంతో ముఖ్యమని ఆయన చెప్పారు. చంద్రబాబు లాంటి నాయకుడిని నిర్భంధించడం తట్టుకోలేకపోయాను. పోలవరం చంద్రబాబు కలల ప్రాజెక్టు. విభజన తర్వాత ఏపీని చూసి ఎవరూ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రాలేదు. చంద్రబాబు నాయకత్వం ఉండటంతోనే కియా లాంటి పరిశ్రమలు వచ్చాయి. అలాంటి నాయకుడిని కాపాడుకునేందుకు రెండు రాష్ట్రాల్లో జనాలు ముందుకొచ్చారు. ఒక నాయకుడి కోసం ఇంతలా ప్రజలు రోడ్డు మీదకు వచ్చి పోరాడటం చూసి ఆయన భార్యగా గర్వపడుతున్నా. ఒక సైనికుడి తల్లిలాగానే నేను కూడా లోకేశ్‌ను యువగళం పాదయాత్రకు పంపాను. ప్రజల్లో తిరగడం వల్లనే లోకేశ్‌కు ప్రజల సాధకబాధకాలు తెలిశాయి.


గ్రామాల్లో తిరగడం నాకు కొత్తేమీ కాదు. మా సంస్థ అభివృద్ధికి మారుమూల ప్రాంతాల్లో సైతం పర్యటించాం. చంద్రబాబు ఎప్పుడూ కార్యకర్తల మనిషి. నిజం గెలవాలి కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తలు ఎంతో ఆదరించారు. అందుకే బాధిత కుటుంబాలకు అండగా నిలవగలిగాం. పవిత్రమైన అసెంబ్లీ సమావేశాలను మహిళను కించపరిచేందుకు వాడుకోవడం అవివేకం. నా తండ్రి మొండితనం నాకూ వచ్చింది. కఠినమైన క్రమశిక్షణతో జీవించడం నా తల్లి నేర్పింది. యాత్రలో అందరూ భువనమ్మా... అని పిలుస్తుంటే నా తల్లి పిలిచినట్లుంది. అందుకే ప్రజలతో అంత మమేకం కాగలిగాను. ఏప్రిల్‌ 19న చంద్రబాబు తరపున కుప్పంలో నామినేషన్‌ వేయనున్నాం. కుప్పంలో ఇంటి నిర్మాణం కూడా రెండు నెలల్లో పూర్తవుతుంది. చంద్రబాబు అధికారంలోకి వస్తానే రాష్ట్రానికి పరిశ్రమలు వస్తాయి. 20 లక్షల ఉద్యోగాల కల్పన జరుగుతుంది. చేయలేని పనిని చంద్రబాబు ఎప్పుడూ చెప్పరు. ఆయన చెప్పారంటే కచ్చితంగా చేస్తారు. యువత రాజకీయాల్లోకి రావాలి. పరిశ్రమలు స్థాపించి, పది మందికి ఉద్యోగాలు కల్పించి వారి కుటుంబాల్లో జ్యోతిని వెలిగించాలి’ అని భువనేశ్వరి పిలుపునిచ్చారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Updated Date - Apr 15 , 2024 | 08:52 AM