Share News

హార్సిలీహిల్స్‌ అభివృద్ధికి సీఎం చొరవ

ABN , Publish Date - Aug 27 , 2024 | 11:52 PM

ప్రముఖ పర్యాటక కేంద్రం హార్సిలీహిల్స్‌లో పర్యాటకరంగ అభివృద్ధికి సీఎం చంద్రబాబునాయుడు ప్రత్యేక చొరవ చూపుతున్నారని కలెక్టర్‌ చామకూరి శ్రీఽధర్‌ తెలిపారు.

హార్సిలీహిల్స్‌ అభివృద్ధికి సీఎం చొరవ
హార్సిలీహిల్స్‌ ప్రత్యేకతను ఒబెరాయ్‌ ప్రతినిధులకు వివరిస్తున్న కలెక్టర్‌ చామకూరి శ్రీధర్‌

రూ.200 కోట్లతో ఒబెరాయ్‌ హోటల్‌ నిర్మాణం

ఆ సంస్థ ప్రతినిధులతో కలిసి స్థల పరిశీలన

కలెక్టర్‌ శ్రీధర్‌ చామకూరి

బి.కొత్తకోట, ఆగస్టు 27: ప్రముఖ పర్యాటక కేంద్రం హార్సిలీహిల్స్‌లో పర్యాటకరంగ అభివృద్ధికి సీఎం చంద్రబాబునాయుడు ప్రత్యేక చొరవ చూపుతున్నారని కలెక్టర్‌ చామకూరి శ్రీఽధర్‌ తెలిపారు. ఇందులో భాగంగా మంగళవారం ఓ ప్రధాన ఘట్టానికి బీజం పడింది. హోటల్‌ రంగంలో ఖ్యాతి గడించిన ఒబెరాయ్‌ సంస్థ రూ.200 కోట్లతో నిర్మించనున్న సెవెన్‌స్టార్‌ హోటల్‌ నిర్మాణానికి తొలి అంకం పూర్తయింది. మూడేళ్ల క్రితమే ఒబెరాయ్‌ సంస్థకు స్థలం కేటాయించినప్పటికీ అడుగు ముందుకు పడలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే కదలిక మొదలైంది. సీఎం చంద్రబాబు ఆదేశాలతో ఇటీవల హిల్స్‌కు వచ్చి ఆ స్థలాన్ని పరిశీలించిన కలెక్టర్‌ చామకూరి శ్రీధర్‌ ముంబాయి నుంచి సంస్థ ప్రతినిధులను రప్పించేందుకు చొరవ చూపించారు. దీంతో మంగళవారం ఒబెరాయ్‌ గ్రూప్‌ కార్పొరేట్‌, లీగల్‌ అఫైర్స్‌ ప్రెసిడెంట్‌ ఆర్‌.శంకర్‌, ప్రాజెక్ట్‌ కన్సల్టెంట్‌ నవీన్‌గోస్వామి, ఇంజనీర్‌ మయాంక్‌తనేజలతో కూడిన బృందం హార్సిలీహిల్స్‌ చేరుకుని తమ సంస్థకు కేటాయించిన 20.90 ఎకరాల స్థలాన్ని పరిశీలించారు.

హిల్స్‌ ప్రత్యేకతపై పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌

కొండపై హోటల్‌ నిర్మాణానికి సాధ్యాసాధ్యాలను పరిశీలించడానికి వచ్చిన ఒబెరాయ్‌గ్రూప్స్‌ బృందానికి కలెక్టర్‌ శ్రీధర్‌, జేసీ ఆదర్శ్‌ రాజేంద్రన్‌లు పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా హిల్స్‌ ప్రాధాన్యతను, ప్రత్యేకతలను వివరించారు. హిల్స్‌ సముద్రమట్టానికి 4312 అడుగల ఎత్తులో గల సుందర ప్రదేశమని, తిరుపతి, బెంగళూరు, కడప విమానాశ్రయాలకు సమాన దూరంలో ఉన్న సుందర, ఆహ్లాదకర ప్రదేశమని, చుట్టుపక్కల ప్రాంతాలలో ఉన్న పర్యాటక ప్రదేశాలు, ఇప్పటికే కొండపై పర్యాటకులను ఆకట్టుకుంటున్న ప్రదేశాల గురించి వివరించారు.


హిల్స్‌ అందాలకు ఫిదా..

ఒబెరాయ్‌ బృందం హార్సిలీహిల్స్‌ అందాలకు ఫిదా అయ్యారు. తమకు కేటాయించిన 20.90 ఎకరాల స్థలంతో పాటు గాలిబండ పైకి ఎక్కి చుట్టూ ఉన్న అటవీ అందాలు, లోయ ప్రాంతం, చల్లని ఆహ్లాదకరమైన వాతావరణం చూసి ముగ్ధులయ్యారు. కొండపై హెలిప్యాడ్‌ సర్వీసుతో పాటు ప్రాజెక్ట్‌ నిర్మాణం విషయమై బోర్డు మీటింగ్‌లో చర్చించి రెండు నెలల్లో పనులు ప్రారంభించేలా చూస్తామని వారు కలెక్టర్‌కు తెలిపారు.

జిల్లాలో సర్క్యూట్‌ టూరిజం ఏర్పాటుపై దృష్టి

ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు హార్సిలీహిల్స్‌ను అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్‌ శ్రీధర్‌ తెలిపారు. స్థల పరిశీలన అనంతరం గవర్నర్‌ బంగ్లాలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ఒబెరాయ్‌ హోటల్‌ నిర్మాణానికి అవసరమైన అనుమతులు ఇచ్చి సౌకర్యాలు కల్పిస్తామన్నారు. పర్యాటకరంగం అభివృద్ధి చెందడానికి, అనుబంధరంగాల ఆదాయవృద్ధి, ఉపాధి దొరకడానికి అవకాశం ఉందని తెలిపారు. గుర్రంకొండ కోట, వెలిగల్లు రిజర్వాయర్‌ లాంటి వాటితో బెంగళూరు, తిరుపతి, కడపలను కలుపుతూ సర్క్యూట్‌ టూరిజం ఏర్పాటుపై దృష్టి పెడతామన్నారు. ఇక్కడ సెవెన్‌స్టార్‌ హోటల్‌ నిర్మాణం జరిగితే వీవీఐపీలతో హిల్స్‌ జాతీయస్థాయికి ఎదుగుతుందన్నారు. హిల్స్‌లో ఇటీవల చేపట్టిన అక్రమ నిర్మాణాలపై విచారణ చేసి తగు చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలో ఫ్రీహోల్డ్‌ భూములపై రీవెరిఫికేషన్‌ కొనసాగుతోందని 1.30 లక్షల ఎకరాలలో లక్ష ఎకరాలు పూర్తి చేశామన్నారు. ఫ్రీహోల్డ్‌ భూములు 4400 ఎకరాలు రిజిస్టర్‌ జరిగితే అందులో 1200 ఎకరాలు పట్టాదారు కాకుండా ఇతరులు రిజిస్టర్‌ చేశారని వాటిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో మదనపల్లె సబ్‌ కలెక్టర్‌ మేఘస్వరూప్‌, టూరిజం జిల్లా ఆఫీసర్‌ నాగభూషణం, హిల్స్‌ మేనేజర్‌ సాల్విన్‌రెడ్డి, తహశీల్దార్‌ శ్రీధర్‌రావు, సర్వేయర్‌ శ్రీవాణి, వీఆర్వో నరేంద్ర తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 27 , 2024 | 11:52 PM