Share News

Weddings: మహా మంచి ముహుర్తం.. ఒక్కటవుతున్న లక్ష జంటలు..

ABN , Publish Date - Aug 19 , 2024 | 01:37 PM

పెళ్లి జీవితంలో మరుపురాని అనుభూతి.. వైవాహిక జీవితంలో అడుగుపెడుతున్నవేళ ఆ ఆనందమే వేరు. బంధు, మిత్రులు, శ్రేయాభిలాషులు అంతా ఒకచోటకు చేరిన సందర్భంగా.. వివాహ వేదికపై మూడు ముళ్లు వేసే క్షణాలు జీవితంలో మరుపురానివిగా మిగిలిపోతాయి.

 Weddings: మహా మంచి ముహుర్తం.. ఒక్కటవుతున్న లక్ష జంటలు..
Marriage Season

పెళ్లి జీవితంలో మరుపురాని అనుభూతి.. వైవాహిక జీవితంలో అడుగుపెడుతున్నవేళ ఆ ఆనందమే వేరు. బంధు, మిత్రులు, శ్రేయాభిలాషులు అంతా ఒకచోటకు చేరిన సందర్భంగా.. వివాహ వేదికపై మూడు ముళ్లు వేసే క్షణాలు జీవితంలో మరుపురానివిగా మిగిలిపోతాయి. పెళ్లి కుదరడం ఒక ఎత్తైతే.. మంచి ముహుర్తం దొరకడం మరో ఎత్తు. ముహుర్తం కోసం నెలల తరబడి వేచిచూసేవాళ్లు ఎందరో ఉంటారు. మంచి ముహుర్తం ఉందంటే చాలు.. ఆరోజు లెక్కలేనన్ని పెళ్లిళ్లు జరుగుతాయి. అసలే శ్రావణ మాసం.. అందులోనూ పౌర్ణమి ఇంకేముంది. మంచి ముహుర్తంలో ఒకటయ్యేందుకు లక్షల జంటలు రెడీ అయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు సోమవారం ఒక్కరోజే లక్షకు పైగా పెళ్లిళ్లు జరుగుతున్నాయి. ఎక్కడ చూసినా పెళ్లి సందడే. కళ్యాణ మండపాలు కిటకిటలాడుతున్నాయి. క్యాటరింగ్ వాళ్లకు చేతినిండా పనే. శ్రావణ మాసం వెళ్లిందంటే మళ్లీ పెళ్లి ముహుర్తాల కోసం రెండు నెలలు ఆగాల్సిందే. అందుకే శ్రావణ మాసంలో ముహుర్తాలకు మంచి డిమాండ్ ఏర్పడింది. ఆగష్టు8వ తేదీన మొదలైన పెళ్లి ముహుర్తాలు.. ఈనెల 28వ తేదీ వరకు కొనసాగనున్నాయి. 28 తర్వాత మంచి ముహుర్తాలు లేకపోవడంతో ఈలోపే ఒక్కటయ్యేందుకు జంటలు రెడీ అవుతున్నాయి.


మరో నాలుగు రోజులు..

ఆగష్టు 19తో పాటు.. ఈనెల 22,23,24,28 తేదీల్లో మంచి ముహుర్తాలున్నాయని ఆగమశాస్త్ర పండితులు చెబుతున్నారు. సోమవారం ఒక్కరోజే లక్షకు పైగా జంటలు ఒక్కటవుతుండగా.. ఈనెల 22, 23, 24, 28 తేదీల్లో సైతం అదే స్థాయిలో పెళ్లిళ్లు జరగనున్నాయి. పెళ్లిళ్ల కోసం కొన్ని నెలల ముందే కళ్యాణ మండపాలన్నీ బుక్ అయిపోయాయి. ఈనెల 28వ తేదీ వరకు తెలుగురాష్ట్రాల్లోని కళ్యాణ మండపాలు ఖాళీ లేవట. ఇక కళ్యాణ మండపాలు దొరకకపోయినా.. ముహుర్తం మిస్ చేసుకోకూడదనే ఉద్దేశంతో కొందరు ఇళ్లు, గుడిలో పెళ్లిళ్లకు ఏర్పాట్లు చేసుకుంటున్నారట. కొన్ని కళ్యాణ మండపాల్లో అయితే గంటల లెక్కన అద్దెకు ఇచ్చారట. ఉదయం ఒకటి, మధ్యాహ్నం ఒకటి, రాత్రి మరొకటి చొప్పున.. రోజుకు రెండు నుంచి మూడు పెళ్లిళ్లకు కళ్యాణ మండపాలు బుక్ అయినట్లు నిర్వహకులు చెబుతున్నారు.


చేతి నిండా పని..

ముహుర్తం కుదరడంతో ఎక్కువ సంఖ్యలో పెళ్లిళ్లు జరుగుతున్న వేళ పురోహితులకు, వంట వారికి చేతినిండా పనిదొరకడంతో పాటు.. వస్త్ర దుకాణాలు, పూల దుకాణాలు జనంతో కళకళలాడుతున్నాయి. ఇక ఆభరణాల దుకాణాల నుంచి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇదే మంచి టైమ్ అన్నట్లుగా పూల ధరలకు రెక్కలు వచ్చాయట. గతంలో మూర రూ.20కు దొరికే మల్లెపూలు ప్రస్తుతం రూ.50 నుంచి రూ.100 పలుకుతుందట. మొత్తానికి మంచి ముహుర్తం కావడంతో సోమవారం ఒక్కరోజు దాదాపు లక్ష జంటలు ఒకటి కాబోతున్నాయి.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read More Telugu Latest News Click Here

Updated Date - Aug 19 , 2024 | 01:37 PM