Share News

Alluri Sitarama Raju: అల్లూరి తొలి సాయుధ పోరుకు 102 ఏళ్లు

ABN , Publish Date - Aug 22 , 2024 | 01:56 AM

బ్రిటీష్‌ పాలకుల అకృత్యాల నుంచి ఆదివాసీలను విముక్తులను చేయడానికి విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు నడిపించిన సాయుధ పోరాటం స్వాతంత్య్ర సంగ్రామంలో చరిత్ర సృష్టించింది. సాయుధ పోరాటానికి అవసరమైన ఆయుధాలను సమకూర్చుకోవడానికి తొలిసారి 1922 ఆగస్టు 22వ తేదీన చింతపల్లి పోలీస్‌ స్టేషన్‌పై తన సైన్యంతో అల్లూరి దాడి చేశాడు.

Alluri Sitarama Raju: అల్లూరి తొలి సాయుధ పోరుకు 102 ఏళ్లు
అల్లూరి సీతారామరాజు దాడి చేసిన చింతపల్లి పోలీస్‌ స్టేషన్‌(ఫైల్‌)

  • 1922 ఆగస్టు 22న చింతపల్లి పోలీస్‌ స్టేషన్‌పై మెరుపు దాడి

  • చెక్కు చెదరని నాటి ఆనవాళ్లు

  • బ్రిటీష్‌ పోలీస్‌ స్టేషన్‌ను ఆధునికీకరిస్తామని రెండేళ్ల క్రితం కేంద్రం ప్రకటన

  • నేటికి కార్యరూపం దాల్చని వైనం

చింతపల్లి, ఆగస్టు 21: బ్రిటీష్‌ పాలకుల అకృత్యాల నుంచి ఆదివాసీలను విముక్తులను చేయడానికి విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు నడిపించిన సాయుధ పోరాటం స్వాతంత్య్ర సంగ్రామంలో చరిత్ర సృష్టించింది. సాయుధ పోరాటానికి అవసరమైన ఆయుధాలను సమకూర్చుకోవడానికి తొలిసారి 1922 ఆగస్టు 22వ తేదీన చింతపల్లి పోలీస్‌ స్టేషన్‌పై తన సైన్యంతో అల్లూరి దాడి చేశాడు. అల్లూరి జీవిత చరిత్రలో మరపురాని ఘట్టాల్లో ఒకటైన చింతపల్లి పోలీస్‌ స్టేషన్‌ ఘటనకు గురువారానికి 102 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రత్యేక కథనం.


పశ్చిమగోదావరి జిల్లా భీమవరం సమీపంలోని మోగల్లు గ్రామానికి చెందిన అల్లూరి వెంకట రామరాజు 15 ఏళ్ల వయస్సులోనే బ్రిటీష్‌ పాలకుల తీరుపై ద్వేషంతో ఉండేవాడు. ఈ క్రమంలో లంబసింగి ఘాట్‌రోడ్డు నిర్మాణానికి గిరిజనులను వినియోగించుకుంటూ వారిని ఇబ్బందులు పెడుతున్నట్టు తెలుసుకుని అప్పటి తహసీల్దార్‌ బాస్టియన్‌పై బ్రిటీష్‌ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. కానీ బ్రిటీష్‌ అధికారులు తిరిగి అల్లూరిపై కేసు పెట్టారు. అల్లూరి మన్యంలో ఉంటే తిరుగుబాటు తెస్తాడని భావించిన బ్రిటీష్‌ పాలకులు నర్సీపట్నం తీసుకెళ్లి గృహ నిర్బంధం చేశారు. తరువాత అడ్డతీగల సమీపంలోని పైడిపుట్టిలో 50 ఎకరాల భూమి, కొన్ని పశువులను అల్లూరికి కేటాయించి తమ కనుసన్నల్లో ఉంచారు. 1922 జూన్‌లో పోలవరం డిప్యూటీ కలెక్టర్‌ ఫజులుల్లా ఖాన్‌ సహకారంతో అల్లూరి ప్రవాస శిక్షను తప్పించుకుని మన్యానికి వచ్చి సాయుధ పోరాటానికి సన్నద్ధమయ్యాడు. గాం గంటందొర, మల్లుదొర, కంకిపాటి ఎండుపడాల్‌, ఎర్రేసు, మరికొంత మంది గిరిజనులను సమీకరించి సాయుధ పోరాటంపై చైతన్యవంతులను చేశాడు. గెరిల్లా దాడులపై శిక్షణ ఇచ్చాడు. 1922 ఆగస్టు 19న సాయుధ పోరాటానికి అవసరమైన ఆయుధాలను సమకూర్చుకోవాలని చింతపల్లి పోలీస్‌ స్టేషన్‌పై దాడికి వ్యూహ రచన చేశాడు.


చింతపల్లి పోలీస్‌ స్టేషన్‌పై దాడి

అల్లూరి సీతారామరాజు 1922 ఆగస్టు 22వ తేదీన గంటందొర, మల్లుదొర, ఎండుపడాల్‌, ఎర్రేస్‌తో పాటు 300 మంది గిరిజన విప్లవకారులతో కలిసి చింతపల్లి పోలీస్‌ స్టేషన్‌పై దాడి చేశారు. పోలీసులను తాళ్లతో బంధించి 11 తుపాకులు, 1390 తుపాకీ గుళ్లు, 14 బాయ్‌నెట్లు, 5 కత్తులను స్వాధీనం చేసుకున్నారు. ఈ వివరాలను స్టేషన్‌ డైరీలో రాసి ఇంగ్లీష్‌లో సంతకం చేశారు. అనంతరం 23న కృష్ణాదేవిపేట పోలీస్‌ స్టేషన్‌, 24న రాజవొమ్మంగి పోలీస్‌ స్టేషన్‌పై దాడి చేశారు. వరుసగా మూడు రోజుల పాటు మూడు స్టేషన్లపై అల్లూరి, అతని సేన దాడులు చేయడంతో బ్రిటీష్‌ అధికారుల్లో వణుకు పుట్టింది.


ఇప్పటికి చింతపల్లిలో నాటి ఆనవాళ్లు

అల్లూరి సీతారామరాజు నాడు దాడి చేసిన పోలీస్‌ స్టేషన్‌ భవనం చింతపల్లిలో ఇప్పటికీ చెక్కు చెదరలేదు. ప్రస్తుతం ఈ భవనాన్ని ఒక భాగాన్ని పోలీసులు ఉపయోగించుకుంటున్నారు. మరో భాగాన్ని ఉప ఖజానా కార్యాలయంగా వినియోగిస్తున్నారు. ఉప ఖజానా కార్యాలయంలో బ్రిటీష్‌ అధికారులు ఉపయోగించిన ఇనుప ఖజానా పెట్టె, ఫ్యాన్‌ తిప్పేందుకు ఉపయోగించిన రోప్‌ పదిలంగా ఉన్నాయి.

అటకెక్కిన పోలీస్‌ స్టేషన్‌ ఆధునికీకరణ

అల్లూరి సీతారామరాజు దాడి చేసిన చింతపల్లి పోలీస్‌ స్టేషన్‌ను ఆధునీకరిస్తామని 2022లో చింతపల్లి సందర్శించిన నాటి కేంద్ర మంత్రులు అర్జున్‌ ముండా, జి.కిషన్‌రెడ్డి ప్రకటించారు. అలాగే భీమవరంలో అల్లూరి సీతారామరాజు 125 ఏళ్ల జయంతి ఉత్సవానికి హాజరైన ప్రధాన మంత్రి ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ చింతపల్లి పోలీస్‌ స్టేషన్‌ ను పునరుద్ధరిస్తామని ప్రకటించారు. ఆధునికీకరణ కోసం ప్రత్యేకంగా నిధులు విడుదల చేస్తున్నట్టు చెప్పారు. పోలీస్‌ స్టేషన్‌ను సందర్శనీయ ప్రాంతంగా తీర్చిదిద్దుతామన్నారు. అయితే ఇప్పటికీ అది కార్యరూపం దాల్చలేదు.


Also Read:

నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణం.. పవన్ సంచలన కామెంట్స్..

ప్రభుత్వం మారినా.. వారి తీరు మారదా?

ఆ మాటతో మొదలై.. పద్మవిభూషణ్‌ వరకూ!

For More Telangana News and Telugu News..

Updated Date - Aug 22 , 2024 | 12:27 PM