Share News

Train Accident: ఉత్తరప్రదేశ్‌లో రైలు ప్రమాదం.. పట్టాలు తప్పి 12 బోగీలు బోల్తా

ABN , Publish Date - Jul 18 , 2024 | 04:19 PM

ఉత్తరప్రదేశ్‌లో రైలు ప్రమాదం చోటు చేసుకుంది. గోండా జిల్లాలోని ఝిలాహి రైల్వే స్టేషన్ సమీపంలో ఓ రైలు పట్టాలు తప్పింది. చండీగఢ్ నుంచి దిబ్రూగఢ్‌కి వెళ్తున్న చండీగఢ్-దిబ్రూగఢ్ ఎక్స్‌ప్రెస్‌..

Train Accident: ఉత్తరప్రదేశ్‌లో రైలు ప్రమాదం.. పట్టాలు తప్పి 12 బోగీలు బోల్తా
Train Accident

ఉత్తరప్రదేశ్‌లో రైలు ప్రమాదం (Uttar Pradesh Train Accident) చోటు చేసుకుంది. గోండా జిల్లాలోని ఝిలాహి రైల్వే స్టేషన్ సమీపంలో ఓ రైలు పట్టాలు తప్పింది. చండీగఢ్ నుంచి దిబ్రూగఢ్‌కి వెళ్తున్న చండీగఢ్-దిబ్రూగఢ్ ఎక్స్‌ప్రెస్‌ (15904) (Chandigarh - Dibrugarh Express) రైలు పట్టాలు తప్పడంతో.. 12 బోగీలు బోల్తా కొట్టాయి. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. చాలామంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న అధికారులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.


మరోవైపు.. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మతో పాటు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఈ ప్రమాదంపై అధికారులతో మాట్లాడారు. సహాయక చర్యల్ని ముమ్మరం చేయాలని.. గాయపడిన వారిని తక్షణమే ఆసుపత్రికి తరలించాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే.. ఈ ఘటన ఎలా జరిగిందనే విషయంపై ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు. ఈ ప్రమాదం జరగడానికి గల కారణాలేంటో తెలుసుకోవడం కోసం రైల్వే శాఖ విచారణకు ఆదేశించింది. కాగా.. ఈ ప్రమాదం నుంచి బయటపడిన ఓ ప్రయాణికుడు దేవుడి దయతోనే తాను బతికిపోయానని తెలిపాడు. చావుని తాను చాలా దగ్గర నుంచి చూశానని.. అదృష్టవవాత్తూ బతికానని పేర్కొన్నాడు.


ఈ ప్రమాదంతో ప్రయాణికులందరూ తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. చాలామంది తమ లగేజ్ బ్యాగులు పట్టుకొని.. బోగీల నుంచి బయటకు వచ్చేశారు. ఇతరులను కాపాడటంలోనూ చేయూతనందించారు. ఎమర్జెన్సీ రెస్క్యూ టీమ్ కూడా అక్కడికి చేరుకొని.. సహాయక చర్యలు చేపట్టింది. లోపల చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీస్తున్నారు. అలాగే.. గాయపడిన వారిని దగ్గరలోని ఆసుపత్రులకు తరలిస్తున్నారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా పెను సంచలనంగా మారింది.

Read Latest National News and Telugu News

Updated Date - Jul 18 , 2024 | 04:28 PM