Share News

ఏనుగుల దాడుల్లో 2,853 మంది మృతి

ABN , Publish Date - Jul 27 , 2024 | 04:46 AM

ఏనుగుల దాడుల వల్ల గత ఐదేళ్ల కాలంలో 2,853 మంది మృత్యువాత పడినట్లు ప్రభుత్వ గణాంకాలు పేర్కొన్నాయి. ఈ ఐదేళ్లలో అత్యధికంగా 2023 సంవత్సరంలో 628 మంది చనిపోయారు.

ఏనుగుల దాడుల్లో  2,853 మంది మృతి

  • గడిచిన ఐదేళ్ల గణాంకాల వెల్లడి

న్యూఢిల్లీ, జూలై 26: ఏనుగుల దాడుల వల్ల గత ఐదేళ్ల కాలంలో 2,853 మంది మృత్యువాత పడినట్లు ప్రభుత్వ గణాంకాలు పేర్కొన్నాయి. ఈ ఐదేళ్లలో అత్యధికంగా 2023 సంవత్సరంలో 628 మంది చనిపోయారు. 2019లో 587 మంది, 2020లో 471 మంది, 2021లో 557 మంది, 2022 లో 610 మంది, 2023లో 628 మంది మృతికి ఏనుగులు కారణమైనట్టు కేంద్ర పర్యావరణ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్‌ సింగ్‌ గురువారం రాజ్యసభలో ఓ ప్రశ్నకు సమాధానంగా పేర్కొన్నారు.

ఐదేళ్లకాలంలో ఒడిశాలో 624 మంది మృత్యువాత పడగా.. ఝార్ఖండ్‌లో 474 మంది, బెంగాల్‌లో 436 మంది, అసోంలో 383 మంది, ఛత్తీ్‌సగఢ్‌లో 303 మంది, తమిళనాడులో 256 మంది, కర్ణాటకలో 160 మంది, కేరళలో 124 మంది చనిపోయారని గణాంకాలు చెబుతున్నాయి.

ఐదేళ్లలో 628 పులుల మృత్యువాత

గత ఐదేళ్ల కాలంలో దేశంలో 628 పులులు మృత్యువాత పడినట్టు ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. వేటాడటంతో సహా సహజ, ఇతర కారణాల వల్ల ఈ మరణాలు సంభవించాయి. అలాగే ఇదే కాలంలో పులుల దాడుల వల్ల 349 మంది మరణించారు. ఇందులో ఒక్క మహారాష్ట్రలోనే 200 మరణాలు నమోదయ్యాయి.

నేషనల్‌ టైగర్‌ కన్జర్వేషన్‌ అథారిటీ (ఎన్‌టీసీఏ) ప్రకారం.. 2019లో 96, 2020లో 106, 2021లో 127, 2022లో 121, 2023లో 178 పులులు మరణించాయి. 2012 నుంచి చూస్తే 2023లో అత్యధికంగా పులులు మృత్యువాతపడ్డాయి. కాగా 2019, 2020లో 49 మంది చొప్పున, 2021లో 59 మంది, 2022లో 110 మంది, 2023లో 82 మంది పులుల దాడుల్లో మృతి చెందారని కీర్తి వర్ధన్‌ సింగ్‌ గురువారం రాజ్యసభలో తెలిపారు.

Updated Date - Jul 27 , 2024 | 04:46 AM