Share News

Election Commission : బూత్‌ల వారీ పోలింగ్‌ శాతం వెల్లడించలేం

ABN , Publish Date - May 24 , 2024 | 05:41 AM

పోలింగ్‌ కేంద్రాల వారీగా పోలింగ్‌ శాతం తెలపడం, దాన్ని వెబ్‌సైట్లో పెట్టడం కుదరదని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఇందువల్ల ఎన్నికల యంత్రాంగంలో గందరగోళం ఏర్పడుతుందని చెప్పింది. ఒక పోలింగ్‌ కేంద్రంలో ఎన్ని ఓట్లు పోల్‌ అయ్యాయో తెలియజేసే ఫామ్‌ 17(సి)ని బయటపెట్టాలని చట్టంలో ఎక్కడా లేదని గుర్తు చేసింది. వాటిని బయట పెడితే

Election Commission : బూత్‌ల వారీ పోలింగ్‌ శాతం వెల్లడించలేం

ఈసీ వెబ్‌సైట్లో పెడితే ఇబ్బందులు.. ఫామ్‌ 17(సి) పబ్లిక్‌ డాక్యుమెంటు కాదు

దాన్ని బయట పెట్టాలని చట్టంలో లేదు.. పోలింగ్‌ తర్వాత కాపీ పొందొచ్చు

సుప్రీంలో ఎన్నికల సంఘం అఫిడవిట్‌

న్యూఢిల్లీ, మే 23: పోలింగ్‌ కేంద్రాల వారీగా పోలింగ్‌ శాతం తెలపడం, దాన్ని వెబ్‌సైట్లో పెట్టడం కుదరదని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఇందువల్ల ఎన్నికల యంత్రాంగంలో గందరగోళం ఏర్పడుతుందని చెప్పింది. ఒక పోలింగ్‌ కేంద్రంలో ఎన్ని ఓట్లు పోల్‌ అయ్యాయో తెలియజేసే ఫామ్‌ 17(సి)ని బయటపెట్టాలని చట్టంలో ఎక్కడా లేదని గుర్తు చేసింది. వాటిని బయట పెడితే ఎవరైనా కొంటె పనుల్లో భాగంగా గణాంకాల ఫొటోలను దిద్ది తప్పుడు ప్రచారం చేస్తే మొత్తం ఎన్నికల ప్రక్రియకు అవాంతరం ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. తాజా ఎన్నికల మొదటి రెండు దశల్లో పోలింగ్‌ నాడు చెప్పిన శాతానికి తర్వాత ప్రకటన విడుదల చేసినప్పుడు పేర్కొన్న శాతానికి మధ్య 5-6 శాతం తేడా ఉందని వస్తున్న ఆరోపణలను ఎన్నికల సంఘం తోసిపుచ్చింది. పోలింగ్‌ ముగిసిన 48 గంటల్లో బూత్‌లో పోలింగ్‌ శాతాన్ని తెలిపే ఫామ్‌ 17(సి)ని ఎన్నికల సంఘం వెబ్‌సైట్లో పెట్టాలని కోరుతూ ఏడీఆర్‌ స్వచ్ఛంద సంస్థఽ సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌కు స్పందనగా ఎన్నికల సంఘం బుధవారం ప్రమాణపత్రాన్ని దాఖలు చేసింది. వెబ్‌సైట్లో పెట్టాల్సి వస్తే అది చట్టం తమకు ఇచ్చిన అధికారాలకు వ్యతిరేకమే కాకుండా ఇప్పటికే సగం పూర్తయిన లోక్‌సభ ఎన్నికల ప్రక్రియను గందరగోళంలో పడేస్తుందని పేర్కొంది. 2019 లోకసభ ఎన్నికల సందర్భంగా పోలింగ్‌ శాతం అవకతవకలు జరిగినట్లుగా ఒక్క అభ్యర్థి గానీ, ఒక్క ఓటర్‌ గానీ పిటిషన్‌ వేయలేదని గుర్తు చేసింది. ప్రస్తుత పిటిషన్‌ ఆధారం లేని తప్పుడు పిటిషన్‌ అని పేర్కొంది. చట్ట ప్రకారం పోలింగ్‌ ఏజెంటు పోలింగ్‌ పూర్తయ్యాక బూత్‌లో పోలింగ్‌ శాతాన్ని సూచించే ఫామ్‌ 17(సి) నకలును తీసుకోవచ్చని గుర్తు చేసింది. ఫామ్‌ 17(సి) అసలు ప్రతి ఈవీఎంలు ఉంచే గదిలో ఉంటుందని, పోలింగ్‌ ఏజెంట్లు అందుకొనే నఖలు మీద ఏజెంటు సంతకం ఉంటుందని వెల్లడించింది. అంటే బయటకు వచ్చే ప్రతీ 17(సి) కాపీకి సంతకం ఉన్న సంబంధిత ఏజెంటు బాధ్యుడు అవుతాడని చెప్పింది. ఈ వివరాలను వెబ్‌సైట్లో పెట్టడం, వాటికి తుంటరులు తప్పుడు నకలు తయారు చేయడం వల్ల మొత్తం ఎన్నికల ప్రక్రియ మీద ప్రజల్లో అనుమానాలకు తావిచ్చినట్లు అవుతుందని వివరించింది. పిటిషనర్‌ వాదనను సుప్రీంకోర్టు అంగీకరిస్తే ఏ ఓటరైనా పోలింగ్‌ కేంద్రానికి వచ్చి, 17(ఎ) ప్రజా బాహుళ్య పత్రం కాబట్టి తనకు కాపీ కావాలని అడిగే పరిస్థితి ఏర్పడుతుందని, దాంతో మొత్తం ఎన్నికల ప్రక్రియే గందరగోళంలో పడుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నెల 17న స్వచ్ఛంద సంస్థ పిటిషన్‌కు సుప్రీంకోర్టు స్పందిస్తూ వారం రోజుల్లోగా ఎన్నికల సంఘం స్పందన తెలపాలని ఆదేశించింది. ఆ మేరకు ఈసీ బుధవారం ప్రమాణపత్రాన్ని సమర్పించింది. 2019లో కూడా ఏడీఆర్‌ ఎన్నికల ప్రక్రియ ముగిశాక పోలింగ్‌ బూత్‌ల వారీగా ఫామ్‌ 17(సి) సమాచారాన్ని ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో ఉంచాలని సుప్రీంకోర్టును కోరింది.

అప్పుడు వేగంగా పోలింగ్‌ శాతం!

న్యూఢిల్లీ, మే 23 (ఆంధ్రజ్యోతి): పోలింగ్‌ జరిగిన తీరుకంటే కేంద్ర ఎన్నికల సంఘం పోలింగ్‌ శాతాన్ని ప్రకటిస్తున్న తీరుపైనే అందరూ సందేహాలు లేవనెత్తున్నారు. తొలి దశ పోలింగ్‌ శాతం ప్రకటించడానికి ఎన్నికల సంఘానికి 11 రోజుల సమయం పట్టింది. పోలింగ్‌ ముగిసిన రోజున 60 శాతం పోలింగ్‌ జరిగిందని తెలపగా, 11 రోజుల తర్వాత ఏకంగా 66.14 శాతమని ప్రకటించింది. అంటే సుమారు ఆరు శాతానికి పైగా వ్యత్యాసం ఉంది. మిగిలిన మూడు దశల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. రెండో ఫేజ్‌లో పోలింగ్‌ ముగిసిన రోజున 60.69 శాతం పోలింగ్‌ జరిగిందని వెల్లడించగా, తర్వాత 66.7 శాతం పోలింగ్‌ జరిగిందని ప్రకటించింది. ఫేజ్‌ 3, ఫేజ్‌ 4 పోలింగ్‌ పరిస్థితీ అదే. ఇక.. ఇటీవలే జరిగిన ఫేజ్‌ -5 పోలింగ్‌ శాతానికి సంబంధించిన వివరాలను గురువారం కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. పోలింగ్‌ జరిగిన రోజున 60 శాతమని వెల్లడించగా, గురువారం మాత్రం 62.2 శాతమని ప్రకటించింది. ఇలా ప్రతి ఫేజ్‌ ఎన్నికలకు సంబంధించి పోలింగ్‌ శాతాల్లో వ్యత్యాలపై పలువురు అనేక సందేహాలు లేవనెత్తున్నారు. 2019 ఎన్నికల సమయంలో ఈసీ పోలింగ్‌ ముగిసిన కొద్ది ేసపటికే వివరాలన్నీ ప్రకటించింది. స్ర్తీ, పురుషుల ఓటింగ్‌ శాతంతో సహా స్పష్టంగా వివరాలు వెల్లడించింది. కానీ ఇప్పుడెందుకు పోలింగ్‌ శాతాల్లో భారీ వ్యత్యాసాలు వస్తున్నాయన్నది అంతుచిక్కని ప్రశ్న?

అనుమానాస్పదంగా ఉంది: సిబల్‌

పోలింగ్‌ రోజు సాయంత్రమే పోలింగ్‌ ఏజెంట్లకు ఫామ్‌ 17(సి) కాపీని ఇస్తున్నప్పుడు అదే వివరాలను వెబ్‌సైట్‌లో ఉంచడానికి అభ్యంతరం ఏమిటని సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబల్‌ ప్రశ్నించారు. ఈసీ ప్రమాణపత్రం మీద గురువారం ఆయన స్పందించారు. ఈసీ వెనుకంజ వేయడాన్ని బట్టి చూస్తుంటే ఏదో అనుమానాస్పదంగా ఉందని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయని చెప్పారు. పోలింగ్‌ పూర్తయిన తర్వాత ప్రిసైడింగ్‌ ఆఫీసర్‌ సంతకంతో ఫామ్‌ 17(సి) ఇప్పటికే ఏజెంట్లకు ఇస్తున్నారని గుర్తు చేశారు. ఏజెంట్లకు ఇవ్వడమే కాకుండా ఎన్నికల సంఘానికి కూడా నేరుగా పంపిస్తారని, వాటి ఆధారంగానే పోలింగ్‌ శాతాన్ని లెక్కిస్తారని ప్రస్తావించారు. అలాంటప్పుడు అందుబాటులో ఉన్న పత్రాలను వెబ్‌సైట్లో పెట్టడానికి వచ్చిన ఇబ్బందేమిటని ప్రశ్నించారు.

Updated Date - May 24 , 2024 | 05:41 AM