Share News

Bengaluru : పెళ్లయిన రోజే నరికేశాడు!

ABN , Publish Date - Aug 09 , 2024 | 03:17 AM

అనుమానమే పెనుభూతంగా మారి నవదంపతుల ప్రాణాలను బలి తీసుకుంది. ఈ ఘటన కర్ణాటకలోని కోలార్‌ జిల్లాలో కేజీఎఫ్‌ తాలూకా చంబరసనహళ్లిలో జరిగింది. పోలీసుల కథనం మేరకు...

Bengaluru : పెళ్లయిన రోజే నరికేశాడు!

  • ఉదయం వివాహం... సాయంత్రం హత్య

  • తర్వాత ఆత్మహత్యకు పాల్పడిన భర్త

  • కర్ణాటకలోని కోలార్‌ జిల్లాలో ఘటన

  • వరుడు చిత్తూరు జిల్లా యువకుడు

  • మనస్పర్థలకు వాట్సప్‌ చాటింగే కారణమా?

రామకుప్పం/శాంతిపురం/బెంగళూరు(ఆంధ్రజ్యోతి), ఆగస్టు 8: అనుమానమే పెనుభూతంగా మారి నవదంపతుల ప్రాణాలను బలి తీసుకుంది. ఈ ఘటన కర్ణాటకలోని కోలార్‌ జిల్లాలో కేజీఎఫ్‌ తాలూకా చంబరసనహళ్లిలో జరిగింది. పోలీసుల కథనం మేరకు... చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం సంతూరు గ్రామానికి చెందిన జయమ్మ, మునెప్ప దంపతులకు కుమారుడు నవీన్‌(30) కర్ణాటక సరిహద్దు గ్రామం రాజుపేట క్రాస్‌లో వస్త్ర దుకాణం నిర్వహిస్తున్నారు. కర్ణాటకలో బైనహళ్ళికి చెందిన శ్రీనివాసులు, లక్ష్మీ దంపతుల కుమార్తె నిఖితశ్రీతో అతనికి బుధవారం ఉదయం చంబరసనహళ్ళిలో వివాహమైంది. నిఖితతో పాటు ఆమె తల్లిదండ్రులను నవీన్‌ గ్రామంలోని తన అక్క ఇంటికి తీసుకెళ్లాడు.

సాయంత్రం వరకూ బంధువులతో ఆహ్లాదంగా గడిపిన అనంతరం నవదంపతులు ఓ గదిలోకి వెళ్లారు. కొద్దిసేపటికే గది లోపలి నుంచి కేకలు వినిపించాయి. నవీన్‌ మేనకోడలు కిటికీలో నుంచి చూడగా భార్య నిఖితపై నవీన్‌ కొడవలితో దాడి చేయడం కనిపించింది. నిఖిత తల్లితండ్రులు, బంధువులు తలుపులు బద్దలు కొట్టి లోపలకి వెళ్లి చూడగా నిఖిత రక్తపుమడుగులోనూ, పక్కనే నవీన్‌ తీవ్ర గాయాలతో పడి ఉన్నారు.

హుటాహుటిన కోలారులోని జిల్లా ఆసుపత్రికి తరలించగా, అప్పటికే నిఖిత మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. నవీన్‌ చికిత్స పొందుతూ గురువారం ఉదయం మృతిచెందాడు. కొంతకాలంగా నవీన్‌ మానసిక పరిస్థితి సరిగ్గా లేదని, ఈ కారణంగానే నిఖితను చంపి, తానూ ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిఖిత సెల్‌ఫోన్‌ను నవీన్‌ చూశాడని, అందులో వేరొక యువకుడితో చాటింగ్‌ చేసినట్లు గుర్తించి ప్రశ్నించాడని, ఈ క్రమంలోనే ఆమెపై దాడి చేసి హతమార్చి ఉండొచ్చని భావిస్తున్నారు.

Updated Date - Aug 09 , 2024 | 08:33 AM