Share News

Chennai: డీఎంకే కూటమి పార్టీల నిర్ణయం.. గవర్నర్‌ తేనీటి విందు బహిష్కరణ

ABN , Publish Date - Jan 25 , 2024 | 11:09 AM

చీటికిమాటికి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరుకునబెట్టేలా వ్యవహరిస్తున్న రాష్ట్ర గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి(Governor RN Ravi)కి డీఎంకే మిత్రపక్షాలు ఝలక్‌ ఇచ్చాయి.

Chennai: డీఎంకే కూటమి పార్టీల నిర్ణయం.. గవర్నర్‌ తేనీటి విందు బహిష్కరణ

చెన్నై, (ఆంధ్రజ్యోతి): చీటికిమాటికి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరుకునబెట్టేలా వ్యవహరిస్తున్న రాష్ట్ర గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి(Governor RN Ravi)కి డీఎంకే మిత్రపక్షాలు ఝలక్‌ ఇచ్చాయి. రాష్ట్ర ప్రయోజనాలకు, సంస్కృతీ సంప్రదాయాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న గవర్నర్‌ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఇచ్చే తేనీటి విందును బహిష్కరించనున్నట్లు ప్రకటించాయి. దీనికి సంబంధించి డీఎంకే మిత్రపక్షాలైన కాంగ్రెస్‌, సీపీఎం, సీపీఐ, డీపీఐ, ఎండీఎంకే వంటి పార్టీలు వేర్వేరుగా ప్రకటనలు విడుదల చేశాయి. ‘రిపబ్లిక్‌ డే’ సందర్భంగా స్థానిక రాజ్‌భవన్‌లో గవర్నర్‌ ‘ఎట్‌ హోం’ పేరుతో తేనీటి విందు ఇచ్చే విషయం తెలిసిందే. ఈ విందులో ముఖ్యమంత్రి, మంత్రులు, అధికార, ప్రతిపక్ష ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు, ప్రముఖులు హాజరవుతుంటారు. ఈ నేపథ్యంలో, ఈనెల 26న శుక్రవారం నిర్వహించనున్న గవర్నర్‌ తేనీటి విందు కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నట్లు డీఎంకే మిత్రపక్షాలు ప్రకటించాయి. రాష్ట్ర గవర్నర్‌గా 2021 సెప్టెంబరు 18వ తేది బాధ్యతలు చేపట్టిన ఆర్‌ఎన్‌ రవి నిత్యం ప్రభుత్వానికి, రాష్ట్రప్రజలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని ఆయా పార్టీల నేతలు ఆరోపించారు. శాసనసభలో ప్రభు త్వం నెరవేర్చే బిల్లులకు గవర్నర్‌ ఆమోదం తెలపకపోవడంతో పాటు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను కూడా అడ్డుకుంటున్నారన్నారు. ప్రజలతో ఎన్నుకోబడిన ప్రభుత్వానికి సహకరించ డం గవర్నర్‌ బాధ్యత అని, వాటిని ఆయన విస్మరించారని దుయ్యబట్టారు. ఆయన గవర్నర్‌లా కాకుం డా బీజేపీ, ఆర్‌ఎ్‌సఎస్‌ ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారని, ఆ చర్యలు నిరసిస్తూ తేనీటి విందును బహిష్కరిస్తున్నట్లు ఆయా పార్టీల నేతలు ప్రకటించారు. కానీ అధికార పార్టీ అయిన డీఎంకే నిర్ణయం వెలువడాల్సి ఉంది.

Updated Date - Jan 25 , 2024 | 11:09 AM