Share News

Delhi : ప్రముఖ నృత్యకారిణి యామినీ కృష్ణమూర్తి కన్నుమూత

ABN , Publish Date - Aug 04 , 2024 | 04:48 AM

ప్రముఖ భరతనాట్య, కూచిపూడి నృత్య కళాకారిణి యామినీ కృష్ణమూర్తి(84) కన్నుమూశారు. వృద్ధాప్య సంబంధిత అనారోగ్య సమస్యలతో ఆమె గత కొంతకాలంగా బాధపడుతున్నారు. ఏడు నెలల నుంచి ఢిల్లీలోని అపోలో ఆసుపత్రి ఐసీయూలో చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు.

Delhi : ప్రముఖ నృత్యకారిణి యామినీ కృష్ణమూర్తి కన్నుమూత

  • 7 నెలలుగా ఢిల్లీ అపోలో ఆసుపత్రి ఐసీయూలో చికిత్స

  • మదనపల్లెలో జననం.. అసలు పేరు యామినీ పూర్ణతిలకం

  • 17వ ఏటనే చెన్నైలో నృత్య ప్రదర్శనతో అరంగేట్రం

  • భరతనాట్యం, కూచిపూడి, ఒడిస్సీ నృత్యాల్లో ప్రావీణ్యం

  • దేశ, విదేశాల్లో వేలాది ప్రదర్శనలతో ఖండాంతర ఖ్యాతి

  • పద్మశ్రీ, పద్మభూషణ్‌, పద్మవిభూషణ్‌తో సత్కరించిన ప్రభుత్వం

న్యూఢిల్లీ, అమరావతి(ఆంధ్రజ్యోతి)/మదనపల్లె టౌన్‌, ఆగస్టు 3: ప్రముఖ భరతనాట్య, కూచిపూడి నృత్య కళాకారిణి యామినీ కృష్ణమూర్తి(84) కన్నుమూశారు. వృద్ధాప్య సంబంధిత అనారోగ్య సమస్యలతో ఆమె గత కొంతకాలంగా బాధపడుతున్నారు. ఏడు నెలల నుంచి ఢిల్లీలోని అపోలో ఆసుపత్రి ఐసీయూలో చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు.

ఉమ్మడి చిత్తూరు జిల్లా మదనపల్లెలో 1940 డిసెంబరు 20న యామిని జన్మించారు. ఆమె అసలు పేరు యామినీ పూర్ణతిలకం. తల్లి లక్ష్మి, తండ్రి మంగరి కృష్ణమూర్తి సంస్కృత పండితుడుగా మదనపల్లె ప్రాంతంలో పేరుగాంచారు. ఆమెకు ఇద్దరు సోదరీమణులు ఉన్నారు. యామిని చిన్నప్పుడే కుటుంబం తమిళనాడుకు వెళ్లింది. తండ్రి ప్రోత్సాహంతో ఐదేళ్ల వయసులోనే చెన్నైలోని రుక్మిణీదేవి అరుండేల్‌ కళాక్షేత్రంలో యామిని భరతనాట్యం నేర్చుకోవడం ప్రారంభించారు.

అటుపిమ్మట వీరి కుటుంబం చిదంబరంలో స్థిరపడ్డారు. కాంచీపురం ఎల్లప్ప పిళ్లై, చొక్కలింగం పిళ్లై, బాలసరస్వతి, తంజావూరు కిట్టప్ప, దండాయుధపాణి వద్ద భరతనాట్యంలో యామిని శిక్షణ పొందారు. వేదాంతం లక్ష్మీనారాయణశాస్ర్తి, చింతా కృష్ణమూర్తి, పసుమర్తి వేణుగోపాల కృష్ణశర్మ వంటి వారివద్ద కూచిపూడి నృత్యంలోనూ, పంకజ చరణ్‌దాస్‌, కూలూ చరణ్‌ మహాపాత్ర వద్ద ఒడిస్సీ నృత్యంలోనూ శిక్షణ పొందారు.

ఎం.డి. రామనాథన్‌ వద్ద కర్ణాటక సంగీతం నేర్చుకోవడంతో పాటు కల్పక్కం స్వామినాథన్‌ వద్ద వీణ వాయించడంలో తర్ఫీదు పొందారు. అనతికాలంలోనే భరతనాట్యం, కూచిపూడి నృత్యాల్లో ప్రావీణ్యం సంపాదించిన యామిని తన 17వ ఏటనే 1957లో చెన్నైలో నృత్య ప్రదర్శనతో అరంగేట్రం చేశారు. భరతనాట్యం, కూచిపూడి, ఒడిస్సీ నృత్యాల్లో నిష్ణాతురాలైన యామినీ కృష్ణమూర్తి ప్రతిభకు గాను పద్మశ్రీ (1968), పద్మభూషణ్‌ (2001), పద్మ విభూషణ్‌(2017)తో పాటు భరతనాట్యంలో సంగీత నాటక అకాడమీ(1977) అవార్డులు వరించాయి.

మాజీ రాష్ట్రపతి సర్వేపల్లె రాధకృష్ణన్‌ నుంచి భామావేణి బిరుదు పొందారు. 2017లో విశాఖ మ్యూజిక్‌ అండ్‌ డ్యాన్స్‌ అకాడమీ వారు స్వర్ణకమలం బహూకరించి నాట్య విద్యాభారతి బిరుదు అందజేశారు. యామిని అవివాహితగానే ఉండి తన జీవితాన్ని నాట్యరంగానికే అంకితం చేశారు. 1990లో ఆమె ఢిల్లీలో సొంత డ్యాన్స్‌ స్టూడియో ‘యామినీ స్కూల్‌ ఆఫ్‌ డ్యాన్స్‌’ను ప్రారంభించారు. ఆమె టీటీడీ ఆస్థాన నర్తకిగా సేవలందించారు. యామినీ కృష్ణమూర్తి భౌతికకాయాన్ని ఆదివారం ఉదయం 9గంటలకు ఢిల్లీలోని ఆమె ఇన్‌స్టిట్యూట్‌కు తీసుకురానున్నారు. కళాకారులు, రచయితలు, ప్రముఖులు యామిని మృతిపట్ల సంతాపం ప్రకటించారు.

నృత్య రంగానికి తీరని లోటు: చంద్రబాబు

యామినీ కృష్ణమూర్తి మృతిపట్ల సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ‘భారతదేశం గర్వించదగిన నృత్యకారిణి యామినీ కృష్ణమూర్తి తుదిశ్వాస విడిచారని తెలిసి, తీవ్ర ఆవేదన చెందాను. ఆమె లేని లోటు నృత్య కళారంగంలో ఎవరూ తీర్చలేరు. ఆమె ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుడిని కోరుకుంటున్నా’ అని చంద్రబాబు సంతాపం తెలిపారు.

Updated Date - Aug 04 , 2024 | 04:49 AM