Bomb threats: విమానాలకు బాంబు బెదిరింపుల వ్యవహారం.. ఎక్స్పై కేంద్రం కన్నెర్ర!
ABN , Publish Date - Oct 24 , 2024 | 04:44 AM
కొద్ది రోజులుగా దేశీయ, అంతర్జాతీయ విమానాలకు వస్తున్న వరుస బాంబు బెదిరింపులు అటు విమానయాన సంస్థలు, కేంద్ర ప్రభుత్వం ఇటు ప్రయాణికులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి.
నేరానికి ఊతమిస్తున్నట్టుగా ఉందంటూ ఆగ్రహం
న్యూఢిల్లీ, అక్టోబరు 23: కొద్ది రోజులుగా దేశీయ, అంతర్జాతీయ విమానాలకు వస్తున్న వరుస బాంబు బెదిరింపులు అటు విమానయాన సంస్థలు, కేంద్ర ప్రభుత్వం ఇటు ప్రయాణికులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. అయితే సోషల్ మీడియా వేదికగా వస్తున్న బెదిరింపులకు సంబంధించి కేంద్ర ఎలక్ర్టానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ సంకేత్ ఎస్ బోండ్వే అధ్యక్షతన విమానయాన సంస్థలు, సోషల్ మీడియా దిగ్గజాలైన ఎక్స్, మెటా వంటి సంస్థల ప్రతినిధులతో వర్చువల్గా సమావేశం నిర్వహించారు. ఎక్స్ వేదికగా బెదిరింపులు రావడంతో వాటి కట్టడి విషయంలో ఆ సంస్థ తీరుపై కేంద్రం తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్టు తెలిసింది.
ఈ పరిస్థితిపై ఎక్స్ తీరు నేరానికి ఊతమిస్తున్నట్టుగా ఉందంటూ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. అలాగే ఇలాంటి ఆందోళనకరమైన వదంతులను నిలువరించేందుకు ఎలాంటి చర్యలు తీసుకున్నారంటూ సంస్థ ప్రతినిధులను ప్రశ్నించినట్టు తెలుస్తోంది. విమానాలకు బెదిరింపుల మెసేజ్లు పోస్ట్ చేసిన యూజర్ల ఐడీ లేదా అకౌంట్ల డొమైన్కు సంబంధించిన వివరాలను ఢిల్లీ పోలీసులు పొందడంలో విఫలమవడమే కేంద్రం ఆ సంస్థపై కన్నెర్రజేయడానికి కారణమని సమాచారం. బాంబు బెదిరింపులకు సంబంధించి ఢిల్లీ పోలీసులు ఎనిమిది ఎఫ్ఐఆర్లను నమోదు చేశారు.