Share News

Lucknow : అయోధ్య మసీదుకిచ్చిన స్థలం నాది!

ABN , Publish Date - Jul 29 , 2024 | 03:34 AM

రామజన్మభూమి-బాబ్రీ మసీదు వివాదంలో సుప్రీంకోర్టు తీర్పు మేరకు అయోధ్యలోని ధన్నీపూర్‌ గ్రామంలో మసీదు నిర్మాణానికి ప్రభుత్వం కేటాయించిన ఐదెకరాల స్థలం తన కుటుంబానికి చెందినదని ఢిల్లీకి చెందిన మహిళ రాణీ పంజాబీ చెప్పారు.

Lucknow : అయోధ్య మసీదుకిచ్చిన స్థలం నాది!

  • సుప్రీంకోర్టును ఆశ్రయిస్తానన్న ఢిల్లీ మహిళ

లఖ్‌నవూ, జూలై 28: రామజన్మభూమి-బాబ్రీ మసీదు వివాదంలో సుప్రీంకోర్టు తీర్పు మేరకు అయోధ్యలోని ధన్నీపూర్‌ గ్రామంలో మసీదు నిర్మాణానికి ప్రభుత్వం కేటాయించిన ఐదెకరాల స్థలం తన కుటుంబానికి చెందినదని ఢిల్లీకి చెందిన మహిళ రాణీ పంజాబీ చెప్పారు. ధన్నీపూర్‌ గ్రామంలో తమ కుటుంబానికి 28.35 ఎకరాల భూమి ఉందని, అందులోనే 5 ఎకరాలను మసీదు కోసం ప్రభుత్వం కేటాయించిందని ఆమె తెలిపారు.

స్థల యాజమాన్యానికి సంబంధించిన అన్ని పత్రాలూ తమ వద్ద ఉన్నాయని, స్థలాన్ని తిరిగి సొంతం చేసుకునేందుకు సుప్రీంకోర్టును ఆశ్రయిస్తానని ఆమె పీటీఐకి తెలిపారు. 1983వ సంవత్సరం వరకు ఆ భూమిలో తాను, తన కుటుంబం వ్యవసాయం చేశామని, తన తండ్రి ఆరోగ్యం క్షీణించడంతో చికిత్స కోసం ఢిల్లీకి వచ్చి స్థిరపడ్డామని చెప్పారు.

ఆ భూమిలో మసీదు నిర్మించడంపై తనకేమీ అభ్యంతరం లేదని, అయితే ప్రభుత్వం తనకూ న్యాయం చేయాలని కోరుతున్నానని చెప్పారు. అయితే, మసీదు నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన ఇండో-ఇస్లామిక్‌ కల్చరల్‌ ఫౌండేషన్‌ అధ్యక్షుడు, సున్నీ సెంట్రల్‌ వక్ఫ్‌ బోర్డు చైర్మన్‌ జుఫర్‌ ఫారూఖీ ఆమె వాదనను తోసిపుచ్చారు. ఆమె వాదనను 2021లోనే అలహాబాద్‌ హైకోర్టు కొట్టివేసిందన్నారు.

తాము ఇప్పటికే అనేకసార్లు రాణిని కలిసి, ఆధారాలు చూపించాలని కోరామని, అయితే, ఆమె చూపలేదని ఫౌండేషన్‌ సభ్యుడొకరు చెప్పారు. కాగా, మసీదు నిర్మాణం ప్రాజెక్టు పనులు ఈ ఏడాది అక్టోబరులో ప్రారంభం కానున్నట్టు జుఫర్‌ ఫారూఖీ తెలిపారు. మసీదు డిజైన్లను తిరిగి రూపొందించడం వల్ల నిర్మాణంలో జాప్యం జరిగిందని, నిధుల సమీకరణకు సంబంధించి ఎఫ్‌సీఆర్‌ఏ సర్టిఫికెట్‌ కూడా ఇంకా రాలేదని చెప్పారు.

Updated Date - Jul 29 , 2024 | 03:34 AM