Wayanad: ఎంపీగా ప్రియాంక గాంధీ పోటీ.. స్పందించిన రాబర్ట్ వాద్రా
ABN , Publish Date - Jun 18 , 2024 | 03:39 PM
ప్రియాంక గాంధీ వయనాడ్ నుంచి ఎన్నికల బరిలో దిగతుండడం తనకు సంతోషాన్ని కలిగించిందని ఆమె భర్త రాబర్ట్ వాద్రా వెల్లడించారు. పార్టీ తరఫున ప్రచారం చేయడమే కాదు.. ప్రియాంక పార్లమెంట్లో ఉండాలని స్పష్టం చేశారు.
![Wayanad: ఎంపీగా ప్రియాంక గాంధీ పోటీ.. స్పందించిన రాబర్ట్ వాద్రా](https://media.andhrajyothy.com/media/2024/20240615/vadra_b04d0557d2.jpg)
న్యూఢిల్లీ, జూన్ 18: ప్రియాంక గాంధీ వయనాడ్ నుంచి ఎన్నికల బరిలో దిగతుండడం తనకు సంతోషాన్ని కలిగించిందని ఆమె భర్త రాబర్ట్ వాద్రా వెల్లడించారు. పార్టీ తరఫున ప్రచారం చేయడమే కాదు.. ప్రియాంక పార్లమెంట్లో ఉండాలని ఆయన స్పష్టం చేశారు. తన కంటే ముందు ప్రియాంక గాంధీ పార్లమెంట్లో ఉండాలని ఈ సందర్భంగా రాబర్ట్ వాద్రా ఆకాంక్షించారు. అయితే సమయం వచ్చినప్పుడు ఆమెను.. తాను అనుసరిస్తానన్నారు.
ప్రియాంక గాంధీకి అనుకూలంగా వయనాడ్ ప్రజలు తీర్పు ఇస్తారని వాద్రా ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక ప్రాంతీయ రాజకీయాలు చేస్తున్న బీజేపీకి ఈ ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పారన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వయనాడ్ ఎంపీగా పోటీ చేయనున్నారంటూ.. ఆ పార్టీ తాజాగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఈ అంశంపై మంగళవారం మీడియా ఎదుట ప్రియాంక భర్త రాబర్ట్ వాద్రా మాట్లాడుతూ.. పైవిధంగా స్పందించారు. మరోవైపు ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో తాను పోటీ చేయాలని అమేఠీ ప్రజలు కోరుకుంటున్నారంటూ రాబర్ట్ వాద్రా కీలక వ్యాఖ్యలు చేసిన విషయం విధితమే.
Also Read: నేడు సొంత నియోజకవర్గంలో ప్రధాని మోదీ పర్యటన
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్ గాంధీ వయనాడ్, రాయ్బరేలీ నుంచి భారీ అధిక్యంతో గెలుపొందారు. ఇక ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం 14 రోజుల్లో ఆ రెండు నియోజకవర్గాల్లో ఏదో ఒక దానికి రాజీనామా చేయాల్సి ఉంది. ఆ క్రమంలో పార్టీలో తీవ్ర తర్జన భర్జనలు అనంతరం వయనాడ్ ఎంపీ స్థానానికి రాహుల్ గాంధీ రాజీనామా చేశారు. దాంతో ఆ లోక్సభ స్థానం నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేస్తారని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.
Also Read: బాలాసోర్లో ఉద్రిక్తత.. కర్ఫ్యూ విధింపు
ఇక తనను ఎంపీగా గెలిపించినందుకు వయనాడ్ ప్రజలకు రాహుల్ గాంధీ ధన్యవాదాలు తెలిపారు. తరచు వయనాడ్లో పర్యటిస్తానని ఆయన చెప్పారు. అలాగే ఎన్నికల వేళ వయనాడ్ ప్రజలకు తాను ఇచ్చిన హామీలు అమలు చేస్తానని ఈ సందర్భంగా రాహుల్ గాంధీ స్పష్టం చేశారు.
అయితే యూపీలోని రాయ్బరేలీ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. ఆ స్థానం నుంచి దాదాపు రెండు దశాబ్దాలుగా ప్రాతినిధ్యం వహిస్తున్న సోనియాగాంధీ ఇటీవల రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. దీంతో సదరు లోక్సభ స్థానం నుంచి రాహుల్ గాంధీ బరిలో నిలిచి గెలిచారు.
అదీకాక గత ఎన్నికల్లో అంటే.. 2019 ఎన్నికల్లో రాహుల్ గాంధీ అమేఠీతోపాటు వయనాడ్ నుంచి బరిలో దిగారు. అమేఠీలో బీజేపీ అభ్యర్థి స్మృతీ ఇరానీ చేతిలో ఆయన ఓటమి పాలయ్యారు. అలాగే వయనాడ్ నుంచి రాహుల్ గెలుపొందారు. ఆ క్రమంలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో వయనాడ్తోపాటు రాయ్బరేలీ నుంచి రాహుల్ పోటీ చేసి రెండు స్థానాల్లో గెలుపొందిన విషయం విధితమే.
Read Latest Telangana News and National News