Share News

Bihar: పుష్ప సినిమా సీన్.. కానీ ఆయిల్ ట్యాంకర్‌లో..

ABN , Publish Date - Oct 23 , 2024 | 03:41 PM

బిహార్‌ అసెంబ్లీకి త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో తమ పార్టీని గెలిపిస్తే.. అధికారంలోకి వచ్చిన కేవలం కొన్ని గంటల్లోనే రాష్ట్రంలో మద్యపాన నిషేధం ఎత్తివేస్తామని జనసూరజ్ పార్టీ అధినేత, ఎన్నికల వ్యూహా కర్త ప్రశాంత్ కిషోర్ ఇప్పటికే ప్రకటించిన విషయం విధితమే.

Bihar: పుష్ప సినిమా సీన్.. కానీ ఆయిల్ ట్యాంకర్‌లో..

బిహార్, అక్టోబర్ 23: ఎర్రచందనం స్మగ్లింగ్ ప్రధాన కథాంశంగా తెరకెక్కిన చిత్రం పుష్ప. ఈ చిత్రంలో ఎర్రచందనాన్ని అక్రమ రవాణా చేయడం కోసం హీరో వివిధ రకాల మార్గాలను ఎంచుకుంటాడు. పాల వ్యాన్‌లో ఎర్రచందనాన్ని అక్రమ రవాణా చేసే క్రమంలో పోలీసులు, అటవీ శాఖ అధికారుల కళ్లను సైతం హీరో పుష్ప కప్పుతాడు. అయితే దాదాపుగా ఇదే రీతిలో ఆయిల్ ట్యాంకర్‌లో లిక్కర్ స్మగ్లింగ్ చేస్తూ.. ఎక్సైజ్ పోలీసులకు అడ్డంగా దొరికిపోయారీ స్మగ్లర్లు.


liquor.jpg

ఈ ఘటన బుధవారం బిహార్‌లోని ముజఫర్‌పూర్‌లో చోటు చేసుకుంది. హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్‌కు చెందిన ఆయిల్ ట్యాంకర్‌లో భారీగా మందు బాటిళ్లు అక్రమ రవాణా జరుగుతున్నట్లు ఎక్సైజ్ పోలీసులకు సమాచారం అందింది. దీంతో ముజఫర్‌పూర్‌లోని ప్రధాన రహదారిపై వాహనాల తనిఖీని ఎక్సైజ్ శాఖ పోలీసులు చేేపట్టారు. ఈ సందర్బంగా ట్యాంకర్‌లో ఆయిల్‌కు బదులు మద్యం బాటిళ్ల అట్ట పెట్టెలు భారీగా ఉన్నట్లు ఎక్సైజ్ పోలీసులు కనుగోన్నారు.


ఆ క్రమంలో డ్రైవర్‌తోపాటు మద్యం వ్యాపారీ ట్యాంకర్‌ను వదిలి పరారయ్యారు. మద్యం బాటిళ్లను సీజ్ చేసి.. ఆయిల్ ట్యాంకర్‌ను ఎక్సైజ్ పోలీస్ స్టేషన్‌‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అసిస్టెంట్ ఎక్సైజ్ కమిషనర్ విజయ్ శేఖర్ దుబే వెల్లడించారు. అయితే స్వాధీనం చేసుకున్న మద్యం అరుణాచల్‌ప్రదేశ్‌లో తయారైందని తెలిపారు. అలాగే ఆయిల్ ట్యాంకర్ నాగాలాండ్ రిజిస్ట్రేషన్‌తో ఉందని చెప్పారు. ఇక ఈ మద్యం అక్రమ రవాణా చేస్తున్న స్థానిక వ్యాపారిని గుర్తించామన్నారు. అతడి అరెస్ట్ చేస్తామని స్పష్టం చేశారు. మద్యం బాటిళ్ల కోసం పెట్రోల్ ట్యాంకర్‌లో చిన్నపాటి కంపార్ట్‌మెంట్లను సైతం స్మగ్లర్లు ఏర్పాటు చేశారని వివరించారు.


బిహార్‌లో మద్య నిషేధం అమల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వివిధ రాష్ట్రాల నుంచి బిహార్‌లోకి అక్రమంగా మద్యాన్ని తీసుకు వచ్చి.. విక్రయాలు చేసేందుకు స్మగ్లర్లు వివిధ మార్గాలను ఎంచుకుంటున్నారు. కొన్ని సమయాల్లో మద్యం స్మగ్లింగ్ కోసం అంబులెన్సులు, ట్రక్కులను సైతం స్మగ్లర్లు వినియోగిస్తున్నారు.


ఇక బిహార్‌ అసెంబ్లీకి త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో తమ పార్టీని గెలిపిస్తే.. అధికారంలోకి వచ్చిన కేవలం కొన్ని గంటల్లోనే రాష్ట్రంలో మద్యపాన నిషేధం ఎత్తివేస్తామని జనసూరజ్ పార్టీ అధినేత, ఎన్నికల వ్యూహా కర్త ప్రశాంత్ కిషోర్ ఇప్పటికే ప్రకటించిన విషయం విధితమే.

For National News And Telugu News...

Updated Date - Oct 23 , 2024 | 03:44 PM