Share News

Yogi Kanwar orders: కన్వర్ యాత్రపై యోగి వివాదాస్పద ఆదేశాలు.. భగ్గుమన్న సొంతపార్టీ నేతలు

ABN , Publish Date - Jul 19 , 2024 | 06:03 PM

ఏటా లక్షలాది మంది శివభక్తులు పాల్గొనే 'కన్వర్ యాత్ర' రూటులో తినుబండారాలకు సంబంధించి ఉత్తప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ శుక్రవారంనాడు ఇచ్చిన ఆదేశాలు వివాదాస్పదంగా మారాయి. తినుబండారాల దుకాణాల వద్ద యజమానులు, సిబ్బంది పేర్లు తప్పనిసరిగా ఉండాలని సీఎం ఆదేశించారు.

Yogi Kanwar orders: కన్వర్ యాత్రపై యోగి వివాదాస్పద ఆదేశాలు.. భగ్గుమన్న సొంతపార్టీ నేతలు

లక్నో: ఏటా లక్షలాది మంది శివభక్తులు పాల్గొనే 'కన్వర్ యాత్ర' (Kanwar Yatra) రూటులో తినుబండారాలకు (Eateries) సంబంధించి ఉత్తప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) శుక్రవారంనాడు ఇచ్చిన ఆదేశాలు వివాదాస్పదంగా మారాయి. తినుబండారాల దుకాణాల వద్ద యజమానులు, సిబ్బంది పేర్లు తప్పనిసరిగా ఉండాలని సీఎం ఆదేశాలిచ్చారు. ఈ ఆదేశాలపై విపక్షాల నుంచే కాకుండా అధికార ఎన్డీయే భాగస్వాముల నుంచి కూడా విమర్శలు వెల్లువెత్తాయి. ఇలాంటి ఆదేశాల వల్ల మతపరమైన ఉద్రిక్తతలు తలెత్తే అవకాశముందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.


రాజ్యంగ విరుద్ధం: మాయావతి

కాగా, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ ప్రభుత్వాలు కన్వర్ యాత్రకు వెళ్లే మార్గంలోని దుకాణాలపై యజమానులు, సిబ్బంది పేర్లు ప్రదర్శించాలని అనడం, మాంసం అమ్మకాలు నిషేధించడం పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్‌పీ) అధ్యక్షురాలు మాయావతి విమర్శలు గుప్పించారు. ఎన్నికల ప్రయోజనాల కోసమే యూపీ సర్కార్ ఈ ఆదేశాలిచ్చిందని సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో ఆమె ట్వీట్ చేశారు. ఈ చర్య ఆర్థికంగా ఒక వర్గం ప్రజలను బాయ్‌కాట్ చేయడమేనని, ఇది గర్హనీయమని అన్నారు.

Himanta Biswa Sarma: 2041 నాటికి ముస్లిం మెజారిటీ రాష్ట్రంగా...


తొందరపాటు చర్య: కేంద్ర మంత్రి నఖ్వి

అత్యుత్సాహం కలిగిన కొందరు అధికారులు ఇచ్చే ఆదేశాల వల్ల అంటరానితనమనే వ్యాధి ప్రబలే అవకాశం ఉందని కేంద్ర మంత్రి, బీజేపీ నేత ముక్తార్ అబ్బాస్ నఖ్వి వ్యాఖ్యానించారు. మత విశ్వాసాలను గౌరవించాల్సిందేనని, కానీ అంటరానితనాన్ని ప్రోత్సహించరాదని అన్నారు. పుట్టుక, కులం, వంశం గురించి ప్రశ్నించరాదన్నారు. అందరూ భగవంతుని బిడ్డలేనని, ఎవరూ తక్కువ కులం వారు కాదని నఖ్వి ట్వీట్ చేశారు. కన్వర్ యాత్రలో తాను పాల్గొన్న ఫోటోను కూడా ఆయన పోస్ట్ చేశారు. యాత్రలో మతపరమైన విశ్వాసాలను గౌరవించాలంటూ తమకు ఎవరూ పాఠాలు నేర్పక్కరలేదన్నారు.


కాగా, వివిధ పార్టీల నుంచి విమర్శలు రావడంతో ముజఫర్ నగర్ స్థానిక యంత్రాంగ గురువారంనాడు తమ ఆదేశాలను సవరించింది. తినుబండారాల దుకాణాల వద్ద యజమానులు తమ పేర్లు ప్రదర్శించడం ఐచ్ఛికమేనని తెలిపింది. అయితే, యోగి ఆదిత్యనాథ్ శుక్రవారంనాడు స్పష్టమైన ఆదేశాలిస్తూ, యాత్రామార్గంలోని అన్ని దుకాణాలు, తోపుడు బండ్ల వద్ద తప్పనిసరిగా యజమానుల పేర్లు ప్రదర్శించాలన్నారు.

For More National News and Telugu News..

Updated Date - Jul 19 , 2024 | 06:06 PM