Share News

Mahua Moitra: నన్ను టార్గెట్ చేయడంతోనే 63 మంది ఎంపీలు ఓడారు.. బీజేపీపై విరుచుకుపడిన మహువా మొయిత్రా

ABN , Publish Date - Jul 01 , 2024 | 08:07 PM

తనను టార్గెట్ చేసి సభ నుంచి బహిష్కరించినందుకే లోక్ సభలో బీజేపీకి 63 మంది సభ్యుల బలం తగ్గిందని తృణమూల్ కాంగ్రెస్ (TMC) ఎంపీ మహువా మొయిత్రా(Mahua Moitra)దుయ్యబట్టారు.

Mahua Moitra: నన్ను టార్గెట్ చేయడంతోనే 63 మంది ఎంపీలు ఓడారు.. బీజేపీపై విరుచుకుపడిన మహువా మొయిత్రా

ఢిల్లీ: తనను టార్గెట్ చేసి సభ నుంచి బహిష్కరించినందుకే లోక్ సభలో బీజేపీకి 63 మంది సభ్యుల బలం తగ్గిందని తృణమూల్ కాంగ్రెస్ (TMC) ఎంపీ మహువా మొయిత్రా(Mahua Moitra)దుయ్యబట్టారు. పార్లమెంటు ఎన్నికల్లో గెలిచి మళ్లీ సభలో అడుగుపెట్టిన ఆమె.. పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా మాట్లాడుతూ.. తనను టార్గెట్ చేయడంతో కాషాయ పార్టీ(BJP) భారీ మూల్యం చెల్లించుకుందన్నారు.

"లోక్ సభలో ఎన్నికలకు ముందు నన్ను ఇక్కడ మాట్లాడనివ్వలేదు. అధికార పార్టీ ఒక ఎంపీ గొంతు నొక్కినందుకు మూల్యం చెల్లించుకుంది. నన్ను అణచివేసే ప్రయత్నంలో 63మంది బీజేపీ ఎంపీలను ఇంట్లో కూర్చోబెట్టారు. వారు నన్ను మౌనంగా ఉంచాలని చూశారు. కానీ ప్రజలు వారిని నిశ్శబ్దం చేశారు" అని మొయిత్రా ధిక్కార స్వరంతో అన్నారు. కేంద్రంలో రెండు ప్రాంతీయ పార్టీలపై ఆధారపడి బీజేపీ అధికారం చేపట్టిందని.. ఏదో ఒక రోజు సంకీర్ణ ప్రభుత్వం కూలిపోతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు.


ఎందుకు బహిష్కరించారంటే..

లోక్‌సభలో ప్రశ్నలు అడిగేందుకు పారిశ్రామికవేత్త హీరానందాని నుంచి మొయిత్రా డబ్బులు, కానుకలు తీసుకున్నారని, ఆమె పార్లమెంట్ వివరాలను దుబాయి నుంచి యాక్సెస్‌ చేశారని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. ఈ వివాదంపై ఎథిక్స్‌ కమిటీ విచారణ చేపట్టింది.

అనైతిక ప్రవర్తనతో సభా ధిక్కరణకు పాల్పడినట్లు గుర్తించి రిపోర్ట్ ఇచ్చింది. దీంతో స్పీకర్ ఆమెను పార్లమెంటు సమావేశాల నుంచి బహిష్కరించారు. అప్పటి నుంచి మొయిత్రా పార్లమెంటు సమావేశాలకు దూరమయ్యారు. ఈ మధ్యే జరిగిన లోక్ సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కృష్ణానగర్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి అమృతా రాయ్‌పై విజయం సాధించి మరోమారు పార్లమెంటులో అడుగు పెట్టారు.

For Latest News and National News click here

Updated Date - Jul 01 , 2024 | 08:07 PM