Share News

Navya : యాక్షన్‌ హంగామా

ABN , Publish Date - Jun 23 , 2024 | 12:56 AM

మన హీరోలు మీసం మెలిపెడుతున్నారు కయ్యానికి సై అంటున్నారు కదనరంగంలో చురకత్తుల్లా కదులుతున్నారు. ప్రేక్షకులకు పసందైన యాక్షన్‌ విందును అందించేందుకు శ్రమిస్తున్నారు.

Navya : యాక్షన్‌ హంగామా

మన హీరోలు మీసం మెలిపెడుతున్నారు కయ్యానికి సై అంటున్నారు కదనరంగంలో చురకత్తుల్లా కదులుతున్నారు. ప్రేక్షకులకు పసందైన యాక్షన్‌ విందును అందించేందుకు శ్రమిస్తున్నారు. ప్రస్తుతం యాక్షన్‌ చిత్రాల ట్రెండ్‌ నడుస్తోంది. జూలైలో సెట్స్‌పైన ఉన్న సినిమాల్లో అగ్రహీరోలంతా పోరాటాల బాట పట్టారు. స్టంట్‌ మాస్టర్ల నేతృత్వంలో సరికొత్త పోరాట ఘట్టాలను వెండితెరపైకి తెచ్చేందుకు సిద్ధమవుతున్నారు.

Untitled-1 copy.jpg

వర్షంలో దేవర పోరాటం

ఎన్టీఆర్‌ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న పాన్‌ ఇండియా చిత్రం ‘దేవర’. సైఫ్‌ అలీఖాన్‌ ప్రతినాయక పాత్ర పోషిస్తున్నారు. చిత్రీకరణ చివరి దశలో ఉంది. ఇటీవలే గోవా షెడ్యూల్‌ను పూర్తి చేశారు. ఎన్టీఆర్‌, సైఫ్‌ పై పీటర్‌ హెయిన్స్‌ నేతృత్వంలో గోవా అడవుల్లో భారీ పోరాట ఘట్టాలను తెరకెక్కించారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా సైఫ్‌, ఎన్టీఆర్‌ ఈ షెడ్యూల్‌లో పాల్గొన్నారు. తదుపరి షెడ్యూల్‌ థాయ్‌లాండ్‌లో జరుగుతోంది. ఈ చిత్రంలో జాన్వీకపూర్‌ కథానాయిక. ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌, యువసుధ ఆర్ట్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

పతాక సన్నివేశాల్లో పుష్ప 2

‘పుష్ప 2: ది రూల్‌’ కోసం అల్లు అర్జున్‌ బరిలోకి దిగారు. ప్రస్తుతం పతాక సన్నివేశాలతో పాటు పాటలు తెరకెక్కిస్తున్నారు. గ్రామీణ నేపథ్యంలో ప్రత్యేకంగీ తీర్చిదిద్దిన సెట్‌లో టాకీపార్ట్‌తో పాటు పోరాట ఘట్టాలను తెరకెక్కిస్తున్నారు. రష్మిక మందన్న కథానాయిక. సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రం డిసెంబర్‌ 6న విడుదలవుతోంది.


ప్రత్యేక సెట్‌లో

వరుణ్‌తేజ్‌ హీరోగా నటిస్తున్న తొలి పాన్‌ ఇండియా చిత్రం ‘మట్కా’. వైజాగ్‌ నేపథ్యంలో సాగే పీరియాడిక్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ చిత్రమిది. కరుణ కుమార్‌ దర్శకత్వంలో విజేందర్‌రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి నిర్మిస్తున్నారు. ఈ నెల 19న చిత్రబృందం తాజా షెడ్యూల్‌ను ప్రారంభించింది. భారీసెట్‌లో వరుణ్‌పై యాక్షన్‌ సీక్వెన్స్‌తో పాటు కొంత టాకీపార్ట్‌ను తెరకెక్కించనున్నారు.

ప్రేమికుల ఫైట్‌

అడివిశేష్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘డెకాయిట్‌’. శ్రుతీహాసన్‌ కథానాయిక. ఇటీవలే హైదరాబాద్‌లో తాజా షెడ్యూల్‌ మొదలుపెట్టారు. శ్రుతీహాసన్‌, శేష్‌పై భారీ యాక్షన్‌ సీక్వెన్స్‌తో పాటు కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. వరుస దోపిడీల కోసం చేతులు కలిపిన ఇద్దరు మాజీ ప్రేమికుల కథ ఇది. ఈ చిత్రానికి అడివిశేష్‌ కథ, స్ర్కీన్‌ప్లే అందించారు. షానీల్‌ డియో దర్శకత్వం వహిస్తున్నారు.

భారీసెట్‌లో పోరాటం

ధనుష్‌ హీరోగా శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘కుబేర’. అక్కినేని నాగార్జున కీలకపాత్ర పోషిస్తున్నారు. రష్మిక మందన్న కథానాయిక. ఈ నెల తొలివారంలో హైదరాబాద్‌లో కొత్త షెడ్యూల్‌ మొదలైంది. ఈ సినిమాలో కీలకమైన యాక్షన్‌ సీక్వెన్స్‌ కోసం భారీసెట్‌ వేశారు. ఇందులో నాగార్జున, ధనుష్‌ సహా ఇతర తారాగణంపై భారీ యాక్షన్‌ సీక్వెన్స్‌ తెరకెక్కించారు. సరికొత్త కథాంశంతో వస్తున్న ఈ చిత్రానికి సునీల్‌ నారంగ్‌, పుస్కూర్‌ రామ్మోహన్‌రావు నిర్మాతలు.

బరిలోకి బచ్చన్‌

‘మిస్టర్‌ బచ్చన్‌’ చిత్రం షూటింగ్‌తో బిజీగా ఉన్నారు రవితేజ. హరీశ్‌ శంకర్‌ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో జగపతిబాబు విలన్‌ పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రంలో ఇన్‌కంటాక్స్‌ ఆఫీసర్‌గా రవితేజ అలరించనున్నారు. ఇటీవలే చిత్రబృందం ప్రత్యేకంగా వేసిన సెట్‌లో కీలకమైన యాక్షన్‌ ఘట్టాలను తెరకెక్కించారు. ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే కథానాయిక.


Untitled-2 copy.jpg

పోరాటం షురూ..

మన హీరోలే కాదు కొందరు పరభాషా హీరోలు సైతం యాక్షన్‌ మోడ్‌లో ఉన్నారు. తమిళ కథానాయకుడు ఆర్య హీరోగా రూపొందుతున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘మిస్టర్‌ ఎక్స్‌’. ఇటీవలే భారీ యాక్షన్‌ సీక్వెన్స్‌తో చిత్రీకరణ పూర్తి చేశారు. పోరాట ఘట్టాల్లో ఆర్య చూపిన తెగువ ప్రశంసనీయం అని చిత్రబృందం తెలిపింది. మలయాళ సూపర్‌స్టార్‌ మోహన్‌లాల్‌ ‘లూసిఫర్‌ 2: ఎంపురాన్‌’ చిత్రీకరణతో బిజీగా ఉన్నారు. ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ను పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ తెరకెక్కిస్తున్నారు. ఈ నెల ఆరంభంలో కొచ్చిలో ఓ షెడ్యూల్‌ పూర్తయింది. తాజాగా గుజరాత్‌లో కొత్త షెడ్యూల్‌ మొదలైంది. ఈ సినిమాకు కీలకమైన పోరాట ఘట్టాలను అక్కడ తెరకెక్కిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. వరుసగా యాక్షన్‌ చిత్రాలు చేస్తూ వస్తున్నారు అజిత్‌. ప్రస్తుతం ఆయన ‘గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ, విడాముయార్చి’ షూటింగ్స్‌తో తీరిక లేకుండా ఉన్నారు. ఈ చిత్రం చివరి షెడ్యూల్‌ ఈ నెల 24 నుంచి అజర్‌బైజాన్‌లో మొదలవనుంది. అజిత్‌పై భారీ యాక్షన్‌ సీక్వెన్స్‌తో పాటు కీలక సన్నివేశాలను తెరకెక్కించనున్నారు. ఇందులో త్రిష కథానాయిక. తిరుమేని దర్శకుడు. దీపావళికి ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

  • ‘కేజీఎఫ్‌’ సిరీస్‌ తర్వాత యశ్‌ కథానాయకుడిగా తెరకెక్కుతోన్న చిత్రం ‘టాక్సిక్‌’. ఈ చిత్రంలో ఆయన గ్యాంగ్‌స్టర్‌ పాత్రలో కనిపించనున్నారు. గీతూ మోహన్‌దాస్‌ దర్శకత్వంలో కేవీఎన్‌ ప్రొడక్షన్స్‌ నిర్మిస్తోంది. ఈ సినిమా భారీ షెడ్యూల్‌ను చిత్రబృందం యూకేలో జరపనుంది. అక్కడే యాక్షన్‌ సీక్వెన్స్‌తో పాటు కీలక సన్నివేశాలను తెరకెక్కించనున్నారు.

  • వరుసగా విలన్‌ పాత్రలతో అలరిస్తూ వస్తున్నారు సైఫ్‌ అలీఖాన్‌ హీరోగా ‘జ్యువెల్‌ థీఫ్‌’ పేరుతో ఓ చిత్రం వస్తోంది. రాఖీ గ్రేవాల్‌ దర్శకత్వం వహిస్తున్నారు. సిద్ధార్థ్‌ ఆనంద్‌ నిర్మాత. యాక్షన్‌ అడ్వంచర్‌లో సైఫ్‌ ఒళ్లు గగుర్పొడిచే స్టంట్స్‌ చేశారు. ఇటీవలే ఆయన ఈ సినిమా చిత్రీకరణ ముగించారు.

Updated Date - Jun 23 , 2024 | 12:58 AM