Share News

Navya : కొత్త జోడీ ఖాయమేనా?

ABN , Publish Date - Jul 07 , 2024 | 01:03 AM

కొత్త సినిమాల ప్రకటనలు వచ్చిందే తడవు.. హీరో, దర్శకుడు తర్వాత ప్రేక్షకుల దృష్టంతా ఆ సినిమాలో నటించబోయే కథానాయికపైనే. కొత్త సినిమా ప్రకటించినప్పటి నుంచే కథానాయికగా నటించబోయే హీరోయిన్ల గురించి వార్తలు షికారు చేస్తాయి.

Navya : కొత్త జోడీ ఖాయమేనా?

కొత్త సినిమాల ప్రకటనలు వచ్చిందే తడవు.. హీరో, దర్శకుడు తర్వాత ప్రేక్షకుల దృష్టంతా ఆ సినిమాలో నటించబోయే కథానాయికపైనే. కొత్త సినిమా ప్రకటించినప్పటి నుంచే కథానాయికగా నటించబోయే హీరోయిన్ల గురించి వార్తలు షికారు చేస్తాయి. కారణాలేమైనా వాటిలో కొన్ని కాంబినేషన్లు మాత్రమే చివరకు సెట్టవుతాయి. ఈ కోవలో ప్రస్తుతం ఇండస్ట్రీలో, ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచుతున్న సరికొత్త కాంబినేషన్లు ఇవే.

Untitled-4 copy.jpg

తొలిసారి జోడీ కుదిరేనా

‘ఉప్పెన’ చిత్రంతో ఉవ్వెత్తున ఎగసిన కృతి శెట్టి కెరీర్‌ ఆ తర్వాత మాత్రం అనుకున్న విధంగా ముందుకు సాగలేదు. వరుస చిత్రాలు నిరాశపరిచాయి. స్టార్‌డమ్‌ చేతికి అందినట్టే అంది చేజారింది. ఇటీవలే శర్వానంద్‌ సరసన నటించిన ‘మనమే’ సైతం చేదు ఫలితాన్నే అందించింది. కొన్నాళ్ల క్రితమే తమిళ, మలయాళ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన కృతి అక్కడా సినిమాలు చేస్తూ బిజీగా మారారు. ప్రస్తుతం ఆమె తమిళంలో మూడు చిత్రాలు చేస్తున్నారు. కార్తీ సరసన ‘వా వాత్తియార్‌’లో నటిస్తున్నారు. ఇది చిత్రీకరణ పూర్తి చేసుకుంది. అలాగే ప్రదీప్‌ రంగనాథన్‌ కథానాయకుడిగా విఘ్నశ్‌ శివన్‌ దర్శకత్వం వహిస్తున్న ‘లవ్‌ ఇన్సూరెన్స్‌ కార్పోరేషన్‌’ చిత్రంలో నటిస్తున్నారు కృతి. అగ్రహీరో జయం రవి సరసన ‘జీనీ’లోనూ కథానాయికగా నటిస్తున్నారు. ఇప్పుడు మరో అరుదైన అవకాశం కృతికి దక్కిందంటున్నాయి పరిశ్రమ వర్గాలు. దుల్కర్‌ సల్మాన్‌ సరసన ఆమె కథానాయికగా నటించబోతున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి. సెల్వరాజ్‌ దర్శకత్వంలో దుల్కర్‌ సల్మాన్‌ ఓ సినిమా చేస్తున్నారు. ఇందులో నటుడు రానా కీలకపాత్రలో నటించడంతో పాటు నిర్మిస్తున్నారనేది ఇండస్ట్రీ టాక్‌. ఇందులో కృతీశెట్టిని కథానాయికగా ఎంచుకున్నారని, త్వరలోనే అధికారిక ప్రకటన రావొచ్చని భావిస్తున్నారు.


Untitled-4 copy.jpg

నయన్‌ ప్లేస్‌లో శామ్‌?

అగ్రకథానాయికగా టాలీవుడ్‌లో తిరుగులేని ఆధిపత్యం చెలాయించిన సమంత కెరీర్‌ను మయోసైటిస్‌ వ్యాధి దెబ్బకొట్టింది. హీరోయిన్‌గా అవకాశాలకు కొదువ లేకపోయినా అనారోగ్యం నుంచి కోలుకునేందుకు ఆమె విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. గతేడాది ‘ఖుషీ’, ‘శాకుంతలం’ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకొచ్చినా, అవి రెండూ డిజాస్టర్‌లుగా మిగిలాయి. ప్రస్తుతం ఆమె తన సొంత బేనర్‌లో ‘మా ఇంటి బంగారం’ చిత్రాన్ని ప్రకటించారు. బయట సినిమాలేవీ అంగీకరించలేదు. అయితే సమంత నటించబోయే సినిమాలు అంటూ పరిశ్రమలో కొన్ని పేర్లు వినిపిస్తున్నాయి. ఆమె త్వరలో మలయాళ చిత్రం చేయబోతున్నారనే మాట వినిపిస్తోంది. మమ్ముట్టితో సమంత జతకట్టబోతున్నారట. నటుడు, దర్శకుడు గౌతమ్‌ వాసుదేవ్‌ మీనన్‌ ఈ చిత్రానికి దర్శకుడు. ఈ సినిమాలో గతంలో నయనతారను కథానాయికగా తీసుకున్నారు. కానీ తర్వాత ఏవో కారణాల వల్ల ఆమె తప్పుకున్నారు. ఆ స్థానంలో సమంతను తీసుకోవాలనే ఆలోచనతో చిత్రబృందం చర్చలు జరుపుతోంది. ఒకవేళ సమంత అంగీకరిస్తే ఆమెకు ఇది తొలి మలయాళ చిత్రం అవుతుంది. అలాగే ఈ ఏడాది సమంత బాలీవుడ్‌ ఎంట్రీ సైతం ఖాయం అంటున్నాయి పరిశ్రమ వర్గాలు. ఇటీవలే ‘ఢంకీ’ చిత్రంతో అలరించిన షారూఖ్‌ఖాన్‌, దర్శకుడు రాజ్‌కుమార్‌ హిరాణీ కలయికలో మరో ప్రాజెక్ట్‌ ఓకే అయిది. ఇందులో షారూఖ్‌ఖాన్‌ సరసన సమంతను కథానాయికగా ఎంపిక చేసినట్లు సమాచారం. మంచి అవకాశం కావడంతో సమంత కూడా అంగీకరించారని అంటున్నారు. వచ్చే ఏడాది ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్తుంది.


కొత్త జంట

తను చేసే ప్రతి సినిమా ప్రేక్షకులకు గుర్తుండిపోయేలా ఉండాలని భావించే కొద్దిమంది కథానాయికల్లో సాయిపల్లవి ఒకరు. ప్రస్తుతం తెలుగులో నాగచైతన్య సరసన ‘తండేల్‌’ చిత్రంలో ఆమె నటిస్తున్నారు. ఈ ఏడాది సాయిపల్లవి బాలీవుడ్‌ అరంగేట్రం చేస్తున్నారు. రణ్‌బీర్‌ కపూర్‌ శ్రీరాముడిగా నటిస్తున్న ‘రామాయణ్‌’లో ఆమె సీతాదేవి పాత్రను పోషిస్తున్నారు. అలాగే ఆమిర్‌ ఖాన్‌ తనయుడు జునైద్‌ఖాన్‌ సరసన ఓ చిత్రంలో నటిస్తున్నారు. తమిళంలో శివకార్తికేయన్‌కు జోడీగా ‘అమరన్‌’ చిత్రంలో నటిస్తున్నారు. ఇప్పుడు ఆమె మరో తెలుగు సినిమాకు ‘ఎస్‌’ చెప్పారని టాలీవుడ్‌ టాక్‌. విజయ్‌ దేవరకొండ హీరోగా రవికిరణ్‌ కోలా దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. దిల్‌ రాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా సాయిపల్లవిని తీసుకునేందుకు చిత్రబృందం ప్రయత్నాలు చేస్తోందని సమాచారం. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కే చక్కని ప్రేమకథా చిత్రమిది. తన పాత్ర నచ్చడంతో సాయిపల్లవి కూడా సానుకూలంగా స్పందించారని తెలుస్తోంది. అయితే అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.


Untitled-5 copy.jpg

మహారాజ దర్శకుడితో

గతేడాది ‘జవాన్‌’తో బాలీవుడ్‌లో పాగా వేశారు నయనతార. ఆ సినిమా హిందీ పరిశ్రమలో సైతం కథానాయికగా ఆమె డిమాండ్‌ పెంచిందనే చెప్పాలి. అయితే ప్రస్తుతం ఆమె దక్షిణాది చిత్రాలపైనే దృష్టి సారించారు. ఇప్పుడు మరో సినిమాలో ఆమె పేరు బలంగా వినిపిస్తోంది. విజయ్‌సేతుపతి హీరోగా ‘మహారాజ’ చిత్రాన్ని తెరకెక్కించి సూపర్‌హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు దర్శకుడు నిథిలన్‌ స్వామినాథన్‌. ఇప్పుడు ఆయన తన కొత్త ప్రాజెక్ట్‌ కోసం నయనతారను కథానాయికగా ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఈ హీరోయిన్‌ ఓరియంటెడ్‌ మూవీలో నయనతార శక్తిమంతమైన పాత్రలో కనిపించనున్నారట. ప్రస్తుతానికి కథా చర్చలు జరుగుతున్నాయి. నయనతార ఈ సినిమాను అంగీకరించే అవకాశముందని కోలీవుడ్‌ టాక్‌. ప్రస్తుతం నయనతార యశ్‌ సరసన ‘టాక్సిక్‌’ చిత్రంలో నటిస్తున్నారు. ఇవి కాకుండా ఆమె నటిస్తున్న పలు తమిళ, మలయాళ చిత్రాలు వివిధ దశల్లో ఉన్నాయి.


హిందీ చిత్రంలో మృణాల్‌?

‘సీతారామం’ చిత్రంతో కథానాయికగా తెలుగు ప్రేక్షక హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు మృణాల్‌ ఠాకూర్‌. ఆ తర్వాత తెలుగులో నాని సరసన ‘హాయ్‌ నాన్న’, విజయ్‌ దేవరకొండతో ‘ది ఫ్యామిలీ స్టార్‌’ చిత్రాలు చేసిన అంతగా ఆదరణ పొందలేదు. ఇటీవలే ‘కల్కి 2898 ఏడీ’ చిత్రంలో అతిథి పాత్రలో కనిపించారు. ప్రస్తుతం ఆమె చేతిలో తెలుగు సినిమాలు ఏవీ లేవు. ‘పూజా మేరీ జాన్‌’ అనే హిందీ చిత్రంలో నటిస్తున్నారు మృణాల్‌. ఇప్పుడు మరో బాలీవుడ్‌ ప్రాజెక్ట్‌కు ఆమె పచ్చజెండా ఊపారని తెలుస్తోంది. సంజయ్‌ దత్‌, అజయ్‌ దేవగణ్‌ నటించిన ‘సన్‌ ఆఫ్‌ సర్దార్‌’ చిత్రానికి సీక్వెల్‌ రాబోతోంది. ఇందులో మృణాల్‌ ఠాకూర్‌ను కథానాయికగా ఎంపిక చేశారని బాలీవుడ్‌ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. నటనకు ఆస్కారం ఉన్న పాత్ర కావడంతో ఆమె కథ వినగానే గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారట. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Updated Date - Jul 07 , 2024 | 01:03 AM