YS Jagan: సొంత జిల్లాలోనే సీఎం జగన్కు బొమ్మ పడుతోంది!!
ABN , Publish Date - Apr 19 , 2024 | 09:54 AM
సీఎం జగన్కు సొంత జిల్లా కడపలోనే బొమ్మ కనిపిస్తోంది. చెల్లెళ్లు అలుపెరగకుండా చేస్తున్న పోరాటం ఆయన్ను ఇరకాటంలో పడేసింది. గత ఎన్నికల్లో విజయానికి వాడుకున్న చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి హత్య.. ఇప్పుడూ ప్రధానాంశంగా మారింది. ఈ హత్య కేసులో జగన్ సోదరుడు, కడప ఎంపీ వైఎస్ అవినాశ్రెడ్డి, ఆయన తండ్రి ప్రమేయం ఉందని సీబీఐ అభియోగాలు మోపడం.. వారికి జగన్ అండగా నిలవడం..
![YS Jagan: సొంత జిల్లాలోనే సీఎం జగన్కు బొమ్మ పడుతోంది!!](https://media.andhrajyothy.com/media/2024/20240413/YS_Jagan_Sisters_Stroke_d2f8a224f2.jpg)
సీఎం జగన్కు (CM YS Jagan) సొంత జిల్లా కడపలోనే (YSR Kadapa) బొమ్మ కనిపిస్తోంది. చెల్లెళ్లు అలుపెరగకుండా చేస్తున్న పోరాటం ఆయన్ను ఇరకాటంలో పడేసింది. గత ఎన్నికల్లో విజయానికి వాడుకున్న చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి హత్య.. ఇప్పుడూ ప్రధానాంశంగా మారింది. ఈ హత్య కేసులో జగన్ సోదరుడు, కడప ఎంపీ వైఎస్ అవినాశ్రెడ్డి, ఆయన తండ్రి ప్రమేయం ఉందని సీబీఐ అభియోగాలు మోపడం.. వారికి జగన్ అండగా నిలవడం.. అవినాశ్ను సీబీఐ అరెస్టు చేయకుండా కర్నూలులో భయానక వాతావరణం సృష్టించడం వంటివాటిని సీఎం చెల్లెళ్లు వైఎస్ షర్మిలారెడ్డి, వివేకా కుమార్తె సునీతారెడ్డి ఊరూవాడా ప్రచారం చేస్తున్నారు. కీలక ఎన్నికల సమయంలో తల్లి వైఎస్ విజయలక్ష్మి అమెరికా వెళ్లడం జగన్కు రాజకీయంగా పెద్ద దెబ్బేనని రాజకీయ వర్గాలు అంటున్నాయి. ఒకవైపు సొంత సర్వేల్లోనే వైసీపీ ఎమ్మెల్యేల పరిస్థితి బాగోలేదని ఆయన పలువురికి టికెట్లు నిరాకరించారు. కొందరి సీట్లు మార్చారు. అయినా మార్పు లేదని.. టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి విజయం ఖాయమని జాతీయ స్థాయి సర్వేలన్నీ చెబుతున్నాయి. దీంతో జగన్ ధైర్యం కోల్పోయారని వైసీపీ వర్గాల్లో ఆందోళన కనిపిస్తోంది. ఆయన మాటల్లో బెదురు కనిపిస్తోంది. నిన్నమొన్నటి వరకు 175 అసెంబ్లీ స్థానాలూ గెలుస్తామని.. ‘వైనాట్ 175’ అని ఒకటే ఊదరగొట్టారు. బస్సు యాత్రలో ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదు
ఆత్మరక్షణలో సీఎం..
గత ఎన్నికల సమయంలో వివేకాను చంద్రబాబు చంపించారంటూ ‘నారాసుర రక్తచరిత్ర’ అంటూ ప్రచారం చేసి జగన్ రాజకీయ లబ్ధి పొందారు. నాడు ఆయన నట విశ్వరూపాన్ని చూసి చెల్లెళ్లు నిజమని నమ్మారు. కానీ సీఎం అయ్యాక ఎప్పుడైతే సీబీఐ దర్యాప్తు పిటిషన్ను ఆయన ఉపసంహరించుకున్నారో.. అనుమానాలకు బీజం పడింది. సీబీఐ రంగప్రవేశంతో కీలక అంశాలు వెలుగుచూశాయి. చంపినవారిని, చంపించినవారిని చాలామటుకు దర్యాప్తు సంస్థ బయటపెట్టింది. అవినాశ్రెడ్డి, భాస్కర్రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్రెడ్డిల పాత్ర తేలడం, వారిని జగన్ బాహాటంగా సమర్థించడం, తండ్రి హత్య విషయం ప్రపంచం కంటే ముందే జగన్కు తెలుసని వెల్లడవడంతో సునీత బిత్తరపోయారు. ఇదే తరుణంలో ఆమె భర్తే హంతకుడన్న కోణంలో సీబీఐ దర్యాప్తు చేయడం లేదంటూ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన ప్రకటనతో నిందితులకు అన్న అండగా ఉన్నారని తేలిపోయింది.
ఎన్నెన్ని అడ్డంకులో..!
ఇప్పుడు కడప లోక్సభ బరిలో వైఎస్ అవినాశ్రెడ్డిపై పోటీకి దిగిన షర్మిల.. అన్నలాగే బస్సుయాత్ర చేస్తున్నారు. ఆమె, ఆమె వెంట ప్రచారంలో పాల్గొంటున్న సునీత కలిసి జగన్ను దుయ్యబడుతున్నారు. కొంగు చాచి న్యాయం అర్థిస్తున్నామంటూ ప్రజలను షర్మిల కోరుతున్న తీరు ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఇది బాగా జనంలోకి వెళ్తోంది. దీంతో ఆయన ఆత్మరక్షణలో పడ్డారు. ఇంకోవైపు... వైసీపీ పెద్దల ప్రోద్బలంతో కొందరు షర్మిల ప్రచారానికి అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే షర్మిల వారిని వేదికపైకి పిలిచి మైకిచ్చి మాట్లాడిస్తున్నారు. జగన్ రాష్ట్రానికి ఏం చేశాడో.. కడప జిల్లాకు ఏం చేశాడో చెప్పాలని పశ్నిస్తున్నారు. వారు అమ్మఒడి, పెన్షన్లను వల్లెవేస్తున్నారు. వెంటనే షర్మిల మైకందుకుని.. జగన్ తెస్తానన్న ప్రత్యేక హోదా, ఇస్తానన్న జాబ్ కేలెండర్, కడప స్టీల్ ప్లాంట్, దుగరాజపట్నం ఓడరేవు, పారిశ్రామిక కారిడార్లు, విశాఖకు రైల్వే జోన్, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిలుపుదల, పోలవరం ప్రాజెక్టు, రాయలసీమ ప్రాజెక్టుల నిలుపుదల వంటి అంశాలను లేవనెత్తుతున్నారు. జగన్ వైఫల్యాలకు జవాబు చెప్పలేక సదరు కార్యకర్తలు జారుకుంటున్నారు. ఈ తరుణంలో.. 2019 ఎన్నికల్లో తోడుగా ఉన్న జగన్ తల్లి విజయలక్ష్మి ఇప్పుడు అమెరికాలో ఉంటున్న షర్మిల పిల్లల వద్దకు వెళ్లిపోయారు.
మరిన్ని రాజకీయ కథనాల కోసం క్లిక్ చేయండి..