Share News

WhatsApp: మరో కొత్త స్కామ్.. వాట్సాప్‌లో ఈ-చలాన్‌లు పంపించి..

ABN , Publish Date - Jul 17 , 2024 | 03:28 PM

ప్రస్తుతం అందుబాటులో ఉన్న టెక్నాలజీని వినియోగించుకుని.. సైబర్ నేరగాళ్లు ఎంతో తెలివిగా ప్రజల్ని బురిడీ కొట్టిస్తున్నారు. ఫేక్ సందేశాలు పంపించి.. జనాలను బుట్టలో పడేసి..

WhatsApp: మరో కొత్త స్కామ్.. వాట్సాప్‌లో ఈ-చలాన్‌లు పంపించి..
WhatsApp E-Challan Scam

ప్రస్తుతం అందుబాటులో ఉన్న టెక్నాలజీని వినియోగించుకుని.. సైబర్ నేరగాళ్లు ఎంతో తెలివిగా ప్రజల్ని బురిడీ కొట్టిస్తున్నారు. ఫేక్ సందేశాలు పంపించి.. జనాలను బుట్టలో పడేసి.. లక్షల రూపాయలు దోచేసుకుంటున్నారు. ముఖ్యంగా.. వాట్సాప్ (WhatsApp) మాధ్యమంగా ఇలాంటి నేరాలకు పాల్పడుతున్నారు. ఇప్పుడు లేటెస్ట్‌గా మరో కొత్త స్కామ్ వెలుగులోకి వచ్చింది. ఫేక్ ఈ-చలాన్ సందేశాలు పంపించి.. మొబైల్ ఫోన్లలోకి మాల్వేర్ ఎక్కించి.. వాటిని హ్యాక్ చేస్తున్నారు. ఇప్పటికే 4,400 పరికరాలకు ఈ మాల్వేర్ సోకిందని.. రూ.16 లక్షలు కాజేశారని తేలింది.


పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సైబర్ నేరాలకు అరికట్టే ‘క్లౌడ్‌సెట్’ (CloudSEK) అనే సెబైర్ సెక్యూరిటీ సంస్థ ఇటీవల వ్రోంబా (Wromba) అనే మాల్వేర్‌ను గుర్తించింది. వియత్నాంకు చెందిన హ్యాకర్లు ఈ ఆండ్రాయిడ్ మాల్వేర్‌ను సృష్టించారని వాళ్లు కనుగొన్నారు. భారతీయ వినయోగారుల్ని టార్గెట్ చేసుకొని.. ఈ మాల్వేర్ ద్వారా భారీ డబ్బులు దండుకున్నారని వెల్లడైంది. తొలుత ఆ హ్యాకర్లు ఈ-చలాన్ పేరిట ఫేక్ సందేశాలు వాట్సాప్‌కు పంపుతారు. తాము కర్ణాటక పోలీసులు లేదా పరివాహన్ సేవకు చెందిన వాళ్లమని అబద్ధం చెప్పి.. ఆ వ్రోంబా మాల్వేర్‌ను తమ ఫోన్‌లలో ఇన్‌స్టాల్ చేసేలాగా మోసగిస్తున్నారు. ఒక్కసారి దాన్ని ఇన్‌స్టాల్ చేస్తే చాలు.. ఫోన్‌లోని డేటా మొత్తం హ్యాకర్ల చేతికి వెళ్లిపోతుంది.


ఆ మాల్వేర్ ఎలా పని చేస్తుంది?

హ్యాకర్లు వాట్సాప్‌లో ఒక లింక్ పంపుతారు. దాన్ని క్లిక్ చేసి.. పెండింగ్‌లో ఉన్న ఈ-చలాన్‌లు కట్టమని ఫేక్ మెసేజ్‌లో చెప్తారు. ఎప్పుడైతే ఆ లింక్ క్లిక్ చేస్తారో.. చట్టబద్ధమైన యాప్ రూపంలో హానికరమైన APKని డౌన్‌లోడ్ చేయాల్సిందిగా ఓ ప్రాంప్టర్ వస్తుంది. అప్పుడు ఇన్‌స్టాల్ బటన్ నొక్కితే.. ఇక ఖేల్ ఖతం. ఫోన్‌లోని కాంటాక్ట్స్ దగ్గర నుంచి ఇతర డేటా హ్యాకర్ల చేతుల్లోకి వెళ్తుంది. అన్ని పర్మిషన్లు అనుమతించబడతాయి. దాంతో వాళ్లు ఆర్థిక మోసాలకు పాల్పడుతారు. రిపోర్ట్స్ ప్రకారం.. భారత్‌లో 4400 మంది ఈ మాల్వేర్ బారిన పడి.. రూ.16 లక్షల వరకు పోగొట్టుకున్నారని తెలిసింది. గుజరాత్, కర్ణాటకలో ఈ స్కామ్ ఎక్కువగా జరిగినట్లు అధికారులు గుర్తించారు.


దీని బారిన పడకుండా ఉండటం ఎలా?

వినయోగదారులందరూ తమ వాట్సాప్‌లో వచ్చే ఇలాంటి సందేశాల పట్ల.. ముఖ్యంగా లింక్‌తో కూడి ఉన్న మెసేజ్‌ల పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలి. వాటి జోలికి వెళ్లకుండా నివారించాలి. APK యాప్‌లను ఇన్‌స్టాల్ చేసుకోవద్దు. గూగుల్ ప్లే స్టోర్ వంటి విశ్వసనీయ మూలాల నుంచే యాప్‌లను ఇన్‌స్టాల్ చేసుకోవాలి. అలాగే.. ఫోన్ సెట్టింగ్స్‌లో యాప్ పర్మిషన్లను పరిమితంగా ఉంచుకోవడం మంచిది. ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలి. బ్యాంకింగ్, ఇతర సున్నితమైన సేవల యాప్‌ల విషయంలో అలర్ట్ అలారం పెట్టుకోవడం ఉత్తమం.

Read Latest Viral News and Telugu News

Updated Date - Jul 17 , 2024 | 03:28 PM