Share News

BCCI: బిగ్ ట్విస్ట్ ఇచ్చిన బీసీసీఐ.. రంగంలోకి మరో ఇద్దరు మాజీ స్టార్స్

ABN , Publish Date - Jul 11 , 2024 | 04:35 PM

టీమిండియా మేనేజ్‌మెంట్ విషయంలో బీసీసీఐ కొత్త మార్పులు చేపట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే రాహుల్ ద్రవిడ్ పదవీకాలం పూర్తవ్వడంతో.. ప్రధాన కోచ్‌గా ఆయన స్థానంలో గౌతమ్ గంభీర్‌ని...

BCCI: బిగ్ ట్విస్ట్ ఇచ్చిన బీసీసీఐ.. రంగంలోకి మరో ఇద్దరు మాజీ స్టార్స్
BCCI

టీమిండియా మేనేజ్‌మెంట్ విషయంలో బీసీసీఐ (BCCI) కొత్త మార్పులు చేపట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) పదవీకాలం పూర్తవ్వడంతో.. ప్రధాన కోచ్‌గా ఆయన స్థానంలో గౌతమ్ గంభీర్‌ని (Gautam Gambhir) నియమించింది. ఇప్పుడు బౌలింగ్ కోచ్‌ను నియమించేందుకు కసరత్తులు చేస్తోంది. ఆ పదవి కోసం వినయ్ కుమార్‌ని (Vinay Kumar) తీసుకోనున్నట్టు రీసెంట్‌గా ప్రచారం జరిగింది కానీ.. అందులో ఏమాత్రం వాస్తవం లేదని తేలింది. బౌలింగ్ కోచ్ కోసం మాజీ సీమర్స్ జహీర్ ఖాన్ (Zaheer Khan), లక్ష్మిపతి బాలాజీలను (Lakshmipati Balaji) పరిశీలిస్తున్నారని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. వినయ్‌పై ఆసక్తి చూపట్లేదని, ఆ ఇద్దరిలోనే ఎవరో ఒకరు ఆ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని స్పష్టం చేశాయి.


కాగా.. క్రికెట్ ప్రపంచంలోని ‘బెస్ట్ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ల’లో ఒకడిగా జహీర్ ఖాన్ ఒకప్పుడు కీర్తి గడించాడు. తన అద్భుత బౌలింగ్‌తో.. ఎన్నోసార్లు భారత జట్టును గెలిపించిన దాఖలాలూ ఉన్నాయి. జహీర్ బౌలింగ్ వేస్తున్నాడంటే.. ప్రత్యర్థి బ్యాటర్లలో వణుకు పుట్టేది. భారత్ సాధించిన వన్డే వరల్డ్‌కప్-2011లో అతని పాత్ర మరువలేనిది. తన 10 ఓవర్ల కోటాలో 3 మెయిడెన్ ఓవర్లు వేసిన అతను.. 60 పరుగులు ఇచ్చి, 2 కీలకమైన వికెట్లు పడగొట్టాడు. కేవలం టెస్టుల విషయానికొస్తే.. 92 మ్యాచ్‌ల్లో 311 వికెట్లు తీశాడు. అన్ని ఫార్మాట్లలో కలుపుకుంటే.. 309 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో 610 వికెట్లు తీశాడు. ఇక లక్ష్మిపతి బాలాజీ విషయానికొస్తే.. 8 టెస్టు మ్యాచ్‌ల్లో 27 వికెట్లు, 30 వన్డేల్లో 34 వికెట్లు పడగొట్టాడు. ఈ ఇద్దరి గణాంకాల దృష్ట్యా.. బౌలింగ్ కోచ్‌గా జహీర్ ఖాన్ ఎంపికయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.


ఇదిలావుండగా.. రాహుల్ ద్రవిడ్ పదవీకాలం పూర్తైన వెంటనే గౌతమ్ గంభీర్‌ని కొత్త హెడ్ కోచ్‌గా బీసీసీఐ ప్రకటించిన విషయం తెలిసిందే. డబ్ల్యూవీ రామన్ నుంచి గట్టి పోటీ ఎదురైనప్పటికీ.. ఫైనల్‌గా గంభీర్‌నే కోచ్‌గా నియమించారు. జట్టుపై ఉన్న అవగాహన, భవిష్యత్తు కార్యాచరణ, అతని ఆలోచనలతో బీసీసీఐ ఇంప్రెస్ అయ్యి.. రెండేళ్ల పాటు టీమిండియా ప్రధాన కోచ్‌గా ఎంపిక చేశారు. ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి జై షా ఎక్స్ వేదికగా అధికారికంగా ప్రకటించారు. గంభీర్‌పై తనకు పూర్తి విశ్వాసం ఉందని, బీసీసీఐ అతనికి అన్ని విధాలుగా సహకారం అందిస్తుందని చెప్పారు. భారత క్రికెట్‌ను ముందుకు నడిపించడానికి అతడే అనువైన వ్యక్తి అని పేర్కొన్నారు.

Read Latest Sports News and Telugu News

Updated Date - Jul 11 , 2024 | 04:35 PM