Share News

India vs Sri Lanka: శ్రీలంకతో వన్డే సిరీస్‌.. కెప్టెన్ రేసులో ఆ ఇద్దరి మధ్య పోటీ?

ABN , Publish Date - Jul 17 , 2024 | 06:03 PM

టీ20 వరల్డ్‌కప్‌తో పాటు జింబాబ్వే టీ20 సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత జట్టు.. శ్రీలంక టూర్‌కు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఆతిథ్య జట్టుతో టీమిండియా మూడు మ్యాచ్‌లు చొప్పున..

India vs Sri Lanka: శ్రీలంకతో వన్డే సిరీస్‌.. కెప్టెన్ రేసులో ఆ ఇద్దరి మధ్య పోటీ?
India's Sri Lanka Tour

టీ20 వరల్డ్‌కప్‌తో పాటు జింబాబ్వే టీ20 సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత జట్టు.. శ్రీలంక టూర్‌కు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఆతిథ్య జట్టుతో టీమిండియా మూడు మ్యాచ్‌లు చొప్పున టీ20, వన్డే సిరీస్‌లు ఆడనుంది. జులై 27వ తేదీ నుంచి టీ20 సిరీస్ ప్రారంభం కానుండగా.. ఆగస్టు 2వ తేదీ నుంచి వన్డే సిరీస్ జరగనుంది. అయితే.. రోహిత్ శర్మ (Rohit Sharma) టీ20కి వీడ్కోలు పలకడం, ఇతర సీనియర్ ఆటగాళ్లు విరామం తీసుకోవడంతో.. ఆ రెండు సిరీస్‌లకు గాను కొత్త కెప్టెన్‌లను నియమించే పనిలో బీసీసీఐ నిమగ్నమైంది.


నిజానికి.. టీ20 వరల్డ్‌కప్‌లో హార్దిక్ పాండ్యా (Hardik Pandya) వైస్ కెప్టెన్‌గా వ్యవహరించాడు కాబట్టి.. అతనికే టీ20 సిరీస్‌కు నాయకత్వ పగ్గాలు అప్పగిస్తారని అంతా అనుకున్నారు. కానీ.. బీసీసీఐ అనూహ్యంగా సూర్యకుమార్ యాదవ్‌ని (Suryakumar Yadav) ఎంపిక చేసింది. పాండ్యా ఫిట్‌నెస్ సమస్యలతో పాటు దీర్ఘకాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని.. శ్రీలంక సిరీస్‌తో పాటు 2026లో జరగబోయే టీ20 వరల్డ్‌కప్ వరకు సూర్యకే పగ్గాలు అప్పగించాలని మేనేజ్‌మెంట్ చూస్తోంది. టీ20లకు సరే.. మరి వన్డే సిరీస్ పరిస్థితి ఏంటి? అనేది అగమ్యగోచరంగా మారింది. రోహిత్‌తో పాటు వ్యక్తిగత కారణాల వల్ల హార్దిక్ కూడా విరామం తీసుకున్నాడు కాబట్టి, వన్డే సిరీస్‌కు ఎవరు కెప్టెన్‌గా ఉండనున్నారన్నది మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది.


ఈ నేపథ్యంలోనే.. ఇద్దరు ఆటగాళ్ల పేర్లు తెరమీదకి వచ్చాయి. వాళ్లే.. కేఎల్ రాహుల్ (KL Rahul), శుభ్‌మన్ గిల్ (Shubman Gill). ఈ ఇద్దరిలోనే ఎవరో ఒకరికి కెప్టెన్సీ పగ్గాలు అప్పగించే అవకాశం ఉందని తెలుస్తోంది. ముఖ్యంగా.. ఎల్ రాహుల్ ఫస్ట్ ఛాయిస్‌గా కనిపిస్తున్నాడు. జట్టులో సీనియర్ ఆటగాడు కావడంతో పాటు గతంలో సౌతాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌కు నాయకత్వం వహించిన అనుభవం ఉంది. మరోవైపు.. జింబాబ్వేతో జరిగిన టీ20 సిరీస్‌లో శుభ్‌మన్ గిల్ సమర్థవంతంగా నాయకత్వ బాధ్యతలు నిర్వర్తించాడు కాబట్టి.. అతను కూడా ఈ రేసులో ఉన్నాడు. అయితే.. సెలెక్టర్లు మాత్రం కేఎల్ రాహుల్‌వైపు ఎక్కువ మొగ్గు చూపే ఛాన్స్ ఉంది. మరి.. వాళ్లు ఎవరిని కెప్టెన్‌గా నియమిస్తారన్నది సస్పెన్స్‌గా మారింది.


ఇదే సమయంలో.. ఈ వన్డే సిరీస్‌కు రోహిత్ శర్మ అందుబాటులో ఉండే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. తొలుత అతను విరామం కావాలని రిక్వెస్ చేసినా.. ఇప్పుడు తిరిగొచ్చే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం అందుతోంది. అదే జరిగితే మాత్రం.. అతనికే నాయకత్వ పగ్గాలు అప్పగిస్తారనడంలో సందేహమే లేదు. ఒకవేళ రోహిత్ అందుబాటులో లేకపోతేనే.. కెప్టెన్సీ అంశం కాస్త సవాల్‌గా మారొచ్చు.

Read Latest Sports News and Telugu News

Updated Date - Jul 17 , 2024 | 06:03 PM