Share News

Cricket: లేడీ ధోని.. సిక్సర్‌తో టీమ్‌ను ఛాంపియన్‌‌గా మార్చిన దీప్తి..

ABN , Publish Date - Aug 19 , 2024 | 09:32 AM

క్రికెట్‌లో కొన్ని షాట్లను కొంతమంది మాత్రమే ఆడగలరు. ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్.. ఇటీవల కాలంలో ధోని, కోహ్లీ, రోహిత్ శర్మల గురించి అందరికీ తెలుసు.. ఈ ముగ్గురిది ఎవరి స్టైల్ వారిదే. కానీ ప్రస్తుతం భారత మహిళా క్రికెటర్ దీప్తిశర్మ వార్తల్లో నిలిచింది

Cricket: లేడీ ధోని.. సిక్సర్‌తో టీమ్‌ను ఛాంపియన్‌‌గా మార్చిన దీప్తి..
Deepti Sharma

క్రికెట్‌లో కొన్ని షాట్లను కొంతమంది మాత్రమే ఆడగలరు. ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్.. ఇటీవల కాలంలో ధోని, కోహ్లీ, రోహిత్ శర్మల గురించి అందరికీ తెలుసు.. ఈ ముగ్గురిది ఎవరి స్టైల్ వారిదే. కానీ ప్రస్తుతం భారత మహిళా క్రికెటర్ దీప్తిశర్మ వార్తల్లో నిలిచింది. ఓ క్రికెట్ లీగ్‌లో చివరి ఓవర్‌లో సిక్స్ కొట్టి టీమ్‌ను ఛాంపియన్‌గా నిలపడంతో ఆమె సిక్సర్‌ ప్రస్తుతం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇంగ్లాండ్ మహిళల ది హండ్రెడ్ క్రికెట్ లీగ్‌లో వేల్స్ ఫైర్, లండన్ స్పిరిట్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ఫలితం చివరి ఓవర్‌ వరకు సాగింది. లండన్ స్పిరిట్ నాలుగు వికెట్ల తేడాతో గెలిచి టైటిల్ సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో లండన్ స్పిరిట్ విజయంలో భారత మహిళల జట్టు స్టార్ ప్లేయర్ దీప్తి శర్మ కీలక పాత్ర పోషించింది. బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లో సత్తా చాటింది. చివరి ఓవర్‌లో సిక్స్ కొట్టి 2011 ప్రపంచకప్‌ ఫైనల్‌లో ధోనిమ కొట్టిన సిక్స్‌ను గుర్తుచేసింది.


ధోని స్టైల్‌లో..

వేల్స్ ఫైర్, లండన్ స్పిరిట్ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ చివరి ఓవర్ వరకు కొనసాగింది. టైటిల్ గెలవడానికి లండన్ స్పిరిట్ చివరి 3 బంతుల్లో 4 పరుగులు చేయాల్సి ఉండగా.. అప్పటికే 6 వికెట్లను కోల్పోయింది. హేలీ మాథ్యూస్ బౌలింగ్ చేస్తుండగా.. దీప్తి శర్మ బ్యాటింగ్ చేస్తోంది. హేలీ మాథ్యూస్‌ వేసిన 20వ ఓవర్ మూడో బంతికి లాంగ్-ఆన్‌లో సిక్సర్ కొట్టిన దీప్తి శర్మ తన జట్టును ఛాంపియన్‌గా నిలిపారు. ఆ సిక్స్ కొట్టకపోయి ఉంటే ఫలితం వేరేలా ఉండి ఉండవచ్చు. దీప్తి శర్మ కొట్టిన ఈ సిక్స్ 2011 ప్రపంచకప్ ఫైనల్‌లో ఎంఎస్ ధోని కొట్టిన సిక్సర్ జ్ఞాపకాలను గుర్తుచేసిందంటున్నారు క్రికెట్ అభిమానులు. ఈ మ్యాచ్‌లో దీప్తి శర్మ 16 బంతుల్లో 16 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది. అంతకుముందు దీప్తిశర్మ పొదుపుగా బౌలింగ్ చేసింది. 20 బంతుల్లో 23 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీసింది. సెమీ-ఫైనల్ మ్యాచ్‌లో కూడా దీప్తి మంచి ప్రదర్శన కనబరిచింంది.


తొలిసారి..

ఈ మ్యాచ్‌లో లండన్‌ స్పిరిట్‌ టాస్‌ గెలిచి ముందుగా బౌలింగ్‌ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన వేల్స్ ఫైర్ జట్టు పెద్ద స్కోరు చేయలేకపోయింది. 100 బంతుల్లో 115 పరుగులు చేసింది. 116 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన లండన్ స్పిరిట్ 98 బంతుల్లోనే ఈ లక్ష్యాన్ని సాధించింది. లండన్ స్పిరిట్ తరఫున ఓపెనర్ జార్జియా రెడ్‌మైన్ 32 బంతుల్లో 34 పరుగులు చేశారు. లండన్ స్పిరిట్ జట్టు తొలిసారి మహిళల ది హండ్రెడ్ లీగ్ టైటిల్‌ను గెలుచుకుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read More Sports News and Latest Telugu News

Updated Date - Aug 19 , 2024 | 10:47 AM