Share News

Eleti Maheshwar Reddy: బోగస్‌ గ్యారంటీలతో భారీ కాంట్రాక్టులు..

ABN , Publish Date - Jul 23 , 2024 | 04:42 AM

రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డికి సంబంధించిన రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌ సంస్థ మోసపూరిత బ్యాంకు గ్యారంటీలతో వందల కోట్ల రూపాయల కాంట్రాక్టు పనులు దక్కించుకుందని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి సంచలన ఆరోపణ చేశారు.

Eleti Maheshwar Reddy: బోగస్‌ గ్యారంటీలతో భారీ కాంట్రాక్టులు..

  • రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌కు రూ.కోట్లలో పనులు

  • మంత్రి పొంగులేటిపై బీజేఎల్పీ నేత మహేశ్వర్‌ రెడ్డి సంచలన ఆరోపణలు

  • విదేశీ ఫైనాన్స్‌ సంస్థ విశ్వసనీయతపై ఎస్‌బీఐ, యూబీఐ లేఖలపై అనుమానం

హైదరాబాద్‌, జూలై 22 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డికి సంబంధించిన రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌ సంస్థ మోసపూరిత బ్యాంకు గ్యారంటీలతో వందల కోట్ల రూపాయల కాంట్రాక్టు పనులు దక్కించుకుందని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి సంచలన ఆరోపణ చేశారు. ఒక విదేశీ ఫైనాన్సు కంపెనీ ఇచ్చిన గ్యారంటీతో దేశవ్యాప్తంగా 400 కాంట్రాక్టు సంస్థలు పనులు చేస్తున్నాయని పేర్కొంటూ, ఇది అతిపెద్ద కుంభకోణమని, తీవ్రమైన ఆర్థిక నేరమని పేర్కొన్నారు. ఈ కుంభకోణంలో భాగస్వామిగా ఉన్న పొంగులేటికి క్యాబినెట్‌లో కొనసాగే నైతిక అర్హత లేదన్నారు. సోమవారం మహేశ్వర్‌ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘సెయింట్‌ లూసియా అనే దీవిలో యూరో ఎగ్జిమ్‌ బ్యాంకు లిమిటెడ్‌ ఉంది. దాని మొత్తం విలువ మన దేశ కరెన్సీ ప్రకారం రూ.8 కోట్లు మించదు. అసలు అది బ్యాంకు కూడా కాదు.. ఓ ఫైనాన్సు కంపెనీ. అలాంటి కంపెనీ బ్యాంకు పేరుతో మన రాష్ట్రంలో వేల కోట్ల రూపాయల కాంట్రాక్టు పనులకు గ్యారంటీ లేఖలు ఇచ్చింది. వాటిని ఆమోదిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ఏజెన్సీలు పనులు మంజూరు చేయడం విడ్డూరం.


ఈ వ్యవహారంలో యూరో ఎగ్జిమ్‌ బ్యాంకు లిమిటెడ్‌ విశ్వసనీయమైనదేనని పేర్కొంటూనే దానితో తమకు ఎలాంటి సంబంధం లేదని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్బీఐ), యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(యూబీఐ) ధ్రువీకరణ లేఖలు ఇవ్వడం మరో ట్విస్టు. మన దేశంలో కానీ ఆర్బీఐ పరిధిలో కానీ లేని ఓ ఫైనాన్సు కంపెనీ విశ్వసనీయతను ఈ రెండు ప్రముఖ బ్యాంకులు ధ్రువీకరించడం వెనుక ఏదో మతలబు ఉంది. రూ.8 కోట్ల విలువ కూడా లేని ఓ ఫైనాన్సు కంపెనీ.. రూ.400 కోట్ల పనులకు గ్యారంటీ లేఖలు ఇస్తే దాని విశ్వసనీయతను మన దేశ బ్యాంకులు ఎలా ధ్రువీకరిస్తాయి?’ అని మహేశ్వర్‌రెడ్డి ప్రశ్నించారు. ఆర్బీఐ నిబంధనల ప్రకారం జాతీయ బ్యాంకులు లేదా షెడ్యూల్డ్‌ బ్యాంకుల గ్యారంటీ మాత్రమే చెల్లుబాటు అవుతుందని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై తక్షణం సీబీఐ విచారణకు సీఎం రేవంత్‌ రెడ్డి కోరాలని, ఈ బ్యాంకు ఇచ్చిన గ్యారంటీలను రద్దు చేసి కొత్త బ్యాంకు గ్యారంటీలు తీసుకోవాలని మహేశ్వర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. పంచాయతీ సర్పంచుల బిల్లులు నెలల తరబడి పెండింగ్‌లో ఉంచుతూ మంత్రికి సంబంధించిన కంపెనీకి మాత్రం వేల కోట్ల రూపాయల బిల్లులు రాత్రికి రాత్రే మంజూరు అవుతున్నాయన్నారు.

Updated Date - Jul 23 , 2024 | 04:42 AM