Share News

Bandi Sanjay : కాంగ్రెస్‌కు రజాకార్లపై ప్రేమ

ABN , Publish Date - Sep 18 , 2024 | 04:16 AM

కాంగ్రెస్‌ పార్టీకి సర్దార్‌ పటేల్‌ కంటే రజాకార్లపైనే ప్రేమ ఎక్కువ అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ ఆరోపించారు. దేశ విచ్ఛిన్నం కోసం ప్రయత్నించిన వారసుల పార్టీతో అంటకాగుతున్న కాంగ్రె్‌సకు పటేల్‌ గురించి మాట్లాడే హక్కు లేదన్నారు.

 Bandi Sanjay : కాంగ్రెస్‌కు రజాకార్లపై ప్రేమ

  • సర్దార్‌ పటేల్‌ గురించి రాహుల్‌, ప్రియాంక మాట్లాడరెందుకు?

  • నెహ్రూ విధానాలను అమలు చేస్తే దేశం పది ముక్కలవుతుంది

  • ఎంఐఎం మెప్పు కోసమే కాంగ్రెస్‌ ప్రజాపాలన దినోత్సవం

  • బీఆర్‌ఎస్‌ సమైక్యతా దినోత్సవానికీ స్పష్టత లేదు: బండి సంజయ్‌

హైదరాబాద్‌, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ పార్టీకి సర్దార్‌ పటేల్‌ కంటే రజాకార్లపైనే ప్రేమ ఎక్కువ అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ ఆరోపించారు. దేశ విచ్ఛిన్నం కోసం ప్రయత్నించిన వారసుల పార్టీతో అంటకాగుతున్న కాంగ్రె్‌సకు పటేల్‌ గురించి మాట్లాడే హక్కు లేదన్నారు. దేశాన్ని మూడు ముక్కలు చేసిన నెహ్రూ విధానాలే కాంగ్రె్‌సకు నచ్చుతాయన్నారు. ఆయన విధానాలను ఇప్పుడు అమలు చేస్తే.. దేశం పది ముక్కలయ్యేదని తీవ్రంగా విమర్శించారు. నిజాం మెడలు వంచి హైదరాబాద్‌ సంస్థానానికి సర్దార్‌ పటేల్‌ విముక్తి కలిగిస్తే.. ఆయన గురించి కాంగ్రెస్‌ ఒక్కరోజైనా ప్రస్తుతించిందా? అని ప్రశ్నించారు. పటేల్‌ గురించి రాహుల్‌, ప్రియాంక ఎందుకు మాట్లాడటంలేదని నిలదీశారు. ప్రధాని మోదీ ప్రభుత్వం వంద రోజులు పూర్తిచేసుకున్న సందర్భంగా మంగళవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో, అంతకుముందు పరేడ్‌ గ్రౌండ్‌లో జరిగిన తెలంగాణ విమోచన వేడుకల్లో సంజయ్‌ మాట్లాడారు.

‘‘రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న ప్రజాపాలన దినోత్సవమంటే ఏంటి? ఉమ్మడి రాష్ట్రంలో 50 ఏళ్లపాటు కొనసాగిన కాంగ్రెస్‌ పాలన ప్రజా వంచక పాలనా?’’ అని సంజయ్‌ ప్రశ్నించారు. ఎంఐఎం మెప్పు కోసమే కాంగ్రెస్‌ ప్రజాపాలన దినోత్సవం నిర్వహిస్తోందని ఆరోపించారు. హామీలు నెరవేర్చకుండా ఆరు గ్యారెంటీలను అటకెక్కించి ప్రజలను ఏమార్చడమే ప్రజా పాలన దినోత్సవానికి గీటురాయి అనుకోవాలా? అని నిలదీశారు. ప్రభుత్వం ఒక్క గ్యారంటీని కూడా పూర్తిగా అమలు చేయలేకపోతోందని, రుణమాఫీ పేరిట అబద్దాలు ప్రచారం చేసుకుంటోందని ధ్వజమెత్తారు. బీఆర్‌ఎస్‌ నిర్వహించే సమైక్యతా దినోత్సవానికి కూడా స్పష్టత లేదని విమర్శించారు. అందరూ సమైక్యంగా ఉండి తెలంగాణ సాధించుకున్నప్పుడు.. సమైక్యతా దినోత్సవం ఎందుకన్నారు.


  • రజాకార్ల అకృత్యాలు తలుచుకుంటే రక్తం మరుగుతుంది..

నిజాం నిరంకుశ పాలనలో రజాకార్లు చేసిన అకృత్యాలను తలుచుకుంటే ఇప్పటికీ తన రక్తం మరుగుతుందని బండి సంజయ్‌ అన్నారు. ఆనాడు సర్దార్‌ పటేల్‌ లేకపోతే తెలంగాణకు అంత తొందరగా విముక్తి లభించేది కాదన్నారు. కానీ, ఓటుబ్యాంకు రాజకీయాల కోసం ఏ ప్రభుత్వమూ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించలేదని మండిపడ్డారు. ఇది.. నాటి సమరయోధుల త్యాగాలను, బలిదానాలను అవమానించడమేనన్నారు. తెలంగాణ ప్రజలంతా రజకార్లను తరిమికొడితే.. నేడు కొన్ని పార్టీలు ఆ రజాకార్ల వారసుల మెప్పు పొందేందుకు చరిత్రను తెరమరుగు చేస్తున్నారని ఆరోపించారు. అయితే.. ముస్లింలంతా రజాకార్లు కాదని, షేక్‌ బందగీ, షోయబుల్లాఖాన్‌ వంటివారు ఎందరో నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడారని పేర్కొన్నారు. నరేంద్రమోదీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుని అమలు చేసిందని సంజయ్‌ అన్నారు. మరి కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలల్లో ఆరు గ్యారంటీలను కూడా ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు.

Updated Date - Sep 18 , 2024 | 04:17 AM