Share News

Bandi Sanjay Kumar: మదర్సాలతో దేశ భద్రతకు ముప్పు..

ABN , Publish Date - Sep 19 , 2024 | 04:37 AM

ఉగ్రవాదానికి బీజం వేస్తున్న మదర్సాలు దేశ భద్రతకు ముప్పు అని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్‌ అన్నారు.

Bandi Sanjay Kumar: మదర్సాలతో దేశ భద్రతకు ముప్పు..

  • శిశుమందిరాలకు నిధులెందుకు ఇవ్వడం లేదు?

  • రాష్ట్ర ప్రభుత్వాలపై కేంద్ర మంత్రి బండి ధ్వజం

  • రవ్వంతరెడ్డి, ట్విట్టర్‌ టిల్లులతో ప్రమాదం

  • రేవంత్‌, కేటీఆర్‌పై రఘునందన్‌రావు వ్యాఖ్యలు

జమ్మికుంట, మిల్స్‌కాలనీ (వరంగల్‌), సెప్టెంబరు 18: ఉగ్రవాదానికి బీజం వేస్తున్న మదర్సాలు దేశ భద్రతకు ముప్పు అని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్‌ అన్నారు. బుధవారం కరీంనగర్‌ జిల్లా జమ్మికుంటలో బాలికల వసతి గృహ భవనాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ చీపురుపుల్లతో కూడా ఏకే-47లు తయారు చేసేంతటి శిక్షణ ఇస్తూ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న మదర్సాలకు రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు ఎందుకు ఇస్తున్నాయని ప్రశ్నించారు.


భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయాలను పెంపొందిస్తూ విద్యను అందిస్తున్న శిశుమందిర్‌ విద్యాలయాలకు నిధులెందుకు ఇవ్వడం లేదని నిలదీశారు. రాష్ట్రంలోని పాఠశాలల్లో వేలాది టీచర్‌ పోస్టులు, 20వేలకు పైగా పారిశుధ్య కార్మికుల పోస్టులు ఖాళీగా ఉన్నా భర్తీ చేయడం లేదన్నారు. ఆ శాఖకు మంత్రి కూడా లేకపోవడం బాధాకరమని అన్నారు. తాను కూడా శిశుమందిర్‌ విద్యార్ధినే అని, తనతో పాటు తన అన్నయ్యలు, అక్కయ్య కూడా శిశుమందిర్‌లోనే చదువుకున్నారని గుర్తుచేశారు. శిశుమందిరాల్లో చదువుకున్న వాళ్లు ఏ రంగంలో ఉన్నా కూడా జాతీయవాద భావజాలంతో పనిచేస్తున్నారని చెప్పారు.


కాంగ్రెస్‌ పార్టీ మళ్లింపు రాజకీయాలకు పాల్పడుతోందని బీజేపీ మెదక్‌ ఎంపీ ఎం.రఘునందన్‌రావు విమర్శించారు. రవ్వంతరెడ్డి, ట్విట్టర్‌ టిల్లుతో రాష్ట్రానికి ప్రమాదమంటూ రేవంత్‌రెడ్డి, కేటీఆర్‌లను ఎద్దేవా చేసిన రఘునందన్‌.. వారిద్దరూ రోజూ సాయంత్రం మాట్లాడుకుంటున్నారని ఆరోపించారు. లేకపోతే జన్వాడ ఫాంహౌస్‌ ఎందుకు కూల్చడం లేదో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. బుధవారం వరంగల్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రాహుల్‌ గాంధీ అవివేకంగా మాట్లాడుతున్నారని, దేశంలో రక్షణ లేదంటున్న రాహుల్‌, ఆయన చెల్లెలు ఎలా తిరుగుతున్నారని ప్రశ్నించారు.

Updated Date - Sep 19 , 2024 | 04:37 AM