Share News

Bandi Sanjay: ఇన్నాళ్లకు నేతన్నలు గుర్తొచ్చారా?

ABN , Publish Date - Jul 12 , 2024 | 04:08 AM

‘ఇన్నాళ్లకు సిరిసిల్ల చేనేత కార్మికులు గుర్తుకొచ్చారా..? పదేళ్లు అధికారంలో కొనసాగిన మీరు ఎందుకు నేతన్నల సమస్యలు పరిష్కరించలేదు..? మీ హయాం నుంచి చేనేత కార్మికుల ఆకలి చావులు కొనసాగుతున్నది నిజం కాదా..?’’

Bandi Sanjay: ఇన్నాళ్లకు నేతన్నలు గుర్తొచ్చారా?

  • పదేళ్లు అధికారంలో ఉండి ఏం చేశారు

  • సిరిసిల్లలో ఆత్మహత్యలను ఆపలేదేం?

  • పవర్‌లూంలు మూతపడేలా చేసింది మీరు

  • కాదా.. కేటీఆర్‌కు బండి సంజయ్‌ కౌంటర్‌

  • టీటీడీ వీరప్పన్‌ వారసుల చేతిలో ఉండేది

  • ఎర్రచందనం దొంగలను వదిలేది లేదు

  • తిరుమలలో మీడియాతో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి

హైదరాబాద్‌/సిరిసిల్ల, జులై 11 (ఆంధ్రజ్యోతి): ‘‘ఇన్నాళ్లకు సిరిసిల్ల చేనేత కార్మికులు గుర్తుకొచ్చారా..? పదేళ్లు అధికారంలో కొనసాగిన మీరు ఎందుకు నేతన్నల సమస్యలు పరిష్కరించలేదు..? మీ హయాం నుంచి చేనేత కార్మికుల ఆకలి చావులు కొనసాగుతున్నది నిజం కాదా..?’’ అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌.. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ను నిలదీశారు. ఈ మేరకు గురువారం కేటీఆర్‌ రాసిన బహిరంగ లేఖకు సంజయ్‌ కౌంటర్‌ ఇచ్చారు. ‘‘రాష్ట్రంలో పదేళ్లు మీరే అధికారంలో ఉన్నారు. మీరే డిఫ్యాక్టో సీఎంగా వ్యవహరించారు. 15 ఏళ్లుగా సిరిసిల్లలో మీరే ప్రాతినిధ్యం వహిస్తున్నా.. అక్కడ నేతన్నల ఆకలిచావులు కొనసాగుతూనే ఉన్నాయి.


వారి సంక్షేమం కోసం మీరు చేసిందేమిటి..? బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇచ్చి బకాయిలు కూడా చెల్లించకుండా పవర్‌ లూం సంస్థలు మూతపడేలా చేసింది మీరు కాదా..? రాష్ట్రంలోని చేనేత కార్మికుల కోసం ప్రధాని మోదీ వరంగల్‌లో కాకతీయ మెగా టెక్స్‌ టైల్‌ పార్క్‌ను మీ హయాంలోనే ఏర్పాటు చేసిన సంగతి మరచిపోయారా..? రాష్ట్ర పాలకుల వైఫల్యం వల్లే నేడు నేతన్నలు సంక్షోభంలో ఉన్నారని ఒప్పుకున్నందుకు సంతోషం. సిరిసిల్ల నేతన్నలు సంక్షోభం నుండి గట్టెక్కేందుకు నా శాయశక్తులా ప్రయత్నిస్తున్నా’’ అని సంజయ్‌.. కేటీఆర్‌కు రాసిన లేఖలో స్పష్టం చేశారు.


టీటీడీ వీరప్పన్‌ వారసుల చేతిలో ఉండేది

తిరుమల: టీటీడీ గతంలో వీరప్పన్‌ వారసుల చేతిలో ఉందని, ఇకపై ఎర్రచందనం దొంగలను వదిలే ప్రసక్తి లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ హెచ్చరించారు. కుటుంబ సభ్యులతో కలిసి గురువారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన ఆలయం ముందు మీడియాతో మాట్లాడారు. గత పాలకులు అక్రమ దందాలతో శ్రీవారి ఆస్తిని కొల్లగొట్టే ప్రయత్నం చేశారని అన్నారు. కాగా, సంజయ్‌ జన్మదినం సందర్భంగా గురువారం ప్రధాని మోదీ, సీఎం రేవంత్‌ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. సంజయ్‌ నివాసానికి రేవంత్‌ పుష్పగుచ్ఛం, గ్రీటింగ్స్‌ పంపించారు. ఉప రాష్ట్రపతి జగ్‌దీప్‌ ధన్‌కర్‌, కేంద్ర మంత్రి అమిత్‌షా ఫోన్‌ చేసి సంజయ్‌కి శుభాకాంక్షలు తెలిపారు.

Updated Date - Jul 12 , 2024 | 04:08 AM