Share News

Bhatti Vikramarka: పేదోళ్లను అడ్డుపెట్టి బిల్డర్ల వ్యాపారం

ABN , Publish Date - Sep 30 , 2024 | 03:16 AM

‘‘హైదరాబాద్‌లో చెరువులు, నదీ గర్భాల్లో కూడా ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నారు. వీటిని ఇప్పటికైనా ఆపకపోతే భవిష్యత్తు తరాలకు పెద్ద ప్రమాదం వాటిల్లుతుంది.

Bhatti Vikramarka: పేదోళ్లను అడ్డుపెట్టి బిల్డర్ల వ్యాపారం

  • నదీ గర్భంలోనూ ఇళ్ల నిర్మాణాలు చేస్తున్నారు

  • వీటిని ఆపకుంటే భవిష్యత్తు తరాలకు ప్రమాదం

  • తెలుగు రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టండి

  • అమెరికాలో తెలుగు కమ్యూనిటీ మీట్‌ అండ్‌ గ్రీట్‌లో డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క

హైదరాబాద్‌, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి): ‘‘హైదరాబాద్‌లో చెరువులు, నదీ గర్భాల్లో కూడా ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నారు. వీటిని ఇప్పటికైనా ఆపకపోతే భవిష్యత్తు తరాలకు పెద్ద ప్రమాదం వాటిల్లుతుంది. ఇది హైదరాబాద్‌కు ప్రాణాంతకంగా మారుతుంది. పేదోళ్లను అడ్డం పెట్టి బిల్డర్లు వ్యాపారం చేస్తున్నారు’’ అని డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క ఆరోపించారు. అమెరికా పర్యటనలో ఉన్న భట్టివిక్రమార్క.. సదరన్‌ కాలిఫోర్నియా తెలుగు కమ్యూనిటీ, స్థానిక కాన్సుల్‌ జనరల్‌ సంయుక్తంగా ఏర్పాటు చేసిన మీట్‌ అండ్‌ గ్రిట్‌ కార్యక్రమంలో మాట్లాడారు. ‘‘హైదరాబాద్‌ అంటేనే గుట్టలు, చెరువులు, పార్కులు..! ఇళ్ల నిర్మాణం పేరిట గుట్టలు కనుమరుగైపోయాయి. చెరువులను కబ్జా చేసి ఇళ్లు కట్టారు. పార్కులనూ లేకుండా చేస్తున్నారు.


చెరువులే లేకుంటే.. ఇటీవల వరదలకు విజయవాడ నగరం చిక్కుకుపోయిన పరిస్థితే హైదరాబాద్‌కూ ఏర్పడుతుంది’’ అని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల ధన, మాన, ప్రాణ, ఆస్తులను కాపాడడం ప్రభుత్వం బాధ్యతని, అందులో భాగంగానే చెరువులను రక్షించి భవిష్యత్తు తరాలకు అదించే కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం చేపట్టిందని వెల్లడించారు. మూసీ నదిలో మంచి నీరు పారించడం, నగరంలో పార్కులు తయారు చేయడం వంటివి చేయాలన్నది తమ ఆలోచనన్నారు. మూసీ నది పునరుజ్జీవంలో భాగంగా నిర్వాసితులకు పూర్తి అవగాహన కల్పించి.. పునరావాస చర్యలు చేపడుతున్నామ న్నారు.


నిర్వాసితులకు డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు, వారి పిల్లలు చదువుకునేందుకు అవకాశం కల్పించడం, వారి ఆరోగ్యానికి సంబంధించిన జాగ్రత్తలు చేపట్టడం.. వారంతా మంచి వాతావరణంలో బతికేలా చూడడమే ప్రభుత్వ ఉద్దేశమని పేర్కొన్నారు. కలుషితమైన మూసీ నది పక్కన జీవించడం ఎవరికి కూడా మంచిది కాదన్నారు. కాగా.. తెలంగాణలోని వనరులను గుర్తించి పద్ధతి ప్రకారం వినియోగిస్తామని, విద్య, వైద్యం, సేవా రంగాలను తీర్చిదిద్దుతామని, రాష్ట్ర సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని తెలిపారు.


గతంలో ఫ్యూడల్‌ మనస్తత్వంతో బందీ చేయబడిన రాష్ట్రాన్ని పూర్తి స్వేచ్ఛాయుత రాష్ట్రంగా మార్చామని, భవిష్యత్తులో ఈ విధానం కొనసాగుతుందన్నారు. ఎవరు ఏ భావజాలాన్నయినా వ్యక్తపరిచే వాతావరణాన్ని ఏర్పరిచామని వివరించారు. అమెరికాలో స్థిరపడిన తెలుగు వారి మేధస్సు తెలుగు రాష్ట్రాల అభివృద్థికి ఉపయోగపడాలని, పెట్టుబడులు పెట్టి అభివృద్ధిని పరుగులు పెట్టించాలని ప్రవాసీలను కోరారు. గతంలో ఫ్యూడల్‌ మనస్తత్వంతో బందీ చేయబడిన రాష్ట్రాన్ని పూర్తి స్వేచ్ఛాయుత రాష్ట్రంగా మార్చామని, భవిష్యత్తులో ఈ విధానం కొనసాగుతుందన్నారు. ఎవరు ఏ భావజాలాన్నయినా వ్యక్తపరిచే వాతావరణాన్ని ఏర్పరిచామని వివరించారు. అమెరికాలో స్థిరపడిన తెలుగు వారి మేధస్సు తెలుగు రాష్ట్రాల అభివృద్థికి ఉపయోగపడాలని, పెట్టుబడులు పెట్టి అభివృద్ధిని పరుగులు పెట్టించాలని ప్రవాసీలను కోరారు.

Updated Date - Sep 30 , 2024 | 03:16 AM