Share News

Miryalaguda: నకిలీ పత్తి విత్తనాల విక్రయ ముఠా గుట్టురట్టు

ABN , Publish Date - May 28 , 2024 | 05:33 AM

నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తున్న నలుగురు ముఠా సభ్యులను నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. డీఎస్పీ రాజశేఖర్‌రాజు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ నెల 25న మిర్యాలగూడ పట్టణంలోని ఈదులగూడ చౌరస్తా వద్ద తనిఖీల సందర్భంగా ఆరు సంచుల్లో అక్రమంగా తరలించేందుకు సిద్ధంగా ఉన్న సుమారు రూ.5లక్షల విలువైన 260 కిలోల పత్తి విత్తనాలను పోలీసులు గుర్తించారు.

Miryalaguda: నకిలీ పత్తి విత్తనాల విక్రయ ముఠా గుట్టురట్టు

  • మిర్యాలగూడలో నలుగురి అరెస్టు

  • పరారీలో ప్రధాన నిందితుడు

  • హస్నాబాద్‌లో 9.72 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాల పట్టివేత

మిర్యాలగూడ అర్బన్‌, కొడంగల్‌, మే 27: నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తున్న నలుగురు ముఠా సభ్యులను నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. డీఎస్పీ రాజశేఖర్‌రాజు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ నెల 25న మిర్యాలగూడ పట్టణంలోని ఈదులగూడ చౌరస్తా వద్ద తనిఖీల సందర్భంగా ఆరు సంచుల్లో అక్రమంగా తరలించేందుకు సిద్ధంగా ఉన్న సుమారు రూ.5లక్షల విలువైన 260 కిలోల పత్తి విత్తనాలను పోలీసులు గుర్తించారు. అవి నకిలీవని నిర్ధారణకావడంతో నిందితుల కోసం పోలీసులు రంగంలోకి దిగారు. ఓ నిందితుడు వదిలిపెట్టిన చేతిసంచిలోని ఆధార్‌కార్డు ఆధారంగా పోలీసులు విచారణ మొదలుపెట్టారు. ఈ నెల 25న మిర్యాలగూడ రైల్వేస్టేషన్‌ వద్ద ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లా శావల్యాపురం మండలం శానంపూడికి చెందిన గంఽడవల్ల శ్రీరంగను అదుపులోకి తీసుకుని విచారించడంతో నకిలీ విత్తన విక్రయ ముఠా గుట్టురట్టయింది.


ఈ మేరకు మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం సారంగపల్లికి చెందిన గునుగుంట్ల వీరమణికంఠ అలియాస్‌ అయ్యప్ప, ముండ్రు మల్లికార్జున్‌ అలియాస్‌ అనిల్‌చౌదరి, కోట సాంబశివరావులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరు నకిలీ పత్తి విత్తనాల విక్రయంలో భాగంగా పలువురు వ్యాపారులను కలిసేందుకు సోమవారం వాడపల్లి చెక్‌పోస్టు వద్దకు వచ్చారన్న సమాచారం తెలుసుకుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాము నకిలీ పత్తి విత్తనాలను ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాకు చెందిన పెండ్యాల జగదీశ్వరరావు నుంచి కొని ఇతర ప్రాంతాల్లో విక్రయిస్తున్నట్లు అంగీకరించారని డీఎస్పీ తెలిపారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు జగదీశ్వరరావు పరారీలో ఉండగా, మిగతా నలుగురిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించామన్నారు.


మల్లికార్జున్‌, సాంబశివరావుపై మందమర్రి, తండూరు, భీమిలి, కన్నేపల్లి పీఎస్‌ల్లో నకిలీ విత్తనాల విక్రయ కేసులున్నట్లు డీఎస్పీ తెలిపారు. ఇదిలా ఉండగా.. వికారాబాద్‌ జిల్లా కొడంగల్‌ మండలంలోని హస్నాబాద్‌లో 9.72 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలను పట్టుకున్నట్లు ఎస్సై భరత్‌రెడ్డి తెలిపారు. మండల వ్యవసాయశాఖ అధికారిణి లావణ్య సిబ్బందితో కలిసి బోయిని ఆశప్ప ఇంట్లో తనిఖీ చేయగా నకిలీ పత్తివిత్తనాలు లభ్యమైనట్లు చెప్పారు. కోస్గి మండలం సర్జాఖాన్‌పేటకు చెందిన మునిగారి హన్మయ్య, ఏపీలోని ప్రకాశం జిల్లా ఇడుపులపాడుకు చెందిన వేణు కలిసి హస్నాబాద్‌ పరిసర ప్రాంతాల్లో నకిలీ పత్తి విత్తనాలు విక్రయించేందుకు ఆశప్ప ఇంట్లో గదిని అద్దెకు తీసుకొని నిల్వ ఉంచినట్లు తెలిపారు. కేసు నమోదు చేసినట్లు ఎస్సై చెప్పారు.

Updated Date - May 28 , 2024 | 05:33 AM