Share News

Hyderabad: గూగుల్‌పే/ఫోన్‌పే ద్వారా చెల్లింపులకు చెల్లు..

ABN , Publish Date - Jul 02 , 2024 | 04:00 AM

కరెంటు బిల్లులను ఇకపై గూగుల్‌పే, ఫోన్‌పే, పేటీయం, బిల్‌డె్‌స్కలో చెల్లించడానికి వీల్లేదని డిస్కమ్‌లు తేల్చిచెప్పాయి.

Hyderabad: గూగుల్‌పే/ఫోన్‌పే ద్వారా చెల్లింపులకు చెల్లు..

  • డిస్కమ్‌ల యాప్‌/వెబ్‌సైట్‌లోనే అవకాశం

  • ఆర్‌బీఐ మార్గదర్శకాలతో నిర్ణయం

  • డిస్కమ్‌ల యాప్‌/వెబ్‌సైట్‌లోనే చెల్లించాలి

  • ఆర్‌బీఐ మార్గదర్శకాలతో డిస్కంల నిర్ణయం

హైదరాబాద్‌, జూలై 1 (ఆంధ్రజ్యోతి): కరెంటు బిల్లులను ఇకపై గూగుల్‌పే, ఫోన్‌పే, పేటీయం, బిల్‌డె్‌స్కలో చెల్లించడానికి వీల్లేదని డిస్కమ్‌లు తేల్చిచెప్పాయి. టీజీఎస్పీడీసీఎల్‌, టీజీఎన్పీడీసీఎల్‌ యాప్‌ల ద్వారా.. లేదంటే.. https://tgsouthpower.org, https://tgnpdcl.com లాగిన్‌ అయ్యి మాత్రమే బిల్లులు చెల్లించాలని స్పష్టం చేశాయి. ఆర్బీఐ మార్గదర్శకాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాయి. ఈ మేరకు తాజాగా మార్గదర్శకాలను జారీ చేశాయి. ఈ రెండు డిస్కమ్‌ల పరిధుల్లో 1.84 కోట్ల మంది వినియోగదారులున్నారు. వీరిలో 50శాతానికి పైగా వినియోగదారులు నెలవారీ కరెంటు బిల్లులను గూగుల్‌పే, ఫోన్‌పే, పేటీయం, బిల్‌డెస్క్‌, అమెజాన్‌పే ద్వారా చెల్లిస్తున్నట్లు అధికారులు వివరించారు. నిజానికి ఈ యాప్‌ల ద్వారా ఎవరైనా వినియోగదారుడు ఒక్కసారి కరెంట్‌ బిల్‌ కడితే.. ఆ తర్వాత ప్రతినెల ఆటోమ్యాటిక్‌గా అలెర్ట్‌ రూపంలో నోటిఫికేషన్లు వస్తాయి.


దాంతో.. వినియోగదారులు బిల్లులను చెల్లించేవారు. ఈ యాప్‌లు అందుబాటులోకి వచ్చాక.. ఎలక్ట్రిసిటీ రెవెన్యూ కార్యాలయాల(ఈఆర్వో) వద్ద క్యూలో నిలబడి బిల్లులు చెల్లించే పరిస్థితి దూరమైంది. ఇకపైన వినియోగదారులు ఇబ్బంది పడకుండా.. తమ యాప్‌లు, వెబ్‌సైట్లలో ఆ సేవలను అందజేస్తామని డిస్కమ్‌లు చెబుతున్నాయి. యాప్‌లో వన్‌టైమ్‌ రిజిస్ట్రేషన్‌ ఉంటుందని, వెబ్‌సైట్‌లో ‘పే బిల్‌’ ఆప్షన్‌ను ఎంచుకుని, యూనిక్‌ సర్వీస్‌ నంబర్‌ను ఎంటర్‌ చేసి, బిల్లులను చెల్లించవచ్చని వివరించాయి. ఎస్‌పీడీసీఎల్‌, ఎన్‌పీడీసీఎల్‌ యాప్‌లు ప్రస్తుతానికి ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌లో అందుబాటులో ఉన్నాయి. గూగుల్‌ ప్లేస్టోర్‌ ద్వారా ఈ యాప్‌లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

Updated Date - Jul 02 , 2024 | 04:00 AM