Share News

Hyderabad: అంతం చూసిన వివాహేతర బంధం!

ABN , Publish Date - Jun 16 , 2024 | 04:56 AM

వివాహేతర సంబంధాన్ని నిలదీస్తున్నాడని కన్న కొడుకునే కడతేర్చింది ఓ తల్లి. కుమారుడిని గొంతు నులిమి చంపేసి.. ఆపై ప్రియుడితో కలిసి బాలుడి మృతదేహాన్ని పారేసింది. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో ఈ దారుణం జరిగింది.

Hyderabad: అంతం చూసిన వివాహేతర బంధం!

  • వేర్వేరు ఘటనల్లో పలువురి హత్య.. నిందితులు కట్టుకున్న భార్య, భర్త, తల్లి

  • కొడుకును హత్యచేసిన తల్లి

  • వివాహేతర బంధాన్ని నిలదీస్తున్నాడని ఘాతుకం

పటాన్‌చెరు, జూన్‌ 15: వివాహేతర సంబంధాన్ని నిలదీస్తున్నాడని కన్న కొడుకునే కడతేర్చింది ఓ తల్లి. కుమారుడిని గొంతు నులిమి చంపేసి.. ఆపై ప్రియుడితో కలిసి బాలుడి మృతదేహాన్ని పారేసింది. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో ఈ దారుణం జరిగింది. ఈ నెల 11న ముత్తంగి సమీపంలోని ఔటర్‌ రింగ్‌ రోడ్డు పక్కన పొదల్లో పడేసి ఉన్న గుర్తు తెలియని బాలుడి మృతదేహానికి సంబంధించిన కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం పోల్కంపేట గ్రామానికి చెందిన కర్రె స్వాతి(30), ఆమె భర్త రాజు రామచంద్రాపురం పట్టణంలోని పాతబస్తీలో నివాసముంటున్నారు. వారికి కుమారుడు విష్ణువర్ధన్‌(9), కుమార్తె ఉన్నారు. కొంతకాలం క్రితం రాజు మృతిచెందాడు. అదే బస్తీలో ఉంటున్న ప్రకాశం జిల్లా సంతనూతలపాడు మండలం చీమకుర్తికి చెందిన దొంతు అనిల్‌(31)తో స్వాతి వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ క్రమంలో ఈ నెల 10న సాయంత్రం విష్ణువర్ధన్‌.. తల్లితో గొడవకు దిగాడు. వివాహేతర బంధంపై నిలదీశాడు.


ఆమె ఆగ్రహంతో బాలుడి గొంతు నులిమేయడంతో అతడు చనిపోయాడు. దీంతో నేరం నుంచి తప్పించుకోవాలని భావించిన స్వాతి.. టవల్‌తో బాలుడి మెడకు ఉరేసి కిటికీకి వేలాడదీసింది. ఇంటికి వచ్చిన కుమార్తె, సహజీవనం చేస్తున్న అనిల్‌తో విష్ణువర్ధన్‌ ఆత్మహత్య చేసుకున్నాడని నమ్మించింది. రాత్రి స్కూటీపై విష్ణువర్ధన్‌ మృతదేహాన్ని పెట్టుకుని స్వాతి, అనిల్‌.. ముత్తంగి ఔటర్‌ జంక్షన్‌కు చేరుకున్నారు. సర్వీస్‌ రోడ్డు పక్కన పొదల్లో మృతదేహాన్ని పడేశారు. సీసీ కెమెరాలను పరిశీలించిన పోలీసులు.. నిందితులను పట్టుకున్నారు.


ప్రియురాలిని కొట్టబోయిందని.. భార్యను చితకబాదిన భర్త

అంబర్‌పేట, జూన్‌ 15 (ఆంధ్రజ్యోతి): ప్రియురాలిని కొట్టబోయిన భార్యను.. ఆమె భర్త చితకబాదాడు. వివాహేతర సంబంధాన్ని నిలదీసినందుకు దారుణంగా కొట్టాడు. అంబర్‌పేట పోలీసు స్టేషన్‌ పరిధిలోని డీడీ కాలనీలో జరిగిందీ ఘటన. ముషీరాబాద్‌ రాంనగర్‌కు చెందిన కె. ప్రవీణ్‌కుమార్‌కు మెర్సీ ఏంజెల్‌తో 15 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వారికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. ప్రవీణ్‌ వ్యాపారం చేస్తాడు. అతడి వద్ద ఉషశ్రీ అనే మహిళ పనిలో చేరింది. ఉష శ్రీకి భర్త ఫణి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ క్రమంలో ప్రవీణ్‌, ఉషశ్రీల మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. దీంతో ప్రవీణ్‌ భార్య, పిల్లలను వదిలేశాడు. ఉషశ్రీ కూడా భర్త, పిల్లలను వదిలేసింది. వనస్థలిపురంలో ఉషశ్రీతో నాలుగు నెలల పాటు సహజీవనం చేసిన ప్రవీణ్‌.. రెండు నెలల క్రితం డీడీ కాలనీకి మకాం మార్చాడు. ఈ క్రమంలో శనివారం మెర్సీ ఏంజెల్‌ తన పిల్లలతో కలిసి డీడీ కాలనీలో ప్రవీణ్‌ ఉంటున్న నివాసానికి వెళ్లింది. అక్కడ ఉషశ్రీని కొట్టడానికి ప్రయత్నించగా.. ప్రవీణ్‌ అడ్డుకుని భార్య మెర్సీ ఏంజెల్‌ను చితకబాదాడు. ఈ విషయం అంబర్‌పేట పోలీసులకు తెలియడంతో వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని వారిని ఠాణాకు తీసుకెళ్లారు. సమాచారం తెలుసుకున్న ఉషశ్రీ భర్త ఫణి కూడా స్టేషన్‌కు చేరుకుని తన భార్యను తనతో పంపించాలని పోలీసులను కోరాడు. అయితే తనపై మెర్సీ దాడి చేసిందని ఉషశ్రీ అంబర్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేసింది.


భార్యను కొట్టి చంపిన భర్త

ఆదిలాబాద్‌ రూరల్‌, జూన్‌ 15 : భార్య ఇతరులతో వివాహేతర సంబంధం నెరుపుతోందని అనుమానించిన భర్త.. ఆమెను తీవ్రంగా కొట్టాడు. ఈ క్రమంలో దెబ్బలు గట్టిగా తగలడంతో ఆమె చనిపోయింది. ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలోని ఖుర్షీద్‌నగర్‌లో రోడ్డు పక్కన గుర్తుపట్టని స్థితిలో ఉన్న మహిళ మృతదేహం కేసును పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు. ఆదిలాబాద్‌లోని ఖుర్షీద్‌నగర్‌ కాలనీలో ఉండే ఆటో డ్రైవర్‌ ఖలీల్‌ఖాన్‌ ఈ నెల 12న అర్ధరాత్రి ఇంటికి వెళ్లాడు. అయితే, అతడిని చూసి.. ఇంట్లో నుంచి గుర్తు తెలియని వ్యక్తులు బయటకు పరిగెత్తారు. ఇది గమనించిన ఖలీల్‌ఖాన్‌ తన రెండో భార్య భారతి(35) అలియాస్‌ సల్మాతో వారికి వివాహేతర సంబంధం కొనసాగుతోందని అనుమానించి.. ఆమెను తీవ్రంగా కొట్టాడు. దీంతో ఆమె చనిపోయింది. అనంతరం ఖలీల్‌ తన ఆటోలో మృతదేహాన్ని తీసుకెళ్లి ఓ జిన్నింగ్‌ ఫ్యాక్టరీ పక్కన పడేశాడు. 13న ఉదయం స్థానికుల ద్వారా పోలీసులు విషయం తెలుసుకున్నారు.

Updated Date - Jun 16 , 2024 | 04:56 AM