Share News

Jangaon: ఆశ్రయమిచ్చి.. అత్యాచారం చేసి..

ABN , Publish Date - Oct 04 , 2024 | 03:09 AM

పునరావాస కేంద్రం నుంచి పారిపోయిన ఇద్దరు బాలికలను ఐదుగురు గ్యాంగ్‌రేప్‌ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Jangaon: ఆశ్రయమిచ్చి.. అత్యాచారం చేసి..

  • పునరావాస కేంద్రం నుంచి పారిపోయిన ఇద్దరు బాలికలపై గ్యాంగ్‌రేప్‌

  • ఐదుగురి అరెస్ట్‌.. జనగామలో ఘటన

  • ఆలస్యంగా వెలుగులోకి

సైదాబాద్‌, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి): పునరావాస కేంద్రం నుంచి పారిపోయిన ఇద్దరు బాలికలను ఐదుగురు గ్యాంగ్‌రేప్‌ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఉదంతంలో ఐదుగురు నిందితులను సైదాబాద్‌ పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. సైదాబాద్‌ ప్రాంతంలోని ఓ ఉమెన్స్‌ డీఅడిక్షన్‌ అండ్‌ రిహాబిలిటేషన్‌ సెంటర్‌ నుంచి గత నెల 24న ఉదయం ఇద్దరు బాలికలు పారిపోయారు. తర్వాత వారు బస్సులో జనగామ జిల్లా కేంద్రానికి చేరుకున్నారు. అక్కడ ఆ బాలికలు ఓ యువకుడిని ఫోన్‌ అడిగి తెలిసిన వ్యక్తికి ఫోన్‌ చేసి తాము జనగామలో ఉన్నామని.. అక్కడకు రావాలని చెప్పారు. అయితే తాను అందుబాటులో లేనని, మర్నాడు వస్తానని అతను చెప్పాడు.


దీంతో బాలికలు ఫోన్‌ ఇచ్చిన యువకుడు సాయి(25)ని తమకు ఆశ్రయం ఇవ్వాలని కోరారు. దీంతో బాలికలను అతడు తన స్నేహితుడి బేకరీ దుకాణంలో రాత్రి ఉంచాడు. అయితే ఆ యువకులిద్దరూ ఆ బాలికలను అత్యాచారం చేశారు. మర్నాడు జరిగిన విషయాన్ని ఇతర స్నేహితులకు చెప్పారు. అందరూ కలిసి కారులో బాలికలను ఆలేరుకు తీసుకువెళ్లే క్రమంలో మళ్లీ లైంగికదాడికి పాల్పడ్డారు. అనంతరం బాలికలను వారికి తెలిసిన వ్యక్తికి అప్పగించారు. అయితే మర్నాడు జనగామ బస్టాండ్‌కు ఆ బాలికలు తిరిగి రాగా అనుమానాస్పదంగా ఉన్న వారిని పోలీసులు విచారిస్తే జరిగిన ఘోరాన్ని వివరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న సైదాబాద్‌ పోలీసులు ఐదుగురు యువకులను మంగళవారం అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.

Updated Date - Oct 04 , 2024 | 03:09 AM