Share News

Hyderabad: ప్రభాకర్‌రావు, శ్రవణ్‌ను కోర్టులో హాజరుపర్చండి..

ABN , Publish Date - Jul 20 , 2024 | 03:34 AM

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌ ప్రభాకర్‌రావు, మరో నిందితుడు శ్రవణ్‌ను తమ ఎదుట హాజరుపరచాలని దర్యాప్తు అధికారులను న్యాయస్థానం ఆదేశించింది.

Hyderabad: ప్రభాకర్‌రావు, శ్రవణ్‌ను కోర్టులో హాజరుపర్చండి..

  • ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు దర్యాప్తు అధికారులకు జడ్జి ఆదేశం

  • అమెరికాకు హైదరాబాద్‌ పోలీసులు !

హైదరాబాద్‌, జూలై 19 (ఆంధ్రజ్యోతి) : ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌ ప్రభాకర్‌రావు, మరో నిందితుడు శ్రవణ్‌ను తమ ఎదుట హాజరుపరచాలని దర్యాప్తు అధికారులను న్యాయస్థానం ఆదేశించింది. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారణకు హాజరవుతానని ప్రభాకర్‌ రావు చేసుకున్న అభ్యర్థనను తోసిపుచ్చింది. ఇదే కేసులో అరెస్టయిన ప్రణీత్‌ రావు, రాధాకిషన్‌ రావు, భుజంగరావు, తిరుపతన్న రిమాండ్‌ గడువు ముగిసింది. దీంతో దర్యాప్తు అధికారులు వారిని నాంపల్లి 12వ ఏసీజేఎం కోర్టు జడ్జి ఈశ్వరయ్య ఎదుట శుక్రవారం హాజరుపరిచారు. ఈ నలుగురి రిమాండ్‌ను న్యాయమూర్తి జూలై 26 వరకు పొడిగించారు.


అయితే, ఏ1 ప్రభాకర్‌రావు, ఏ6 శ్రవణ్‌పై ఇది వరకే వారెంట్‌ జారీ అయినందున తదుపరి విచారణ నాటికి కోర్టులో హాజరుపరచాలని న్యాయమూర్తి ఆదేశించారు. అయితే, అనారోగ్యానికి గురైన వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నానని, వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారణకు హాజరవుతానని ప్రభాకర్‌ రావు లేఖ పంపారని ప్రభుత్వ న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు. ఇందుకు అంగీకరించని జడ్జి.. వారెంట్‌ ఇదివరకే జారీ అయినందున ప్రధాన నిందితులు ఇద్దరినీ తమ ఎదుట హాజరు పరచాల్సిందేనని స్పష్టం చేశారు. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ప్రధాన నిందితుడు ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌ ప్రభాకర్‌రావు, మరో నిందితుడు శ్రవణ్‌ను తదుపరి విచారణ నాటికి న్యాయస్థానంలో హాజరుపరచాలనే ఆదేశాల నేపథ్యంలో దర్యాప్తు అధికారులు కసరత్తు మొదలుపెట్టారు.


ప్రభాకర్‌రావును అరెస్టు చేసేందుకు హైదరాబాద్‌ పోలీసులు త్వరలో అమెరికా వెళ్లనున్నారు. న్యాయపరమైన సలహా తీసుకున్న అనంతరం ఒకటి, రెండు రోజుల్లో ప్రత్యేక బృందాన్ని అమెరికా పంపేందుకు సిద్ధమవుతున్నట్టు తెలిసింది. కాగా ట్యాపింగ్‌ పరికరాల కొనుగోలులో కీలకంగా వ్యవహరించిన శ్రవణ్‌ అజ్ఞాతంలో ఉన్నాడు. శ్రవణ్‌ ఆచూకీ కనిపెట్టి అరెస్టు చేసే పనిలో దర్యాప్తు అధికారులు ఇప్పటికే నిమగ్నమయ్యారు. కాగా, ‘విదేశాల్లో ఉన్న నిందితుల్ని ఇప్పటికిప్పుడు అరెస్ట్‌ చేసి తీసుకురావడం అంత తేలిక కాదు. న్యాయపరంగా ఎన్నో ఇబ్బందులు తలెత్తుతాయి.’ అని న్యాయనిపుణులు ఒకరు వివరించారు.

Updated Date - Jul 20 , 2024 | 03:34 AM