Share News

Regional Ring Road: 2 నుంచి 5 రెట్లు పెంపు!

ABN , Publish Date - Sep 03 , 2024 | 04:40 AM

రీజినల్‌ రింగ్‌ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) దక్షిణ భాగంలో భూసేకరణ చేయాల్సిన గ్రామాల్లోని భూముల రిజిస్ట్రేషన్‌ విలువలను సర్కారు భారీగా పెంచింది.

Regional Ring Road: 2 నుంచి 5 రెట్లు పెంపు!

  • ఆర్‌ఆర్‌ఆర్‌ దక్షిణ భాగంలో భూముల విలువ భారీగా పెంపు

  • సగటున 200ు.. కొన్ని గ్రామాల్లో 500 శాతం వరకు!

  • సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలతో ఆగమేఘాలపై విలువల సవరణ

  • రహదారికి 1946 హెక్టార్లు అవసరమని గుర్తింపు

  • 8 సగటున 200ు.. కొన్ని గ్రామాల్లో 500ు వరకు!

  • 8 సీఎం ఆదేశాలతో ఆగమేఘాలపై విలువల పెంపు

హైదరాబాద్‌, సెప్టెంబరు 2(ఆంధ్రజ్యోతి): రీజినల్‌ రింగ్‌ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) దక్షిణ భాగంలో భూసేకరణ చేయాల్సిన గ్రామాల్లోని భూముల రిజిస్ట్రేషన్‌ విలువలను సర్కారు భారీగా పెంచింది. ఏకంగా 200 నుంచి 500 శాతం (2 నుంచి 5 రెట్లు) వరకు పెంచేసింది! భూములు కోల్పోతున్న రైతులకు అధిక పరిహారం దక్కేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. గత నెల 28న స్పీడ్‌-19 ప్రాజెక్టుల సమీక్షలో భాగంగా సీఎం రేవంత్‌రెడ్డి ఆర్‌ఆర్‌ఆర్‌ దక్షిణ భాగంపై చర్చించారు. భూముల విలువల పెంపుపై స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. తక్షణమే భూసేకరణ చేసే ప్రాంతాల్లో ఇప్పుడున్న విలువలను సవరించాలని అధికారులను ఆదేశించారు. వెంటనే రంగంలోకి దిగిన అధికారులు ఆర్‌ఆర్‌ఆర్‌ దక్షిణ భాగంలో భూముల విలువపై కసరత్తు చేశారు.


రెండు రోజుల్లోనే ఆయా ప్రాంతాల్లో భూముల విలువలను పరిగణనలోకి తీసుకుని 2 నుంచి 5 రెట్లు పెంచుతూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. పెంచిన భూముల విలువలు ఈ నెల 1 నుంచి అమల్లోకి వచ్చినట్లు తెలిసింది. రీజినల్‌ రింగ్‌ రోడ్డుకు సంబంధించి ఉత్తర, దక్షిణ భాగంలో 350 కి.మీ. మేర నిర్మాణ పనులు చేపట్టనున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో 90 కి.మీ., రంగారెడ్డి జిల్లా పరిధిలో 149, సంగారెడ్డిలో 20, మెదక్‌లో 56, సిద్దిపేటలో 35 కి.మీ. మేర రహదారి నిర్మాణం జరగనుంది. దక్షిణ భాగంలో సంగారెడ్డి, అమన్‌గల్‌, షాద్‌నగర్‌, చౌటుప్పల్‌ పరిధిలో సుమారు 72 గ్రామాల్లో భూములు సేకరించనున్నారు. దక్షిణ భాగానికి సంబంధించి 189.20 కి.మీ. మేర రహదారి నిర్మాణానికి అవసరమైన భూముల విలువలను 200-500 శాతం వరకు పెంచారు. దక్షిణ భాగంలో 1946 హెక్టార్లు సేకరించాలని ప్రతిపాదించారు.


యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్‌లో 40 హెక్టార్లు, గుడిమల్కాపురంలో 40, సంస్థాన్‌ నారాయణపూర్‌లో 60, జనగాంలో 40, ఘాటుప్పల్‌లో 30 హెక్టార్ల చొప్పున సేకరించనున్నారు. ప్రస్తుతం చౌటుప్పల్‌లో రిజిస్ట్రేషన్‌ శాఖ పుస్తక విలువ కనిష్ఠంగా ఎకరా రూ.5 లక్షల నుంచి గరిష్ఠంగా రూ.24.2 లక్షల వరకు ఉంది. గుడిమల్కాపురంలో రూ.2-3.5 లక్షలు, సంస్థాన్‌ నారాయణపూర్‌లో రూ.2-24.2 లక్షలు, జనగాంలో రూ.1-9.68 లక్షల వరకు ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో ఉన్న బహిరంగ మార్కెట్‌ విలువలను పరిగణనలోకి తీసుకున్న అధికారులు వీటిని 200-500 శాతం వరకు పెంచారు. రంగారెడ్డి జిల్లా గొల్లపల్లిలో రూ.4.5-8 లక్షల వరకు ఉంది.


ఇదే జిల్లా అప్పారెడ్డిపల్లిలో కనిష్ఠంగా రూ.80 వేలు ఉంది. శెట్టిపల్లిలో రూ.60 వేల నుంచి గరిష్ఠంగా రూ.9.68 లక్షల వరకు ఉంది. రంగారెడ్డి జిల్లా అమన్‌గల్‌ పరిధిలో రూ.3-48.4 లక్షలుగా ఉంది. ఇదే జిల్లా యడవల్లిలో మాత్రం కనిష్ఠ, గరిష్ఠ పుస్తక విలువ రూ.60 వేలే ఉంది. సంగారెడ్డి జిల్లా పరిధిలోని గిల్లపల్లి, టెరిపోల్‌, తోగ్రపల్లి, పెద్దాపూర్‌ గ్రామాల్లో భూసేకరణ చేయనున్నారు. టెరిపోల్‌ పరిధిలో పుస్తక విలువ ప్రకారం కనిష్ఠంగా రూ.80 వేలు, గరిష్ఠంగా రూ.90 వేలు ఉంది. సంగారెడ్డి జిల్లా పరిధిలోభూమి విలువ 500 శాతం పెంచినట్లు తెలిసింది. రంగారెడ్డి జిల్లా ఖానాపూర్‌, కిష్టాపూర్‌ గ్రామాలకు సంబంధించి భూముల విలువ గరిష్ఠంగా రూ.4 లక్షలే ఉంది. ఈ ప్రాంతాల్లోనూ భూముల విలువను 200-500 శాతం వరకు పెంచారు. ఇదే జిల్లా తలరాం, తంగడపల్లి పరిధిలో కనిష్ఠంగా రూ.2 లక్షలు, గరిష్ఠంగా రూ.6 లక్షల విలువ ఉండగా ఇక్కడా 200-500 శాతం మధ్యలో పెంచారు.


  • రైతులు నష్టపోకుండా ఉండాలనే..

ఆర్‌ఆర్‌ఆర్‌ భూసేకరణ ఖర్చును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 50 శాతం చొప్పున భరించే అవకాశంఉంది. ఈ క్రమంలో భూములిచ్చే రైతులు నష్టపోకుండా భూముల విలువలను సర్కారు సవరించింది.

Updated Date - Sep 03 , 2024 | 04:40 AM