Share News

రూ.7 కోట్ల హెరాయిన్‌ పట్టివేత..

ABN , Publish Date - Jul 21 , 2024 | 04:38 AM

నగరంలో హెరాయిన్‌ విక్రయించే ముఠా ఆటను తెలంగాణ యాంటీ నార్కోటిక్స్‌ బ్యూరో(టీజీ న్యాబ్‌), శంషాబాద్‌ ఎస్‌వోటీ, మాదాపూర్‌ పోలీసులు కట్టించారు. ఈ ముఠా నుంచి రూ.7 కోట్ల విలువైన కిలో హెరాయిన్‌ను సీజ్‌ చేశారు.

రూ.7 కోట్ల హెరాయిన్‌ పట్టివేత..

  • రాజస్థాన్‌ నుంచి బస్సుల్లో హైదరాబాద్‌కు జైలులో ఉంటూనే.. కింగ్‌పిన్‌ దందాఅంతర్రాష్ట్ర ముఠా ఆటకట్టు

  • అంతర్రాష్ట్ర ముఠా ఆటకట్టు..

  • మరో కేసులో.. ఇద్దరి అరెస్టు

  • మల్కాజిగిరిలో గంజాయి చాక్లెట్ల సీజ్‌

హైదరాబాద్‌ సిటీ, జూలై 20 (ఆంధ్రజ్యోతి): నగరంలో హెరాయిన్‌ విక్రయించే ముఠా ఆటను తెలంగాణ యాంటీ నార్కోటిక్స్‌ బ్యూరో(టీజీ న్యాబ్‌), శంషాబాద్‌ ఎస్‌వోటీ, మాదాపూర్‌ పోలీసులు కట్టించారు. ఈ ముఠా నుంచి రూ.7 కోట్ల విలువైన కిలో హెరాయిన్‌ను సీజ్‌ చేశారు. శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌ అవినాశ్‌ మొహంతి వివరాలను వెల్లడించారు. రాజస్థాన్‌లోని నాగోర్‌ జిల్లా రాథోడ్‌కెవా ప్రాంతానికి చెందిన సంతోష్‌ ఆచార్య దేశవ్యాప్తంగా డ్రగ్స్‌ నెట్‌వర్క్‌ను నడుతుపుతున్నాడు. డ్రగ్స్‌ కేసుల్లో ఇతను జోధ్‌పూర్‌ జైలులో ఉన్నా.. లోపలి నుంచే తన నెట్‌వర్క్‌ను నడుపుతున్నాడు.


నాగోర్‌ జిల్లాకు చెందిన నేమీచంద్‌ భాటీ, నర్పత్‌సింగ్‌ ద్వారా ఇతను హైదరాబాద్‌కు హెరాయిన్‌ సరఫరా చేస్తున్నాడు. వీరిద్దరూ బస్సుల్లో ప్రయాణిస్తూ.. హెరాయిన్‌ను తరలిస్తారు. నేమీచంద్‌కు నగరంలోని అబ్దుల్లాపూర్‌మెట్‌లో ఉండే అతని సోదరుడు అజయ్‌ భాటీ, చౌటుప్పల్‌కు చెందిన హరీశ్‌ సాల్వీ సహకరిస్తున్నారు. వీరంతా శనివారం శిల్పారామం వద్ద కస్టమర్లకు హెరాయిన్‌ విక్రయించేందుకు సిద్ధమయ్యారు. ఈ గ్యాంగ్‌ కదలికలపై ఉప్పందుకున్న టీజీ న్యాబ్‌, శంషాబాద్‌ ఎస్‌వోటీ, మాదాపూర్‌ పోలీసులు నలుగురిని అరెస్టు చేసి, వారి వద్ద 250 గ్రాముల చొప్పున నాలుగు ప్యాకెట్లలో ఉన్న కిలో హెరాయిన్‌(విలువ 7 కోట్లు)ను స్వాధీనం చేసుకున్నారు.


ర్యాపిడో డ్రైవర్లతో సరఫరా

మరో కేసులో.. హెరాయిన్‌ సరఫరా చేస్తున్న ముగ్గురు ర్యాపిడో డ్రైవర్లను మహేశ్వరం ఎస్‌వోటీ, ఎల్‌బీనగర్‌, సరూర్‌నగర్‌, మేడిపల్లి పోలీసులు అరెస్టు చేశారు. రాజస్థాన్‌లోని బార్మేర్‌ జిల్లా గూడ్మలానీ గ్రామానికి చెందిన అన్నదమ్ములు రమేశ్‌ కమార్‌, మాహదేవ్‌ రామ్‌ నగరంలోని ఎర్రగడ్డలో ఉంటూ.. ర్యాపిడో డ్రైవర్లుగా పనిచేస్తున్నారు. వీరిద్దరూ కలిసి.. రాజస్థాన్‌కు చెందిన వీరంగోయల్‌తో ముఠాగా ఏర్పడ్డారు. వీరంతా హెరాయిన్‌కు అలవాటు పడి.. ఏడాది కాలంగా విక్రయాలను ప్రారంభించారు. రాజస్థాన్‌కు చెందిన దినేశ్‌కల్యాణ్‌ అనే వ్యక్తి నుంచి హెరాయిన్‌ కొనుగోలు చేసి, నగరంలో విక్రయిస్తున్నారు. ఈ దందాపై సమాచారం అందుకున్న పోలీసులు రమేశ్‌, మహదేవ్‌లను అరెస్టు చేసి 34 గ్రాముల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు.


గంజాయి, చాక్లెట్ల పట్టివేత

మేడ్చల్‌-మల్కాజిగిరి ఎక్సైజ్‌ పోలీసులు నిర్వహించిన దాడుల్లో 1.7 కిలోల గంజాయి, 390 గ్రాముల గంజాయి చాక్లెట్లను సీజ్‌ చేశారు. ఘట్‌కేసర్‌లోని లారిసార్ట్‌లో అనుమతుల్లేకుండా మద్యం పార్టీ జరుగుతోందని కీసర ఎక్సైజ్‌ పోలీసులకు సమాచారం అందింది. వారు రిసార్టుపై దాడిచేయగా గంజాయి, గంజాయి చాక్లెట్లతోపాటు 2.6 లీటర్ల లిక్కర్‌ను స్వాధీనం చేసుకుని, రిసార్ట్‌ యజమానిపై కేసు నమోదు చేశారు.


రూ.42.50లక్షల గంజాయి సీజ్‌

మునిపల్లి: ఆంధ్రా-ఒడిసా సరిహద్దుల నుంచి మహారాష్ట్రలోని బీడ్‌ ప్రాంతానికి తరలిస్తున్న 115 కిలోల గంజాయిని ఎక్సైజ్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ42.5 లక్షలుగా ఉంటుందని ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ మెదక్‌ డివిజన్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ శ్రీనివా్‌సరెడ్డి వెల్లడించారు.

Updated Date - Jul 21 , 2024 | 04:38 AM