Share News

Venu Swamy: హైకోర్టుకు చేరిన జోతిష్యుడు వేణుస్వామి పంచాయితీ..

ABN , Publish Date - Aug 20 , 2024 | 07:21 PM

ప్రముఖ జోతిష్యుడు వేణుస్వామి(Venu Swamy) వివాదం తెలంగాణ హైకోర్టు(Telangana High Court)కు చేరింది. ఇటీవల నటుడు అక్కనేని నాగచైతన్య, శోభితా ధూళిపాళ్ల నిశ్చితార్ధంపై ఆయన చేసిన వ్యాఖ్యలకు గాను మహిళా కమిషన్ నోటీసులు ఇచ్చింది. తనకు నోటీసులు ఇవ్వడాన్ని హైకోర్టులో వేణుస్వామి సవాల్ చేశారు.

Venu Swamy: హైకోర్టుకు చేరిన జోతిష్యుడు వేణుస్వామి పంచాయితీ..

హైదరాబాద్: ప్రముఖ జోతిష్యుడు వేణుస్వామి(Venu Swamy) వివాదం తెలంగాణ హైకోర్టు(Telangana High Court)కు చేరింది. ఇటీవల నటుడు అక్కనేని నాగచైతన్య, శోభితా ధూళిపాళ్ల నిశ్చితార్ధంపై ఆయన చేసిన వ్యాఖ్యలకు గాను మహిళా కమిషన్ నోటీసులు ఇచ్చింది. తనకు నోటీసులు ఇవ్వడాన్ని హైకోర్టులో వేణుస్వామి సవాల్ చేశారు. ఈ మేరకు విచారణ చేపట్టిన హైకోర్టు.. స్వామికి నోటీసులు ఇవ్వడానికి ఎలాంటి అర్హత ఉందని మహిళా కమిషన్‌ను ప్రశ్నించింది. అతను జ్యోతిష్యాల పేరుతో అసత్య, మోసపూరిత వ్యాఖ్యలు చేస్తున్నాడంటూ పబ్లిక్ ప్రాసిక్యూటర్ హైకోర్టుకు తెలిపారు. ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు తదుపరి విచారణను రేపటికి(బుధవారం) వాయిదా వేసింది.


అసలేం జరిగిందంటే?

జ్యోతిష్యుడు వేణుస్వామి ప్రముఖులపై వ్యాఖ్యలు చేస్తూ తరచూ వార్తలో నిలుస్తుంటారు. గతంలోనూ ఆయన అనేక మంది సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలపై మాట్లాడారు. నాగచైతన్య, సమంత వివాహ సమయంలోనూ వారు త్వరలో విడిపోతారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. అలాగే కొణిదల ఉపాసన, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సహా అనేక మంది గురించి ఆయన తీవ్రంగా మాట్లాడారు. దీనిపై ఆయా హీరో, హీరోయిన్ల ఫ్యాన్స్ అతనిపై నిప్పులు చెరిగారు.


అయితే తాజాగా నాగచైతన్య, శోభితా నిశ్చితార్ధం జరగగా.. వారు త్వరలో విడిపోతారంటూ వేణుస్వామి చేసిన వ్యాఖ్యలపై అక్కినేని ఫ్యాన్స్ మండిపడ్డారు. అసలే సమంతతో విడిపోయి ఇప్పుడిప్పుడే కుదుటపడుతున్న తమ అభిమాన హీరో జీవితం గురించి మాట్లాడడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్త జంట వైవాహిక జీవితంపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని కొందరు జర్నలిస్టులు, ఫ్యాన్స్ ఆయనపై మహిళా కమిషన్‍కు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ నేరెళ్ల శారద ఆయనకు నోటీసులు జారీ చేశారు. అయితే నోటీసులు సవాల్ చేస్తూ ఆయన హైకోర్టు తలుపు తట్టారు.

Updated Date - Aug 20 , 2024 | 07:21 PM