Share News

Hyderabad: పుట్టిన రోజే చివరి రోజైంది..!

ABN , Publish Date - Sep 17 , 2024 | 03:22 AM

పుట్టినరోజే ఆ యువకుడికి ఆఖరి రోజైంది.. కెనడాలో హైదరాబాదీ దురదృష్టవశాత్తు నీట మునిగి మరణించాడు.

Hyderabad: పుట్టిన రోజే చివరి రోజైంది..!

  • కెనడాలో హైదరాబాద్‌ యువకుడి మృతి

  • సరస్సులో ఈత కొట్టేందుకు దిగి మునక..

సరూర్‌నగర్‌, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): పుట్టినరోజే ఆ యువకుడికి ఆఖరి రోజైంది.. కెనడాలో హైదరాబాదీ దురదృష్టవశాత్తు నీట మునిగి మరణించాడు. పుట్టినరోజున సంతోషంగా గడిపేందుకు స్నేహితులతో బయటికెళ్లిన అతడు.. సరస్సులో ఈత కొట్టేందుకు దిగి మునిపోయి మృతి చెందాడు. దీంతో యువకుడి స్వస్థలం మీర్‌పేటలోని అయోధ్యనగర్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి. అడుప రవి-సునీత దంపతులకు ఇద్దరు కుమారులు.. ప్రస్తుతం వారిద్దరూ కెనడాలోనే ఉన్నారు. చిన్న కుమారుడు ప్రణీత్‌ (26) పీజీ పూర్తి చేసి ఉద్యోగాన్వేషణలో ఉన్నాడు.


అయితే ఆదివారం అతడి పుట్టినరోజు కావడంతో శనివారం రాత్రే తన అన్న, మరో నలుగురు స్నేహితులతో కలిసి టొరంటోలోని లేక్‌ క్లియర్‌కు వెళ్లాడు. రాత్రి అక్కడే బసచేసిన వారు.. ఉదయాన్నే సరస్సులో ఈత కొట్టేందుకు దిగారు. ఈ నేపథ్యంలోనే ప్రణీత్‌ సరస్సు లోపలికెళ్లడంతో నీట మునిగి ఊపిరాడక మృత్యువాతపడ్డాడు. వెంటనే అక్కడి పోలీసులకు సమాచారమివ్వగా గజ ఈతగాళ్లతో మృతదేహాన్ని బయటకు తీయించారు. ఈ విషాద వార్త తెలిసి అయోధ్యనగర్‌లో ప్రణీత్‌ కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

Updated Date - Sep 17 , 2024 | 03:22 AM