Share News

Mahabubabad: ఉరేసుకుని ప్రేమజంట ఆత్మహత్యా యత్నం

ABN , Publish Date - Jun 18 , 2024 | 05:56 AM

విడిపోవాల్సి వస్తుందేమోనన్న భయమో.. పెద్దలు ఒప్పుకోరన్న ఆందోళనో తెలియదు కాని.. ఓ ప్రేమజంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన మహబూబాబాద్‌ జిల్లా బయ్యారం మండలం కోటగడ్డ గ్రామంలో సోమవారం జరిగింది.

Mahabubabad: ఉరేసుకుని ప్రేమజంట ఆత్మహత్యా యత్నం

  • ప్రియురాలు మృతి.. ఉరి బిగుసుకోకపోవడంతో గొంతుకోసుకున్న ప్రియుడు

  • మహబూబాబాద్‌ జిల్లా బయ్యారం మండలం కోటగడ్డలో ఘటన

బయ్యారం, జూన్‌ 17: విడిపోవాల్సి వస్తుందేమోనన్న భయమో.. పెద్దలు ఒప్పుకోరన్న ఆందోళనో తెలియదు కాని.. ఓ ప్రేమజంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన మహబూబాబాద్‌ జిల్లా బయ్యారం మండలం కోటగడ్డ గ్రామంలో సోమవారం జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... కోటగడ్డ గ్రామానికి చెందిన కొటెం లక్ష్మీనారాయణ, నీలమ్మ దంపతుల కుమార్తె రవళి(21)కి మూడేళ్ల క్రితం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన వ్యక్తితో వివాహం కాగా.. భర్తతో మనస్పర్థల కారణంగా కొంతకాలంగా రవళి పుట్టింట్లోనే ఉంటోంది. ఈ క్రమంలో కోటగడ్డకు చెందిన 23ఏళ్ల మెండు రవీందర్‌తో రవళికి పరిచయం ఏర్పడి అదికాస్తా ప్రేమకు దారితీసింది. కొన్నాళ్ల క్రితం రవీందర్‌ తల్లిదండ్రులు యాదాద్రి భువనగిరి జిల్లా రాయగిరి సమీపంలోని ఓ గ్రామానికి వలస వెళ్లడంతో అతను అక్కడే ఉంటున్నాడు.


అప్పుడప్పుడు స్వగ్రామైన కోటగడ్డకు రాకపోకలు సాగిస్తున్నాడు. కాగా, సుమారు మూడు నెలల క్రితం రవీందర్‌, రవళి కనిపించకుండా పోయారు. ఆ సమయంలోనే వారు వివాహం చేసుకున్నారనే వార్తలు వచ్చాయి. అయితే తమ కూతురు కనిపించడంలేదని రవళి తల్లిదండ్రులు, తమ కుమారుడు కనిపించడంలేదని రవీందర్‌ కుటుంబ సభ్యులు రాయగిరి పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదులు చేశారు. దీంతో అదృశ్యం కేసులు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టి రవీందర్‌ను, రవళిని తీసుకొచ్చి వారి వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మూడు రోజుల క్రితం రవీందర్‌ స్వగ్రామానికి రాగా, ఆదివారం రాత్రి రవళి రహస్యంగా అతనింటికి వెళ్లింది. మేడపై నిద్రించిన వాళ్లిద్దరూ తెల్లవారుజామున ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకుని ఉరేసుకున్నారు.


ఉరి బిగుసుకొని రవళి అక్కడికక్కడే మృతి చెందగా.. ఉరి బిగుసుకోకపోవడంతో బతికిన రవీందర్‌ గొంతుకోసుకున్నాడు. గడియపెట్టి ఉండటంతో అనుమానం వచ్చిన రవీందర్‌ కుటుంబసభ్యులు తలుపులు పగలగొట్టి చూడగా.. ఉరివేసుకొన్న రవళి అప్పటికే మృతి చెందగా.. గొంతుకోసుకున్న రవీందర్‌ రక్తపుమడుగులతో ప్రాణాపాయ స్థితిలో ఉండటాన్ని చూసి తొలుత జిల్లా ఆస్పత్రికి అక్కడి నుంచి వరంగల్‌ ఎంజీఎంకు తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. శవపరీక్ష అనంతరం పోలీసులు రవళి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించగా.. అంత్యక్రియలు నిర్వహించారు.

Updated Date - Jun 18 , 2024 | 05:56 AM