Share News

Mahabubabad: మమ్మల్ని అన్యాయంగా సస్పెండ్‌ చేశారు

ABN , Publish Date - Jun 09 , 2024 | 04:07 AM

పచ్చిరొట్ట విత్తనాలు పక్కదారి పట్టిన వ్యవహారంలో విచారణాధికారి తప్పుడు నివేదికను ఇచ్చారని.. అందులో తమకు ఎలాంటి ప్రమేయం లేదని సస్పెండైన ఏఈవోలు అరవింద్‌, జమున, దీపిక మహబూబాబాద్‌ జిల్లా వ్యవసాయాధికారికి శనివారం లేఖ రాశారు.

 Mahabubabad: మమ్మల్ని అన్యాయంగా సస్పెండ్‌ చేశారు

  • విచారణాధికారి తప్పుడు నివేదిక ఇచ్చారు..

  • మహబూబాబాద్‌ జిల్లా డీఏవోకు సస్పెండైన ఏఈవోల లేఖ

హైదరాబాద్‌, జూన్‌ 8 (ఆంధ్రజ్యోతి): పచ్చిరొట్ట విత్తనాలు పక్కదారి పట్టిన వ్యవహారంలో విచారణాధికారి తప్పుడు నివేదికను ఇచ్చారని.. అందులో తమకు ఎలాంటి ప్రమేయం లేదని సస్పెండైన ఏఈవోలు అరవింద్‌, జమున, దీపిక మహబూబాబాద్‌ జిల్లా వ్యవసాయాధికారికి శనివారం లేఖ రాశారు. తమను అన్యాయంగా సస్పెండ్‌ చేశారని.. పునర్విచారణ చేపట్టి సస్పెన్షన్‌ ఎత్తేయాలని కోరారు. మే 18న తొర్రూర్‌ ఆగ్రోస్‌-1, పీఏసీఎస్‌ తొర్రూర్‌ ఆగ్రోస్‌-2, ఆగ్రోస్‌-4 సామవరపుకుంటతండా కేంద్రాలకు 500 క్వింటాళ్ల పచ్చిరొట్ట విత్తనాల స్టాక్‌ వచ్చిన విషయం తమకు సమాచారమే లేదని, సీడ్‌ సేల్‌ పాయింట్‌ దగ్గర కూడా ఎటువంటి అలాట్‌మెంట్‌ జరగలేదని లేఖలో పేర్కొన్నారు.


అయితే స్టాక్‌ వచ్చిందంటూ మే 22న ఏవో కె.సోమకుమార్‌ తమకు వాట్సాప్‌ గ్రూప్‌ ద్వారా సమాచారమిచ్చారని, సేల్‌ పాయింట్‌ అలాట్‌మెంట్‌ చెక్‌ చూసుకునే లోపే దాదాపు 50 శాతం మేర విత్తనాలు ఆన్‌లైన్‌లోనే అయిపోయాయని తెలిపారు. ఏవో సోమకుమార్‌ లాగిన్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ను సేల్‌పాయింట్‌ వారికి ఇవ్వడంతో.. వారే రైతుల పేరిట ఆన్‌లైన్‌ పర్మిట్స్‌ జనరేట్‌ చేశారని వెల్లడించారు. కాగా, ముగ్గురు ఏఈవోలను సస్పెండ్‌ చేస్తూ శుక్రవారం వ్యవసాయ శాఖ డైరెక్టర్‌ ఉత్తర్వులను జారీ చేసిన విషయం తెలిసిందే.

Updated Date - Jun 09 , 2024 | 04:07 AM